చండీగఢ్: ఉద్రిక్తతలు తలెత్తిన పంజాబ్లోని పాటియాలాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో కర్ఫ్యూను ఎత్తివేయడంతోపాటు ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. శనివారం ఉదయం కర్ఫ్యూ ఎత్తివేశామని, సాయంత్రం నాలుగు గంటలకు ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు పాటియాలా డిప్యూటీ కమిషనర్ సాక్షి సిన్హా తెలిపారు. కాగా, ఈ అల్లర్లకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పాటియాలా ఎస్ఎస్పీ దీపక్ పారిక్ తెలిపారు. అరెస్టైన వారిలో హరీష్ సింగ్లా, కుల్దీప్ సింగ్ దంతాల్, దల్జీత్ సింగ్ ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వీడియో సాక్ష్యాలను పరిశీలించామని, దీంతో మరింత మంది నిందితులను అరెస్ట్ చేస్తామని అన్నారు. శనివారం సాయంత్రానికి 24 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏ ఒక్కరినీ వదలబోమని, ప్రతి నిందితుడిని అరెస్టు చేస్తామని దీపక్ పారిక్ స్పష్టం చేశారు.
పాటియాలాలో శుక్రవారం తలెత్తిన శాంతిభద్రతల సమస్యకు సంబంధించి పోలీసులు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పాటియాలా ఐజీ ఎంఎస్ చనియా తెలిపారు. శివసేన నేత హరీష్ సింగ్లాతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు, అల్లర్లకు సూత్రధారి అయిన బర్జిందర్ సింగ్ పర్వానాను త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు. అతడికి నేర చరిత్ర ఉందని, నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. హరీష్ సింగ్లాను రెండు రోజుల పోలీస్ రిమాండ్కు కోర్టు అనుమతించిందని చెప్పారు. ఇకపై నగరంలో జరిగే ఊరేగింపులో ఇలాంటి వాతావరణం కల్పించబోమని శాంతి కమిటీ సభ్యులు హామీ ఇచ్చారని వెల్లడించారు.
శివసేనకు చెందిన పంజాబ్ విభాగం పంజాబ్ శివసేన (బాల్ ఠాక్రే) శుక్రవారం యాంటీ ఖలిస్థాన్ మార్చ్ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు, నిహాంగ్స్ మరో ర్యాలీ చేపట్టారు. నగరంలోని కాళీమాత ఆలయం వద్ద రెండు గ్రూపులు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వడంతోపాటు కత్తులు దూసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఘర్షణల నేపథ్యంలో శనివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతోపాటు సాయంత్రం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.