తెలుగు వెలుగులు వేదిక తెలంగాణ సారస్వత పరిషత్
అరుదైన గ్రంథాలు, తల్లి భాష పరిరక్షణకు నిలువుటద్దం..
నేడు తెలంగాణ సారస్వత పరిషత్ 79వ వార్షికోత్సవం
సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ) : ఆధునిక తెలంగాణ సాహిత్య నిర్మాణంలో ఇదొక ఉజ్వల ఘట్టం. నిజాం నిరంకుశ ఆంక్షలను తట్టుకొని అనేక అవమానాలకు, అవహేళనకు గురై అన్నింటినీ అధిగమిస్తూ 50 ఏండ్లకు పైగా ప్రాచ్య కళాశాలను, తెలుగు పండిత శిక్షణ కళాశాలను పరిషత్ నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నది. 1994లో స్వర్ణోత్సవాన్ని, 2003లో వజ్రోత్సవాన్ని, 2013లో సప్తతి, 2018లో పంచ సప్తతి ఉత్సవాలను జరుపుకొన్నది. ప్రస్తుతం సగర్వంగా 79వ వార్షిక వేడుకలు జరుపుకుంటున్న చారిత్రక సందర్భంలో తిలక్రోడ్డు బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్పై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు.. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు వారై ఉండి.. తెలుగులో మాట్లాడుకోలేని పరిస్థితి. తెలుగు-కన్నడ-మరాఠీ భాషా వ్యవహర్తల త్రివేణి సంగమంలో తెలుగుకు దక్కవలసిన స్థానాన్ని ఉర్దూ చేజిక్కించుకుంది. దీంతో మెజార్టీ ప్రజలైన తెలుగు మాట్లాడేవారు ఒకింత ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు. అప్పటి పరిస్థితుల్లో తెలుగు భాషాభిమానులైన లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు వంటి ఎందరో మహామహుల ఆలోచనలతో 1943 మే 26న రెడ్డి హాస్టల్ గ్రంథాలయంలో సమావేశమై ‘నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్’గా స్థాపితమైంది.
1973 నాటికే దక్కన్లో 375 శాఖలు..
సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అడవి బాపిరాజు వంటి పెద్దలు తెలుగు భాషా సంస్కృతిని విశాలాంధ్రోద్యమం ద్వారా ప్రచారం చేశారు. దేవులపల్లి రామానుజరావు తాను మరణించే వరకు పరిషత్ అభివృద్ధికి కృషి చేశారు. ఈ ఉద్యమం తెలంగాణ ప్రజల్లో సంచలనాత్మక అస్థిత్వ చైతన్యాన్ని కలిగించింది. ఉలికిపడిన రజాకార్లు పరిషత్ సమావేశాలకు ఎన్నో ఆటంకాలు కలిగించారు. హైదరాబాద్లో పోలీస్ చర్య అనంతరం నిజాం రాష్ట్రం స్వతంత్ర దేశంలో కలవడంతో పరిషత్ తన 5వ మహాసభలను నేటి మెదక్ జిల్లా తూప్రాన్లో ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో జరుపుకొంది. ఆ సభల్లో నిజాం పదాన్ని తొలగిస్తూ తీర్మానం చేసి ఆంధ్ర సారస్వత పరిషత్గా అవతరించింది. అనంతరం పరిషత్ తన శాఖలను తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమకు, బీదర్, గుల్బర్గా, బెంగుళూరు, రాయచూర్ ప్రాంతాలకు, సేలం, హోసూర్, కేజీ కండ్రిగ, మద్రాస్ మొదలైన తమిళ ప్రాంతాలకు, ముంబయి, పూణె, షోలాపూర్, నాందేడ్, దేగ్లూర్ మొదలైన మహారాష్ట్ర ప్రాంతాలకు, మారిషస్ దేశానికి కూడా విస్తరించింది. అట్లా 1973 నాటికి ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖల సంఖ్య375 చేరింది.
రెండువందల పుస్తకాల ముద్రణ..
పండిత, ప్రజా, బాల సారస్వతాలు అనే మూడు విభాగాల్లో సుమారు 200 పుస్తకాలను ప్రచురించి నామమాత్రపు రుసుంతో విక్రయించింది. తెలుగునాట మొట్టమొదటిసారిగా జానపద వాజ్ఞ్మయాన్ని ప్రచురించింది పరిషత్తే కావడం విశేషం.1952 హైదరాబాదులో జరిగిన అఖిల భారత గ్రంథాలయ మహాసభలకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా పనిచేసింది. లక్ష్మణరాయ పరిశోధక మండలికి, తెలంగాణ రచయితల సంఘం స్థాపనకు, అఖిల భారత తెలుగు రచయితల సమావేశాలకు, యువభారతి సాహిత్య కార్యక్రమాలకు, తెలుగు లిపి సంసార కార్యక్రమాలకు, సారస్వత వేదిక కేంద్రంగా తన బాధ్యతను నిర్వర్తించింది.
