తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన, మధ్య యుగ చరిత్రల్లో జైన సంప్రదాయనువర్తనులైన పలువురు గురువులు వైద్యవిద్యలో ఆరితేరిన వారుగా కనిపిస్తున్నారు. అటువంటివారిలో 11వ శతాబ్దికి చెందిన జైన వైద్యాచార్యుడు, మహా సామంతుడైన అగ్గలయ్య ఒకడు. ఇతడు ఆలేరు-40, కొల్లిపాక-7000లో ఉన్న ముప్పనపల్లిలో బుద్ధసేన జినాలయం, ఇక్కురికిలో వైద్యరత్నాకర జినాలయం నిర్మించాడు. ఇతనికి వైద్యరత్నాకర, ప్రాణాచార్య, నరవైద్య అనే విశేషణాలున్నట్లు సైదాపూర్ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఇతడు ఆయుర్వేద విద్యలో పటుత్వం కలిగినవాడు. ఆయుర్వేద శాస్త్ర విద్యలోను, శస్త్ర విద్యలోను కుశలత్వం కలిగినవాడుగా, వితరణగుణశీలుడుగా, తన ప్రభువు పట్ల ఆంజనేయుడిగా పేర్కొనబడ్డాడు. ఈ అగ్గలయ్య పశ్చిమ చాళుక్య రాజైన (రెండవ సోమేశ్వరుడు) భువనైకమల్ల దేవుని కాలంలో మెదక్ జిల్లాలోని సిరూర్ గ్రామంలో ఒక శాసనం వేయించాడు. శాసనకాలం శ.సం. 996 = క్రీ.శ. 1074.
వైద్యాచార్యుడైన అగ్గలయ్య తన తమ్ముడు పేర శ్రీ యాపనీయ సంఘానికి, మధువగణకు ధర్మ సాగర సిద్ధాంతి దేవునికి ఆదివారం చంద్రగ్రహణ సమయంలో ఆ సంఘం లో ఉండే రుషులకు, విద్యార్థుల ఆహారం కోసం దానం ఇచ్చిన విషయం ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఉద్యానవనాన్ని, నివసించడానికి ఇండ్ల స్థలాలను కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.
శాసనంలో అగ్గలయ్య సమధిగత పంచ మహాశబ్ద మహా సామంతం విజయలక్ష్మీ కాంత చండ రిపు వనజవన వేదణ్ణం, విబుధ జన హృదయ కమలినీ మార్తాండం, నిజ వంశకైరవ సుధాకరం సవ్యక్త రత్నాకరం, అగసహృత్సవన పానకేళి భుజంగ బుద్ధన సింగం, చంపకామోదం శాసనదేవి లబ్బ వరప్రసాద్ నామాది సమస్త ప్రశ స్తి సహితం శ్రీ మన్మహాసామంత అగ్గళరస అని కీర్తించబడినాడు. ఇతని భార్య అయిన వల్లికాంబ గుణగణాలు కూడా వర్ణించబడినాయి. వైద్యశిఖామణి అగ్గళార్యవన్తా, జగదేక వైద్యస కులాంగన, పల్లికాంబికి అద్భుత పూర్వ పుణ్యవతి, తనిజ కీర్తి.. వితరణ గుణ దోళకర పతిహిత దోళ పవన సూను సంగర ధరయోళ్ శతముఖ సుతనెండి ధరె సతతం. అని పేర్కొనబడింది.
శాసనం కన్నడభాషలో ఉన్నది. పశ్చిమ చాళుక్య వంశీయుల కాలంలో ఉన్న ఈ వైద్యాచార్యుడు ఆయుర్వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు శాస్ర్తాన్ని బోధించడం, శస్త్రచికిత్సలు కూడా చేసినట్లు, తత్సంబంధిత కర్మలు చేసినట్లు, అదేవిధంగా ఇతడు ఇతర భిషక్కులు (వైద్యులు) నయం చేయలేని అనేక రుగ్మతలను నయం చేసేవాడని, అతడు నయం చేస్తే ఏ రోగం కూడా మళ్లీరాదు, రోగం లేకుండా చేయగలడు (పునరూహ దక్షం, నిరూహ దక్షం). ఇంకా ఇతడు ఉమా తంత్రంలోను, సంగ్రహపరిచ్ఛేద క్రియలోను కౌశల్యం కలవా డుగాను, శస్త్ర, శాస్త్ర విషయంలో ప్రాగణ్యుడుగా కీర్తించబడ్డాడు. (సైదాపూర్ శాసనం)
ఈ విధంగా మన భారతీయమైన ఆయుర్వేద విద్య విశిష్టత, ప్రాచీనత ఇటువంటి శాసనాల ద్వారా మనం అధ్యయనం చేసే అవకాశం ఉన్నది.
– భిన్నూరి మనోహరి