సంగీతం అనేది భాషా భావాలకు అతీతం. అందుకే పసి పిల్లల నుంచి పాముల వరకూ… సృష్టి సమస్తం ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. తనకూ అలాగే బాణీలతో సంబంధం లేకుండా పాటంటే పాటే అంటారు ప్రముఖ సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్. కర్ణాటక శాస్త్రీయ గాయనిగానే కాదు, నృత్య రూపకాలకు తన గొంతుకనందిస్తూ, సరళ సంగీతంలో విరిసే అన్నమాచార్య కీర్తనలకు స్వరాన్ని జతకూరుస్తూ… సాహితీరస ప్రవాహానికి మువ్వన్నెలు అద్దుతున్నారామె. పాటల పూదోటలోమూడు దశాబ్దాలకు పైగా ఆమె చేసిన కృషికి గాను తెలంగాణ రాష్ట్రం నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ నటుడు నాగభూషణం మనుమరాలు అయిన ఈమె తన కళా ప్రస్థానాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారిలా…
Shwetha Prasad | మీకు పాటతో పరిచయం ఎప్పటినుంచి అని అడిగితే… నాకు ఊహ తెలియక ముందునుంచే అని చెబుతాను. ఎందుకంటే నేను పాఠశాల కంటే ముందు సంగీతం క్లాసులోనే చేరాను. రెండున్నరేండ్ల వయసుకే సినిమాలో చూసిన పాటలు చక్కగా పాడుతుంటే, నాకు సంగీతం నేర్పాలని అమ్మ ముచ్చట పడింది. అలా నా తొలి పాఠం సంగీతమే అయింది. ‘అ ఆ’ల కన్నా ముందు సరిగమలతోనే పరిచయం ఏర్పడింది.
మా నానమ్మ పాటలు బాగా పాడతారు. మా తాతయ్య నాగభూషణంగారి ‘రక్తకన్నీరు’ నాటక ప్రదర్శనలకు చాలా రోజులపాటు ఆవిడే పాటలు పాడారు. ఆవిడ అన్నయ్య కూతురే మా అమ్మ. అమ్మా వాళ్ల ఇంట్లో దాదాపు అందరికీ సంగీతంలో ప్రవేశం ఉంది. అమ్మ కూడా వీణ వాయిస్తుంది. అలా నన్ను ఇంట్లో వాళ్లు సంగీతం వైపు ప్రోత్సహించారు. అందుకే బీకాం పూర్తయ్యాక, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ మ్యూజిక్ పట్టా అందుకున్నాను. సంగీతంలోనే ఎంఫిల్ కూడా చేశాను. నా చదువంతా పాటే. దానితో పాటే నేనూ.
శోభానాయుడుతో పాతికేండ్లు…
నేను ఆరేడు తరగతుల్లో ఉన్నప్పుడు ఒకసారి దూరదర్శన్ పిల్లల కార్యక్రమంలో పాడాను. ఆ ప్రోగ్రామ్ని ప్రముఖ నాట్యకారిణి శోభానాయుడు చూశారు. అప్పుడు నేను నేతి శ్రీరామశర్మ గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకునేదాన్ని. శోభానాయుడు కూడా ఆయన దగ్గరే సంగీతం తరగతులు చెప్పించుకునే వారు. నాట్యకారిణికి సంగీత జ్ఞానం ఉండాలన్నది ఆమె ఆలోచన. అయితే టీవీలో నన్ను చూసిన ఆమె… ‘ఈ అమ్మాయితో నా నాట్యానికి పాట పాడించుకోవాలి అనుకుంటున్నా… తను మీకేమైనా తెలుసా?’…అని మాస్టారుని అడిగారు.
‘ఆ అమ్మాయి నా శిష్యురాలే. కానీ, చిన్నపిల్ల… నాట్యానికి అదేం పాడుతుంది…’ అన్నారట మాస్టారు. అయినా ఆవిడ పట్టుబట్టి మా అమ్మనూ, నన్నూ కలిశారు. వాళ్లింటికి పిలిచి నన్ను ఒక పాట పాడమని అడిగారు. నేను ‘మహాగణపతిం..’ పాడాను. ఆవిడ ముచ్చటపడ్డారు. అది మొదలు ఆమె పరమపదించే వరకూ… అంటే దాదాపు పాతికేండ్ల పాటు శోభానాయుడు నృత్యరూపకాలకు గాత్రాన్ని అందించాను. అలా కర్ణాటక సంగీతం నుంచి నృత్య గానం వైపు నా అడుగులు పడ్డాయి.
పద్మ భూషణ్ స్వప్న సుందరి, పద్మశ్రీ డా॥ ఆనంద శంకర జయంత్, పద్మశ్రీ జయరామారావు దంపతులు… ఇలా పేరెన్నికగన్న నాట్యకారులెందరికో నా స్వరాన్ని అందించాను.
