న్యూఢిల్లీ, జూలై 19: భారత్లో చెడు కొలెస్ట్రాల్ మహమ్మారిగా విస్తరిస్తున్నదని ‘ఐసీఎంఆర్’ తాజా అధ్యయనం పేర్కొన్నది. ప్రతి 10 మంది పెద్దవాళ్లలో 9మందికి ఈ చెడు కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిల్లో ఉందని పేర్కొన్నది. దీనివల్ల అనేకమందికి చిన్న వయస్సుల్లోనే(30-39) గుండె జబ్బులు, మెదడులో స్ట్రోక్ తలెత్తడానికి కారణమవుతున్నదని అంచనావేసింది. దేశవ్యాప్తంగా 23,665 మంది పెద్దవాళ్ల ‘లిపిడ్ ప్రొఫైల్స్’ (రక్తంలోని కొవ్వులపై) విశ్లేషించగా కీలక విషయాలు వెలుగుచూశాయి. ఉదాహరణకు రక్తంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) ఎక్కువగా ఉండి..ఎల్డీఎల్ (ట్రై గ్లిజరైడ్స్-చెడు కొవ్వు) తక్కువగా ఉండటం ఆరోగ్యకర లక్షణం. కానీ 66.8శాతం మంది పెద్దవాళ్లలో హెచ్డీఎల్ తక్కువగా ఉంది. 49.4 శాతం మందిలో ఎల్డీఎల్ అధిక స్థాయిలో ఉందని తేలింది.