చర్లపల్లి : గృహహింసకు పాల్పడిన భర్త, అత్త, ఆడపడుచు, భర్త రెండో భార్యకు జైలు శిక్షను విధిస్తూ శుక్రవారం రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే భవానీకి అదే ప్రాంతానికి చెందిన రైల్వే ఉద్యోగి ప్రేమ్కుమార్తో 2002లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం.. కొద్ది రోజుల పాటు సజావుగా సాగిన వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో భర్త ప్రేమ్కుమార్, అత్త లత, ఆడపడుచు అర్చన వేధింపులు ప్రారంభమయ్యాయి. 2014లో ఓ రోజు అకస్మాత్తుగా ప్రేమ్కుమార్ ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుషాయిగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత ప్రేమ్కుమార్ తన తోటి ఉద్యోగిని కవితను వివాహం చేసుకుని ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు నుంచి ప్రతి రోజు మద్యం తాగి.. భవానీని కొట్టడంతో పాటు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తూ కొడుతుండేవాడు.
2016లో ఓ రోజు నిండుగా ఉన్న వాటర్ బాటిల్తో భవానీ తలపై కొట్టాడు. దీనిపై ఆమె కుషాయిగూడ పోలీసు స్టేషన్లో కేసును పెట్టింది. కేసు దర్యాప్తులో నమోదైన అభియోగాలపై పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు కోర్టు ముందు పెట్టడంతో శుక్రవారం కోర్టు భర్త ప్రేమ్కుమార్కు 3 ఏండ్లు, అత్త, ఆడపడుచు, భర్త రెండో భార్యకు ఏడాది పాటు జైలు, జరిమానాను విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంతో పాటు విచారణలో జైలు శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులు, కోర్టు సిబ్బందిని సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.