భాష, సంస్కృతి పరిరక్షణకు..
సంక్రాంతి, ఉగాది మొదలగు పండుగల సమావేశాలు, ఆంధ్ర మహాకవుల జయంత్యుత్సవాలు, కవి సమ్మేళనా లు నిర్వహించడం, ఖండవల్లి బాలేందు శేఖరం ఆంధ్రుల చరిత్ర (1944) వంటి గ్రంథాలను ప్రచురించడం, తెలుగు భాషా, సాహిత్యంలో మెట్రిక్ స్థాయిలో ప్రవేశ పరీక్షలు (1944 జూలై నుంచి) నిర్వహించింది. తెలుగు మాధ్యమంలో బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత ఏర్పడటంతో హైదరాబాద్ ప్రభుత్వానికి తెలుగు ఉపాధ్యాయులను అందించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టింది. సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పరిషత్ ప్రచురించిందే కావడం విశేషం. అందుకు గాను 1955లో తొలిసారి తెలుగువారికి అవార్డు అందించిన గ్రంథం కావడం గమనార్హం.
అభినందించదగ్గ విషయం
తెలుగు భాషాభివృద్ధికి 79 ఏండ్లుగా కృషి చేస్తుండటం అభినందించదగ్గ విషయం. దేశానికి స్వాతంత్య్రం రాకముందే భాషా పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించి అప్పటి తెలుగు భాషాభిమానుల అభిమానాన్ని చూరగొన్న తీరు వర్ణించలేనిది. రామానుజరావు, సినారె అనంతరం ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్యల ఆధ్వర్యంలో వారి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నట్లు వారి ఆశయాలకు దగ్గట్టుగా పరిషత్తును కొనసాగిస్తున్నారు. దీంతోపాటు సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన వారికి పురస్కారాలను ప్రకటిస్తూ ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతం.
– ప్రొఫెసర్ కిషన్రావు, తెలుగు వర్సిటీ వీసీ
తెలుగును వ్యాప్తి చేయడానికి..
బడికి వెళ్లలేని పిల్లలు, మహిళలు, పురుష వయోజనుల్లో తెలుగు విద్యను వ్యాప్తి చేయడానికి హైదరాబాదులో 1950 జూన్లో వయోజన విద్యా శిక్షణ కేంద్రాన్ని పరిషత్ ఆధ్వర్యంలో స్థాపించారు. 1950-54 మధ్య తెలంగాణలో 64, బొగ్గు గనుల కార్మికుల కోసం 16, ముంబాయి తదితర రాష్ర్టేతర ప్రాంతాల తెలుగు కార్మికుల కోసం మరికొన్ని.. అన్నీ కలిపి సుమారు 130 వయోజన లేదా రాత్రి పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1954-56 మధ్య ప్రభుత్వ సహకారంతో 19 సాంఘిక సంక్షేమ విద్యా కేంద్రాలను నడిపింది. సంస్థ వార్షికోత్సవాల్లో 1952 అక్టోబరు నుంచి నటరాజ రామకృష్ణ చేత హైదరాబాదులోని పలుచోట్ల సంప్రదాయ నృత్య ప్రదర్శనలను ఇప్పించింది. కొండపల్లి శేషగిరిరావు, కె.రాజయ్యల చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది. రసరంజని నాటకాలకు ఉచితంగా ఆడిటోరియాన్ని ఇచ్చి ప్రోత్సహించింది.
హిందీ మాధ్యమాన్ని వ్యతిరేకించి..
