భారతదేశంలో స్త్రీవాదం మొదలవ్వడానికి ముందే, ఆఫ్రికన్, అమెరికన్ స్త్రీలు, అక్కడ వేళ్లూనుకొని ఉన్న వర్ణ, లింగ వివక్షలపై బలంగా గొంతెత్తారు. తమ కలాలతో దీటుగా ఎదుర్కొన్నారు. తమ పోరాటాన్ని కవిత్వం ద్వారా, కథల ద్వారా నవలల ద్వారా ప్రపంచానికి తెలియజేయడం మొదలుపెట్టారు. ఆపై ఆ తొలితరం స్త్రీల హక్కుల ఉద్యమం స్థానికంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ అనేక మంది స్త్రీలకు తమపై జరుగుతున్న బహుముఖ దోపిడీని ఎరుకలోకి తెచ్చింది. ఆ విధంగా స్త్రీల హక్కుల కోసం వివిధ సమూహల స్త్రీలు సాహిత్యాన్ని దన్నుగా చేసుకొని పోరాటం చేశారు.
‘దెయ్యం పూసిన నలుపుగా మనల్ని ఏహ్యతతో చూస్తున్న వారందరితో పాటు మనం కూడా ఇహలోకంలో,పరలోకంలో సైతం అన్నివిధాలా సమానులమే. సమానత్వానికి నల్లవాడూ, క్రైస్తవులూ.. అందరూ అర్హులే అంటూ, సున్నితంగా చురకలంటిస్తుంది. సునిశిత ధిక్కారం పదాల్లో పలికిస్తుంది ఫిల్లిస్. ఆమె తొలి కవితల్లో మనం భక్తీభావాన్నీ, నైతికతను ప్రోత్సహించే కవితలనే ఎక్కువగా చూస్తాం.
ఫిల్లిస్ వీట్లీ పీటర్స్ (1753-1784) 19వ శతాబ్దానికి ముందే అచ్చులో కనబడిన, ప్రజాభిమానం చూరగొన్న మొట్టమొదటి నల్లజాతి కవయిత్రి. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఫిల్లిస్ వీట్లీని ఏడేండ్ల వయ స్సులో కిడ్నాప్ చేసి అమెరికాకు చెందిన ధనిక వీట్లీ కుటుంబానికి బానిసగా విక్రయించారు. అయితే, ఆమెలోని సాహిత్యాభిలాషను, అసాధారణ తెలివితేటలను గుర్తించిన ఆమె యజమానులు ఆమెను ఎంతో ప్రోత్సహించారు. ఇంటి పనులతో పాటు కవిత్వాన్నీ అలవోకగా రాస్తుంటే, తమ వంతు తోడ్పాటునందించారు. ఆమె కవితల్లో ‘ఆఫ్రికా నుంచి అమెరికాకు తీసుకురాబడినపుడు’ (On Being Brought from Africa to America) అనే కవిత బహుళ ప్రాచుర్యం పొం దింది. ఈ కవితలో ఆమె తాను అమెరికా తేబడటం ఒక అదృష్టంగా చెప్పుకొనేది. ఈ దేశానికి రావడం వల్లే తనకు చదువు, జ్ఞానం అబ్బాయని, తనకు దైవభావన, ప్రశాంతతలు లభించాయని చెప్తూ ఆమె వివక్షకు బలవుతున్న తన జాతీయులకు ఇలా పిలుపునిస్తుంది.
ఫిల్లిస్ కవిత్వం మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కవిత్వం. ఈమె కవిత్వం ఆఫ్రికన్ అమెరికన్ లిటరేచర్ అనే జానర్కు తెరతీసిందని చెప్పాలి. 1773లో ప్రచురించబడిన వీట్లీ కవితలు ఆమెతోపాటు ఆమె జాతికీ పేరు సంపాదించిపెట్టాయి. జనరల్ జార్జి వాషింగ్టన్ ఆమె కవిత్వాన్ని తనకు ప్రేరణగా అభివర్ణించుకున్నారు. ఆమె తన కవిత్వ పఠనానికి ఇంగ్లండ్కు వెళ్లినపుడు అమెరికా కవి ‘జూపిటర్ హేమన్’ ఏకంగా ఆమె కోసం ఒక కవిత రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఒక తెల్లవాడు అందునా కవి ఒక నల్లజాతీయురాలను ఆ విధంగా గౌరవించడం అప్పట్లో పెద్ద విషయమే మరి.
