Chandrayaan-3 | న్యూఢిల్లీ, జూలై 5: భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నెల 13 శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ను ప్రారంభించనున్నారు. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇక ప్రయోగమే తరువాయి. ప్రయోగం తర్వాత రెండు నెలలపాటు ప్రయాణించనున్న స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ల్యాండింగ్తో దాని జర్నీ ముగుస్తుంది. ఆ తర్వాత జాబిల్లిపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలోనూ చంద్రయాన్ మిషన్లు చేపట్టింది. మొత్తం ప్రయోగంలో సాఫ్ట్ల్యాండింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్-2 సాఫ్ట్లాండింగ్లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ప్రయోగం కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే, ఇప్పుడు కూడా సాఫ్ట్ల్యాండింగ్ ఏమంత సులభం కాదన్నది నిపుణుల మాట.
సాఫ్ట్ల్యాండింగ్కు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అవసరం. ల్యాండర్ను సరిగ్గా ఎక్కడ ల్యాండ్ చేయాలన్న కచ్చితమైన పిన్పాయింట్ నేవిగేషన్ గైడెన్స్తోపాటు ఫ్లైడనమిక్స్ కచ్చితంగా ఉండాలి. సరైన సమయంలో సరైన వేగంతో సరైన ల్యాండింగ్ స్పాట్ను చేరుకోవడం కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత అది చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంటుంది. ఇందుకోసం థ్రస్టర్ల (ఇంజిన్లు)ను మండిస్తారు. ఈ ఏడాది జపాన్ పంపిన హకుటో-ఆర్ ల్యాండర్ కూడా ఇలాంటి కఠిన పరిస్థితినే ఎదుర్కొని విఫలమైంది.
ల్యాండర్ను చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ల్యాండింగ్ చేయడం ఎంత కీలకమో, అది దిగే ప్రదేశం కూడా అంతే ముఖ్యం. పెద్దపెద్ద క్రేటర్లు (లోయలు), వదులుగా, కఠినంగా ఉండే ఉపరితలం అతిపెద్ద సవాలుగా మారుతాయి. చంద్రయాన్-3లో రెండు ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్, అవాయిడెన్స్ కెమెరాలు ఉపయోగించారు. అవి పంపే ఫొటోలను బట్టి దానిని ఎక్కడ ల్యాండ్ చేయాలన్న తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎక్కడ ల్యాండ్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని దానికి పంపినా అవి అందడం లేటైతే మాత్రం తనంత తానే నిర్ణయం తీసుకుంటుంది. జాబిల్లి మనకు చూడడానికి అందంగా కనిపించినా దానిని చేరుకోవడం, ల్యాండర్ సాఫ్ట్ల్యాండింగ్ అంత ఆషామాషీ వ్యవహారం కాదు.