న్యూఢిల్లీ, జూన్ 23: అమెరికా స్టూడెంట్ వీసా విధానంలో రానున్న భారీ మార్పు అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా వేలాదిమంది భారతీయ విద్యార్థుల విద్య, కెరీర్లపై తీవ్ర ప్రభావం చూపనున్నది. సుదీర్ఘకాలంగా అమలులో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం స్థానంలో విద్యార్థి వీసాలపై నిర్దిష్టమైన కాలపరిమితిని విధించే కొత్త విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ప్రతిపాదించగా దానికి వైట్ హౌస్ ఆమోద ముద్ర వేసింది.
ఏమిటీ మార్పు?
ప్రస్తుత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం కింద ఎఫ్-1 వీసా కలిగిన విద్యార్థులు, అదే విధంగా జే-1 ఎక్సేంజ్ విజిటర్లు, నిర్దిష్ట ఇతర వీసా హోల్డర్లు తమకు ఆమోదం లభించిన విద్యా కార్యక్రమంలో కొనసాగుతూ వీసా నిబంధనలను పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఉండవచ్చు. అయితే ప్రతిపాదిత నిబంధన ఈ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో అధికారిక నివాస కాలపరిమితిని నిర్దిష్టంగా నిర్ణయిస్తుంది. చాలామంది విద్యార్థులకు ఈ గరిష్ఠ పరిమితిని నాలుగేండ్లుగా నిర్ణయించనున్నట్లు సమాచారం. ఈ నిబంధనను వైట్ హౌస్కు చెందిన మేనేజ్మెంట్, బడ్జెట్ కార్యాలయం ఇప్పటికే సమీక్షించింది. ఇక అధికారికంగా దీన్ని ప్రకటించడమే మిగిలింది.
భారతీయులపై ప్రభావం
ప్రతిపాదిత మార్పులు అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధిక సంఖ్యాకులైన భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపనున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో 3.31 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు అమెరికా ఉన్నత విద్య కోసం నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఓపెన్ డోర్స్ 2024 నివేదిక పేర్కొన్నది. భారతీయ విద్యార్థులు చాలామంది డాక్టోరల్ డిగ్రీలు, రిసెర్చ్ ఇంటెన్సివ్ మాస్టర్స్ ప్రోగ్రామ్లు, ప్రొఫెషనల్ కోర్సులు కొనసాగిస్తున్నారు. ఇవన్నీ తరచూ నాలుగేండ్ల కాలపరిమితికి మించి కొనసాగుతుంటాయి. ప్రతిపాదిత విధానం ప్రకారం నిర్ణీత ప్రవేశ కాలం కంటే ఎక్కువ సమయం చదువు కొనసాగించాల్సి వస్తే ఈ విద్యార్థులు దేశంలో చట్టబద్ధంగా ఉండటానికి యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నుంచి అనుమతి పొందాల్సి రావచ్చు. పరిశోధన, థీసిస్ పనులు లేదా ప్రోగ్రామ్ మార్పుల కారణంగా తరచుగా మారుతూ ఉండే విద్యార్థులకు నిర్దిష్ట నివాస కాలపరిమితులు అత్యధిక అనిశ్చితిని సృష్టించవచ్చని అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్, అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ పేర్కొన్నాయి.
గ్రీన్కార్డు దరఖాస్తు ఫీజుపై అదనపు బాదుడు?
అమెరికా పౌరసత్వం కోరుకునే చట్టబద్ధమైన వలసదారుల నుంచి దరఖాస్తు రుసుముగా 570 డాలర్లు(రూ.54,000) ఆదనంగా వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు మినహాయింపులు, రుసుము తగ్గింపులను తొలగించే ఒక ప్రణాళికను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రతిపాదించిన నిబంధన ప్రకారం పౌరసత్వ దరఖాస్తుల రుసుములు పేపర్ దరఖాస్తులకు 760 డాలర్ల(రూ. 72,000) నుండి 1,330 డాలర్లకు(రూ. 1.26 లక్షలు), ఆన్లైన్ దరఖాస్తులకు 710 డాలర్ల(రూ.67,300) నుండి 1,280 డాలర్లకు(రూ. 1,21,340) పెరుగుతాయి. ఈ ప్రణాళిక ఫెడరల్ పేదరిక రేఖలో 400% లేదా అంతకంటే తక్కువ గృహ ఆదాయం ఉన్న వలసదారులకు ఫీజు తగ్గింపు అవకాశాన్ని కూడా తొలగిస్తుంది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి రావు. ఇవి ఫెడరల్ ప్రభుత్వ నియమ-నిర్మాణ ప్రక్రియలో తదుపరి దశలను పూర్తి చేయాల్సి ఉన్న నిబంధనలో భాగం. ఈ మార్పులపై అభిప్రాయాలను తెలియచేయడానికి ప్రజలకు ప్రభుత్వం 60 రోజుల గడువు ఇస్తుంది.