ఐతే వీట్లీ జీవితం నల్లేరుపై నడకలా ఏం సాగలేదు. గొప్ప కవయిత్రిగా పేరొచ్చినా సరే వీట్లీ బానిస బతుకు లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆమె బానిసగానే జీవితాన్ని కొనసాగించింది. వీట్లీ తన జాతివాడే అయిన జాన్ పీటర్స్ను పెళ్లాడింది. ఇద్దరు పిలలు పుట్టి పసికందులుగానే మరణించారు. వీట్లీ మూడోసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్త ఆమెను వదిలేశాడు. జాతివివక్ష పై పోరాడినా సరే.. లింగ వివక్షను తప్పించుకోలేకపోయింది. బిడ్డ కూడా పుట్టి దక్కకుండా పోయింది. గర్భం దాల్చినప్పుడు కలిగిన అనేక ఆరోగ్య సమస్యల తో వీట్లీ తన 31 ఏట ఒక బోర్డింగ్ హౌస్లో చివరి శ్వాస విడిచింది. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె తనను తాను ప్రోత్సహించుకుంటూ తన రెండో కవిత్వ సంపుటిని సిద్ధం చేసింది. కానీ, దీన్ని ప్రచురించటానికి మాత్రం ఎవ్వరూ ముందుకురాలేదు. ఆమె ఎన్నో కవితలను అనేకమంది ప్రముఖులకు అంకితం చేసింది. అమెరికన్ రివల్యూషన్ ఊపందుకోగానే కాలమిస్టు దృక్పథంతో కూడా కవిత్వం రాసింది. అమె కవిత్వంలో ఆమె జీవితం చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. బానిసత్వానికి వ్యతిరేకంగా రాసినవి చాలా తక్కువే ఐనా ‘ఆఫ్రికా నుంచి అమెరికాకు తీసుకురాబడినపుడు’ మాత్రం ప్రపంచం నలుచెరగులా గుర్తింపు తెచ్చింది.
‘కారుణ్యం నన్ను నా దేశం నుంచి ఇక్కడికి తెచ్చింది.నా అజ్ఞానపు ఆత్మకు రక్షకుడైన దేవుడిని పరిచయం చేసింది. కావాలో, వద్దో కూడా తేల్చుకోలేని నాకు ప్రశాంతతను అందించింది.కొందరెందుకో గొర్రెలాంటి మా జాతిని తిరస్కారంతో చూస్తారు. వారిది దెయ్యం పూసిన నలుపూ అంటూ అవమానిస్తారు.ఐతే నా సాటి నల్లవాళ్ళూ, నీగ్రోలూ, ఇహ, పరలోకాల రైలుబండిని అందరితో పాటూ ఎక్కొచ్చు’.అంటూ ధైర్యాన్ని నూరిపోస్తుంది ఫిల్లిస్ తన కవిత్వంతో. ఈ కవితను కవయిత్రి రెండు భాగాలుగా విభజించింది. మొదటిభాగం ఆమె సొంత అనుభవం కాగా రెండో భాగంలో ఆమె తన గొంతుతో అనేక మందిని కలుపుకొన్నది. ఇంపరేటివ్లను వాడుతూ ఒక బలాన్ని, ఫోర్స్నూ పలికిస్తూ తనవారికి నైతిక స్థయిర్యాన్ని ఇవ్వగలిగింది. థర్డ్ పర్సన్లోకి మారిన ఆమె గొంతును మనం రెండో కవిత రెండోభాగంలో చూడవచ్చు. బానిసత్వంలోనూ వజ్ర సంకల్పంతో మెరిసిన ఫిల్లిస్ వీట్ల్లీ అనేకమంది కవులకు ఆదర్శవంతమైన జీవితం గడిపిం ది. కొద్ది జీవితంలోనే మర
పురాని కవయిత్రిగా, వ్యక్తిగా కవిత్వ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వీట్లీ తర్వాత చాలామంది ఆఫ్రికన్ అమెరికన్ మహిళలు రాయడం మొదలుపెట్టారు. వీరిలో ఎక్కువమంది బానిసలుగా ఉంటూనే, వర్ణ వివక్షపై తమ ప్రశ్నలను కవిత్వరూపంలో సంధించారు. అలా రాసినవారిలో ఓల్డ్ ఎలిజబెత్ (1766-1866) మరియా స్టీవార్ట్, హారియట్ జేకబ్స్, మేరీ యాన్క్యారీ, ఫ్రాన్సెస్ ఎలెన్ హార్పర్, డైసీబేట్స్ ఇలా ఎందరో తామున్న బానిస స్థితిలోనూ, ఫాస్టర్హోమ్స్ అనే ప్రభుత్వ హాస్టళ్లలోనూ ఉండి తమ కవిత్వంతో, వ్యాసాలతో వర్ణ వివక్షపై తమ నిరసనను తిరుగుబాటునూ వ్యక్తపరుస్తూ వచ్చారు. తెల్లజాతి ఆధిపత్యాన్ని బ్లాక్ అమెరికన్ పత్రికల్లో ప్రశ్నిస్తూ రావడం నిజంగా గొప్ప తెగింపు కదా?
ఇరువయ్యో శతాబ్దానికి చెందిన డైసీబేట్స్ రచనలు గొప్ప సామాజిక మార్పునకు దోహదం చేశాయి. ‘లాంగ్ షాడో ఆఫ్ లిటిల్ రాక్’ అనే ఆమె స్వీయకథ 1988లో అమెరికన్ బుక్ అవార్డు గెల్చుకున్నది. ఈ శతాబ్దం మరెంతోమంది బ్రిలియంట్ రైటర్స్ను ప్రపంచానికి పరిచయం చేసింది.