1950 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ భాషలో విద్యాబోధనను వ్యతిరేకించారు. మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన చేపట్టాలని, ప్రభుత్వ వ్యవహారాలూ తెలుగులో జరిగేటట్లు ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించింది. 1945 అక్టోబరు నుంచి ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలను నిర్వహించింది. 1951 మార్చి నుంచి ఉన్నతస్థాయిలో విశారద పూర్వభాగం, 1953 మే నుంచి విశారద ఉత్తరభాగం పరీక్షలను నిర్వహించి విశారదను ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్య భాషా ప్రవేశ పరీక్షతో సమానంగా గుర్తించేటట్లు కృషి చేసింది. ఈ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు దాని శాఖలన్నింటిలోనూ నిర్వహించినట్లే, 1964 అక్టోబరు 22 నుంచి తెలుగు పండిత శిక్షణ కళాశాలను 1962లో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించిన భవనంలో ఏర్పాటు చేసింది. డీవోఎల్, బీవోఎల్, ఎంవోయల్ కోర్సులను 1965 జనవరి 15 నుంచి సాయంకాలం కళాశాలలో, ఆగస్టు 27 నుంచి డే కళాశాలగా ప్రారంభించింది.
తెలంగాణ మహావృక్షం..
ఒక సాహితీ సంస్థ ఇంత సుదీర్ఘకాలం పని చేయడం.. మరెక్కడా లేకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు తీసుకుపోతున్నది. తెలంగాణ సంస్కృతి, భాష, సాహిత్యాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహావృక్షం లాంటిది. నీడనిచ్చే సంస్థ.. ఊపును తెచ్చి.. శక్తిని, బలాన్నిచ్చినటువంటిది సారస్వత పరిషత్. తెలంగాణ మాగిన మాగాణంగా అభివర్ణించక మానరు.
– జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
అస్తిత్వ నిలయం
హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు బోధించేందుకు అధ్యాపకులను అందించిన ఘనత తెలంగాణ సారస్వత పరిషత్ది. ఉర్దూ, మరాఠీ భాషల ఆధిపత్యాన్ని ఎదుర్కొని తెలంగాణ భాష, సాహిత్యం, అస్తిత్వ నిర్మాణాలకు నిలయంగా మారింది. ఇవే గాక భారతం, రామాయణం, వివిధ కావ్యాలు, ప్రబంధాలు, ప్రసంగాలు ఇప్పించడం లాంటి అంశాలను తన ఒడిద్వారా నిరంతరం జీవనదిలా కొనసాగుతూ వచ్చింది. అంతగొప్ప సాహిత్య సంస్థ నుంచి 79వ వార్షిక వేడుకల్లో నేను పురస్కారాన్ని అందుకోబోతుండటం ఎంతో సంతోషంగా ఉంది.
– సుంకిరెడ్డి నారాయణరెడ్డి,పురస్కార గ్రహీత
తెలుగుకు జీవం పోసిన సంస్థ
తెలుగు భాషా, సాంస్కృతిక వ్యాప్తికి జీవం పోసిన సంస్థగా నిలిచింది. దేవులపల్లి రామానుజరావు, బూర్గుల, సురవరం, దాశరథి కృష్ణమాచార్యుల వంటి మహనీయుల మార్గద్శకత్వంలో కొనసాగిన సంస్థ. సినారె ఎనలేని కృషి చేసిన సందర్భం ఎవరూ కాదనలేరు.. మరిచిపోనూ లేరు. నిజాం కాలంలో అధికార భాషగా ఉర్దూ కొనసాగుతున్న తరుణంలో వాడుక భాష నుంచి సైతం తొలగించేంత పని చేశారు. ఉర్దూ మాట్లాడితేనే గౌరవం అన్న స్థాయికి పరిస్థితిని తీసుకొస్తే.. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తిరిగి మాతృభాషను కాపాడుకున్నది.
– ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్
సినారె చొరవతో..
హైదరాబాదులోని బొగ్గులకుంట ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో కొంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. లీజు కాలం ముగియడంతో అప్పటి ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొనే పరిస్థితి వచ్చింది. దీంతో పాతికలక్షలు పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలతో ఈ సంస్థ ప్రాంగణంలో పండిత శిక్షణ కళాశాలకు భవనాన్ని నిర్మించాడు. తెలంగాణ భాష, సాహిత్య సాంస్కృతిక, కళా రంగాలకు చెందిన వివిధ అంశాలపై సినారె ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ధర్మనిధిని సమకూర్చి యువ కళాకారులకు, సాహిత్య పరిశోధకులకు ప్రోత్సాహక బహుమతులు, పురస్కారాలు అందజేశారు.
