ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల లాంచీ (భారీ పడవ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 41 మంది మరణించారు. 150 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శుక్రవారం సుగంధ నదిలో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి దాదాపు 800 మందితో ఈ లాంచీ ప్రయాణిస్తున్నది. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఇంజిన్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే లాంచీ అంతటా వ్యాపించాయి. దీంతో ప్రాణాలుకాపాడుకోవడానికి చాలా మంది నదిలో దూకారు. కొంతమంది ఆ మంటల్లోనే కాలిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, కోస్ట్గార్డు సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయి మరణించిన 9 మందితో కలుపుకొని మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. తప్పిపోయినవారి ఆచూకీ తెలుసుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.