బెంగళూరు: ఇండియాలో అగ్లీయెస్ట్ లాంగ్వేజ్ ఏది అని అడిగిన ప్రశ్నకు కన్నడ అన్న ఫలితాలు చూపించింది గూగుల్. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీలు, అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గూగుల్కు లీగల్ నోటీసు జారీ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో వెంటనే దిగి వచ్చిన ఈ సంస్థ క్షమాపణ చెప్పింది. అయినా సెర్చ్ ఫలితాలు తమ అభిప్రాయం కాదు అన్న వివరణ ఇచ్చింది.
అలాంటి సమాధానం చూపించిన గూగుల్కు లీగల్ నోటీసు జారీ చేస్తామని కన్నడ, సాంస్కృతిక, అటవీశాఖ మంత్రి అరవింద్ లింబావళి స్పష్టం చేశారు. ఆ తర్వాత ట్విటర్లోనూ గూగుల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉన్నదని, తరాలుగా కన్నడిగులకు గర్వకారణంగా నిలిచిందని ఆయన అన్నారు. కన్నడిగులను అవమానించిన గూగుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఓ గూగుల్ అధికార ప్రతినిధి స్పందించారు. సెర్చ్ ఫలితాలు ప్రతిసారీ పర్ఫెక్ట్గా చూపించవని, ఒక్కోసారి ఆశ్చర్యకర ఫలితాలు ఇస్తాయని అన్నారు. దీనిపై తాము తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ సెర్చ్ ఫలితాలు గూగుల్ అభిప్రాయం కాదన్న విషయాన్ని కూడా గమనించాలని ఆయన అన్నారు.