అభివృద్ధి చెందిన అమెరికా దేశం కూడా ఎన్నికల నిర్వహణలో ఇప్పటికీ ‘బ్యాలెట్ పేపర్’నే వినియోగిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న భారత్, కొన్ని దేశాలు ‘ఈవీఎం’లపై ఆధారపడుతున్నాయి. కానీ ‘ఆన్లైన్’ ఓటింగ్ నిర్వహించడానికి ఏ దేశాలూ సాహసించడం లేదు. దీనికి కారణాలేమిటో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఏ దేశమైనా ఎందుకు ముందుకుపోవటం లేదంటే.. దీనిలో గోప్యత ఉండకపోవటం వల్లనే అని తెలుస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా ‘బ్యాలెట్ పేపర్’, ‘ఈవీఎం’, ‘ఐ ఓటింగ్’ ఈ మూడు పద్ధతుల ద్వారా ఓటింగ్ నిర్వహణ జరుగుతున్నది. ‘ఐ’ అంటే ఇంటర్నెట్ ఓటింగ్. మన మొబైల్ లేదా కంప్యూటర్లను ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి ఓటు వేయగలగటం. అసలు ఆన్లైన్ ఓటింగ్ అవసరమా అనేది చాలా మంది ప్రశ్న. అయితే దీంతో సమయం, డబ్బును ఆదా చేయవచ్చని నిపుణుల అభిప్రాయం. 2019 భారత లోక్సభ ఎన్నికల నిర్వహణకు రూ.60 వేల కోట్లు ఖర్చయ్యాయి. ఆన్లైన్ ఓటింగ్తో అటు డబ్బు, ఇటు సమయాన్ని ఆదా చేయవచ్చనేది చాలామంది అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో 65-75 శాతం వరకు ఓటింగ్ నమోదైతే అది రికార్డుగానే పరిగణిస్తారు. అదే ఆన్లైన్ ఓటింగ్ జరిగితే ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చనేది విశ్లేషకుల మాట.
ఓటింగ్ నిర్వహణలో గోప్యత ప్రధానం. ఒక వ్యక్తి ఎవరికి ఓటు వేశారో ఇతరులకు తెలియకూడదు. కానీ ‘ఆన్లైన్ ఓటింగ్’తో గోప్యత పాటిస్తూ డేటాను భద్రం గా, సురక్షితంగా ఉంచడమనేది అసాధ్యం. పలు సామాజిక మాధ్యమాల కారణంగా ఆ డేటా భద్రంగా ఉండదనేది రుజువైంది. మనం ఏ ఆన్లైన్ ఉపయోగించినా దా న్ని ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు నియంత్రించే అవకాశం ఉన్నది. అదే తరహాలో ఆన్లైన్ ఓటింగ్ జరిగితే దానికి సంబంధించిన సర్వర్ ఎక్కడో ఒక చోట ఉండాలి. ఆ సర్వర్ను నియంత్రించేవారు ఓటింగ్ డేటా ను దుర్వినియోగం చేస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం.
ఆన్లైన్ ఓటింగ్ను లోపరహితంగా చేయడానికి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం.. ఇండియా లో ఉన్న మొబైల్ఫోన్లు, కంప్యూటర్లలో సగానికి పైగా పరికరాలు మాల్వేర్ ద్వారా ప్రభావితమై ఉన్నాయి. ఫోన్లు, కంప్యూటర్లు పాతవి అయి ఉంటే వారి ఓట్లపై మాల్వేర్ దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా శత్రు దేశాలు మాల్వేర్ దాడుల ద్వారా ఇతర దేశాల ఎన్నికల వ్యవస్థలోకి చొరబడి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రమాదమూ ఉంటుంది. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్ లైన్ఓటింగ్ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందనేది టెక్ నిపుణుల మాట. నార్వే 2011లో ఇంటర్నెట్ ఓటింగ్ వ్యవస్థను ప్రారంభించింది. అయితే భద్రత కారణాల దృష్ట్యా ఆ తర్వాత అది ముందుకుసాగలేదు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థపై దశాబ్దాలుగా ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే భద్రత, గోప్యత కారణాల దృష్ట్యా అవేవి సఫలం కాలే దు. ఒక ఈస్తోనియాలో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ ఓటింగ్ ఉన్నది. అయితే ఆ దేశ జనాభా 13 లక్షలే. అందరూ విద్యావంతులు. ఇలాంటి చిన్న దేశాన్ని ఇతరదేశాల ఓటింగ్ వ్యవస్థలతో పోల్చలేం. అయితే, ఇక్కడ కూడా ఆన్లైన్ ఓటింగ్పై అనేక ఆరోపణలొచ్చాయి. హ్యాకింగ్ కూడా జరిగింది.
ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ బలం గోప్యతే. ఈ విధానం లో ఎన్నిరకాల అక్రమాలు జరిగినా.. ఒక వ్యక్తి ఎవరికి ఓటు వేశాడో తెలిసే అవకాశం లేదు. ప్రభుత్వాలు కూడా తెలుసుకోలేవు. గోప్యత లేకపోవడమే ఆన్లైన్ ఓటింగ్ బలహీనత. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ, ఓటింగ్ విధానాల్లో ఎన్ని లోపాలున్నా.. దానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం ప్రస్తుతం అందుబాటులో లేదు.
– ఫిరోజ్ఖాన్, 96404 66464
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్)