రెండువేలకు పైగా…
నాట్య ప్రదర్శనల కోసం పనిచేస్తున్నా కర్ణాటక సంగీతాన్ని మాత్రం విడువలేదు. దాన్ని నిరంతరం సాధన చేస్తూనే ఉంటాను. దానికి సంబంధించిన కచేరీలు ఇస్తూనే ఉన్నాను. శోభారాజు గారి దగ్గర కూడా పది సంవత్సరాలు శిష్యరికం చేశాను. త్యాగరాయ కృతులను ఎంత ఆరాధనతో సాధన చేశానో, అన్నమాచార్య కీర్తనలనూ అంతే ఇష్టంగా నేర్చుకున్నాను. రాష్ట్రం, భాషలతో సంబంధం లేకుండా దాదాపు భారత దేశమంతా సంగీత ప్రదర్శనలు ఇచ్చాను. పాడటం కోసం అమెరికా, ఇంగ్లండ్, జపాన్, ఇండోనేషియా, మలేషియా… ఇలా దాదాపు 30 దేశాలు తిరిగాను. 500 అరంగేట్రాలకు గాత్రం అందించాను. మొత్తంగా రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను.
భారత ప్రభుత్వ ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సెల్ అబ్రాడ్’ (విదేశాల్లో భారతీయ సాంస్కృతిక విభాగం)లో నేను ఎంపానెల్డ్ ఆర్టిస్ట్ని. అన్నమాచార్య కీర్తనలతో ‘త్వమేవ శరణం’… పేరిట ఆల్బమ్ చేశాను. ఆదిత్య మ్యూజిక్ సహా చాలా సంస్థలకు ప్రైవేట్ ఆల్బమ్లు చేశాను. భగవద్గీత శ్లోకాలకు కర్ణాటక సంగీత స్వరాలను జోడించి సరికొత్త ప్రయత్నం చేశాను. వీలును బట్టి పిల్లలకు పాఠాలు కూడా చెబుతున్నాను. ఇలా సంగీత రంగంలో విభిన్న కోణాల్లో నేను చేసిన కృషే ఈ రోజు బిస్మిల్లా ఖాన్ పురస్కారాన్ని తెచ్చి పెట్టింది అనుకుంటాను.
నా వ్యక్తిగత జీవితాన్ని కూడా కళ నుంచి విడదీయలేం. మా వారు రేణుకా ప్రసాద్ మృదంగ వాద్యకారుడు. మా అమ్మాయి ప్రసిద్ధ… ఇప్పుడు పదో తరగతి చదువుతున్నది. తను వయొలిన్ చక్కగా వాయిస్తుంది. వచ్చే ఏడాది గురుకులం తరహాలో గురువుల దగ్గరే ఉంచి వయొలిన్ నేర్పించాలని అనుకుంటున్నాం. ఇక, సంగీతంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకోవాలన్నది నా తరువాతి ఆలోచన. పాట మన సంస్కృతిలో భాగం. అందుకే అది మనతోపాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా పాట కూడా అలాగే చిరకాలం నిలిచిపోవాలన్నదే నా కోరిక. అందుకు ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటా!
ఆనందపు జల్లు..
నా ముప్పయ్యేండ్ల పాటల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు. అందులో కొన్ని నన్ను ఆనందాశ్చర్యాలకు గురిచేశాయి. పాటకు ప్రకృతి పరవశిస్తుందని వింటాం. మేఘాలు వర్షించిన సందర్భాలున్నాయనీ మనకు తెలుసు. అచ్చంగా అలాంటిదే నా జీవితంలోనూ జరిగింది. ఐదారేండ్ల క్రితం సంగతి. హైదరాబాద్ రవీంద్రభారతిలో నా విభావరి జరుగుతున్నది. మే నెల కావడంతో ఆ రోజు ఎండ మండిపోతున్నది. కచేరీలో భాగంగా అమృతవర్షిణి రాగం పాడాను నేను. కాసేపటికే జోరువాన కురిసింది. నాతో సహా అందరం చిత్రంగా చూశాం! ఆ రాగం పాడిన ప్రతిసారీ వర్షం పడుతుందని కాదు, మన మనసు ఆ రోజు విశ్వానికి అనుసంధానమైంది.. అంతే! అది సంగీతానికున్న గొప్పదనం. ప్రకృతిని కదిలించడమే కాదు. మనసులో ఘనీభవించిన భావాలను కరిగించే శక్తీ దానికి ఉంది. అలాంటి సందర్భాలెన్నో నా కచేరీల్లో తారసిల్లాయి.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి
జి. భాస్కర్