పాట్నా: జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివాదంలో ఇరుక్కున్నారు. తేజస్ రైలులో ప్రయాణించిన ఆయన.. తోటి ప్రయాణికులతో ఇబ్బందికర రీతిలో ప్రవర్తించారు. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. సెకండ్ ఏసీ కోచ్లో ఆయన బనియన్, అండర్వేర్లో అటూ ఇటూ తిరిగారు. దీనిపై ఆ కోచ్లో ఉన్న ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీలోని దిల్దార్ నగర్ జంక్షన్ వద్ద .. లోదుస్తుల్లో ఉన్న ఎమ్మెల్యేకు.. ఆ కోచ్లో ఉన్న ఇతర ప్యాసింజెర్ల మధ్య వాగ్వాదం జరిగింది. వాష్రూమ్కు వెళ్లేందుకు ఆయన ఇతర ప్యాసింజెర్ల ముందే బట్టలు విప్పేశారు. అయితే ఎమ్మెల్యే గోపాల్ వ్యవహార శైలిని ప్రహ్లాద్ పాశ్వాన్ అనే వ్యక్తి ఖండించారు. ఫ్యామిలీ ముందు ఇలా బట్టలు విప్పడం సరికాదు అని ఆ ఎమ్మెల్యేతో అతను వాదించాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల ఘర్షణ మొదలైంది. ఓ దశలో ఆర్పీఎఫ్ పోలీసులు వచ్చి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో తేజస్ రైలును దిల్దార్నగర్ జంక్షన్లో నిలిపేశారు.
టాయిలెట్కు వెళ్తుంటే..
రైలులో లోదుస్తుల్లో వాష్రూమ్కు పరుగెత్తిన ఘటన గురించి ఎమ్మెల్యే గోపాల్ రియాక్ట్ అయ్యారు. తన కడుపు గడబిడ పెట్టడం వల్లే తాను తొందరలో అండర్గార్మెంట్స్తో పరుగుపెట్టినట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రైలు ఎక్కిన వెంటనే.. మరుగుదొడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, తక్షణమే కుర్తా పైజామా విప్పేసి.. భుజంపై టవల్ వేసుకుని శౌచాలయానికి వెళ్లాలనన్నారు. టవల్ను తన నడుముకు చుట్టుకునే టైమ్ లేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ సంఘటనను ఆయన వివరిస్తూ.. మరుగుదొడ్డికి వెళ్తునప్పుడు ఓ వ్యక్తి నన్ను అడ్డుకున్నాడని, నగ్నంగా ఎక్కడికి వెళ్తున్నావని అడిగారని, చేయిని పట్టుకుని అతనే నన్ను డిస్టర్బ్ చేశాడని, అయినా తాను తొందరగా టాయిలెట్కు వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరుగుదొడ్డి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వివరాలు తెలుసుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.