వెండెలిన్ బ్రూక్స్, టోనీ మారిసన్, ఆండ్రీ లార్డీ, ఏంజెలా డేవిస్, ఆలిస్ వాకర్, బెల్హుక్స్ తదితరులు తమ రాజకీయ, సాంఘిక దృక్కోణాలతో అమెరికా సాహితీ ప్రపంచాన్ని కొత్త ఒరవడిలోకి తీసుకెళ్లారు. అసలు సాహిత్యం అనే ప్రక్రి య ఎంత రెబెలియస్గా ఉండవచ్చో తమ రచనల ద్వారా, సంప్రదాయ రచనా రీతులను తుత్తునియలు చేసి, నాటి తెల్లజాతీయుల స్త్రీవాదాన్నీ, అందులోని ద్వంద్వ విలువలనీ తూర్పారబట్టారు.
ఈ స్త్రీలందరూ అమెరికా సాహితీ ప్రపంచంలో నల్లజాతి స్త్రీల రచనల అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కాణించారు. లింగవివక్షను ప్రశ్నిస్తున్నట్టే కనిపి స్తూ, అందులోంచి నల్లజాతి స్త్రీలను కుట్రపూరితంగా విస్మరించడాన్ని, అందులోని తెల్లజాతి జాత్యహంకార ధోరణులనూ తన ప్రసంగం ‘ఆయింట్ ఐ ఏ ఉమెన్’లో బట్టబయలు చేసింది. బెల్ హుక్స్ అనే రచయిత్రి, సిద్ధాంతకర్త, విద్యావేత్త. నల్లజాతి పురుషులను కలుపుకొని పోయే శ్వేతజాతి స్త్రీవాదులు నల్లజాతి స్త్రీవాదుల వద్దకు వచ్చేసరికి, జాతి వివక్షను బాహాటంగా ప్రదర్శించడం చూసిన బెల్హుక్స్ ఆ స్త్రీవాదులని బహిరంగంగా విమర్శించింది. నైతికత గురించి గొప్ప ప్రసంగాలు చేసే వైట్ ఫెమినిస్టులు, నల్లజాతీయులను బానిసలుగా చేసిన తెల్లజాతి నీతి గురించి మాట్లాడాలని గొప్ప తెగువతో నిలదీసింది. నల్లజాతి పురుషు లు సైతం నల్లజాతి స్త్రీలను కలుపుకోకుండా చేస్తున్న వివక్షా ఉద్యమాల నిజాయితీని ఆమె రచనల్లో ఎత్తి చూపింది.
విద్యావేత్త అయిన టోనీ మోరిసన్ (1931-2019) తన నవల ‘బ్లూయెస్ట్ ఐ’లో వర్ణ వివక్ష వికృత రూపాన్ని ప్రెజెంట్ చేసింది. ఎక్కడికి వెళ్లినా అంధ వికారంగా పరిగణింపబడే, అవమానింపబడే నల్లజాతి అమ్మాయి పెకోలా, అందానికి మారుపేరుగా చూడబడే నీలికండ్ల గురించి కలలు కనడాన్ని అక్షరీకరించింది. నవలలో ప్రస్తావించబడిన జాత్యహంకారం, పిల్లలపై హింస, అనైతికత వంకతో అమెరికన్ ప్రభుత్వం ఎన్నోసార్లు ఈ నవలను నిషేధించడానికి ప్రయత్నాలు చేసి విఫలమైంది.
ఇలా.. ఎందరో నల్లజాతి మహిళలు, శ్వేతజాతీయుల స్త్రీవాదంలో తమకు చోటు ఎందుకులేదో తమ సాహిత్యం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. తమ అక్షరాలతో బహువిధ వివక్షలను చాలెంజ్ చేసి, నల్లజాతి బానిసత్వాన్ని రూపుమాపడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వీరి స్ఫూర్తి ప్రపంచవ్యాప్తమై, భారతదేశంలో సైతం 19వ దశాబ్దిలో స్త్రీవాదం రూపుదిద్దుకుంది. ఆపై ఆ స్త్రీవాదం ఆధిపత్య కుల స్త్రీల గుప్పెట్లో ఉండటాన్ని దళిత ఆదివాసీ, మైనారిటీ, మహిళా సమా జం గమనించి, తదుపరి దళిత స్త్రీవాదం, ముస్లిం స్త్రీల స్త్రీవాదంగా అస్తిత్వ ఉద్యమాలు, సాహిత్యమూ ముందుకువచ్చాయి.
భారత్లో గల ఎన్నో కుల మత, సాంస్కృతిక వైరుధ్యాలు అణిచివేయబడ్డ స్త్రీల సాహిత్యాన్ని కాస్త ఆల స్యం చేసినా, మొత్తానికి నల్లజా తి స్త్రీవాదుల, ఉమెనిస్టుల స్ఫూర్తి భారతీయ పీడిత వర్గాల, కులాల స్త్రీల స్త్రీ వాదం ఉద్భవించేందుకు ఎంతగా నో తోడ్పడిందని ఒప్పుకొని తీరాలి.
-అరుణ గోగులమండ
88971 07984