చార్మినార్, అక్టోబర్ 5 : మొక్కగా మొదలై నేడు మహావృక్షంగా ఎదిగిన సిటీ కాలేజీ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు. మంగళవారం సిటీ కాలేజీ శత వసంతాల వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సిటీ కాలేజీకి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉద్యమంతోపాటు విద్యా బోధనలోనూ తన ప్రత్యేకతను చాటుకుందన్నారు. నేటి ఆధునికతను చాటుకుంటూ 50 కోర్సులతో కళాశాల అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. నేడు అత్యున్నత స్థానాల్లో సేవలు అందిస్తున్న అనేక మంది సిటీ కాలేజీ పూర్వవిద్యార్థులేనని ఆచార్య ఘంటా చక్రపాణి తెలిపారు. సిటీ కాలేజీ నగరానికి ఓ శాంతినికేతన్లాంటిదని అభివర్ణించారు.
ఏడో నిజాం ఎంతో దార్శనికుడని, ఆయన ముందు చూపుతోనే సిటీ కాలేజీ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. వందేండ్ల కాలంలో వివిధ రంగాల్లో సేవలను అందిస్తున్న ప్రముఖులు సిటీ కాలేజీకి చెందినవారేనని తెలుసుకుంటే మనస్సు ఉప్పొంగుతుందని నిజాం వారసుడు నవాబ్ నవాజ్ అలీఖాన్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. సిటీ కాలేజీ అభ్యున్నతికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. శత వసంతాల వేడుకల సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వేడుకల డిజిటల్ లోగోను కమిషనర్ నవీన్మిట్టల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బాలభాస్కర్, తెలుగు సహాయ ఆచార్యులు కోయి కోటేశ్వర్రావు, శ్రీకాంత్రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ అనురాధరెడ్డి, అధ్యాపకులు పావని, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.