తెలంగాణ జాతికి ఒక వరం
నిజాం పాలనలో ఆదరణకు నోచుకోని తెలుగును అక్కున చేర్చుకున్న ఒకే ఒక్క వేదిక సారస్వత పరిషత్. బూర్గుల, భాస్కరబట్ల లాంటి వారు చొరవ తీసుకొని కార్యక్రమాలను రూపొందించి భాషా పరిరక్షణకు పాటుపడ్డారు. సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ కార్యక్రమాలకు సైతం వేదికగా నిలిచింది. సారస్వత పరిషత్ ప్రాంగణంలో అడుగుమోపని తెలుగు మహనీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ జాతికి ఒక వరంలా నిలిచింది తెలంగాణ సార్వత పరిషత్.
– ముదిగంటి సుజాతారెడ్డి
మాతృభాషపై మమకారంతో..
దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డిలాంటి వారి ఆశయాలకు అనుగుణంగా పరిషత్ను కొనసాగిస్తున్నాం. ఆనాటి నాయకుల పట్టుదల, ఆలోచనా విధానాలను, మాతృభాషపై వారికున్న మమకారాన్ని కొనసాగించే విధంగా నేటికీ చర్యలు తీసుకుంటున్నం. ఇన్నేండ్ల పాటు ఒక సారస్వత పరిషత్ నిర్విరామంగా కొనసాగుతున్నది. పరిషత్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 200వరకు పుస్తకాలను ముద్రించింది. ప్రతియేటా రామానుజరావు, సినారె పేర్లపై అవార్డులను అందజేస్తున్నాం. ఈసారి నలుగురికి బహుమతులు అందజేస్తున్నాం.
– ఎల్లూరి శివారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు
జూన్ 12న ‘సమగ్ర స్వరూపం’
అప్పటి పరిషత్ కమిటీ సూచించిన విలువలకు ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తున్నాం. తెలంగాణ సారస్వత పరిషత్ అభివృద్ధిలో సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడి హోదాలో రూ.25లక్షలు కేటాయించి తన సొంత సంస్థగా భావించి ప్రోత్సహించిన ఘనత ఆయనది. ప్రతి యేటా రూ.17లక్షల నిధులను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని అంశాలను సేకరించేందుకు పరిషత్ ప్రణాళికను రూపొందించింది. ఇందలో భాగంగా జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలో అంశాలను సేకరించాం. జూన్ 12న రాజన్న సిరిసిల్ల సమగ్ర స్వరూపం పేరుతో పుస్తకాన్ని సినారె స్వగ్రామం హన్మాజీపేటలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
– జె.చెన్నయ్య, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి
భాషా వికాసంలో కీలకపాత్ర
భాషా, సాహిత్యం, సాంస్కృతిక వికాసంలో తెలంగాణ సారస్వత పరిషత్ కీలకపాత్ర పోషిస్తూ నేటికీ కొనసాగుతుండటం అభినందనీయం. తొలినాళ్ల నుంచి ఎంతో శ్రమకోర్చిన నాటి నాయకులు అంతరించే ప్రమాదంలో ఉన్న తెలుగును నూతనీకరించే విధంగా నిర్ణయాలు తీసుకొని పనిచేశారు. మాతృ భాషోద్ధరణకు అనునిత్యం మాడపాటి హనుమంతరావు, రామానుజారావు, సురవరం, బూర్గుల, కోదాటి నారాయణరావు, వీరభద్రరావు. గడియారం రామకృష్ణ, భాస్కరబట్ల వంటి వారు వెలకట్టలేని త్యాగాలు చేశారు. సమగ్ర భాషా వికాసం కోసం నిర్బంధాలను ఎదుర్కొని ముందుకు సాగారు. నాటి పోరాటాల వల్లనే నేడు భాష పరిఢవిల్లుతున్నది.
– అల్లం నారాయణ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
కవులకు ఉత్తమ వేదిక
అంధకారంలో మిణుకు, మిణుకుమంటున్న తరుణంలో ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషా పరిరక్షణలో కవులు, రచయితలకు ఉత్తమ వేదికగా నిలిచింది. అంతకంటే ముఖ్యంగా పుస్తక ప్రచురణలు తెలంగాణ సాహిత్యాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లింది. సాధారణ ప్రజానీకం వద్దకు తెలుగును తీసుకెళ్లిన ఘనత ఆంధ్ర సారస్వత పరిషత్ది. తెలుగు భాషావేత్తలను జాగృత పర్చి, భాషాభిమానాన్ని పాదుకొల్పి అందరినీ ఒకే వేదికపై నడిపింపజేసి తెలంగాణ సారస్వత పరిషత్గా రూపుదిద్దుకొని 79వ వసంతోత్సవం జరుపుకుంటున్న వేళ పరిషత్కు శుభాకాంక్షలు.
– ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, తెలుగు శాఖ ఓయూ