కొవిడ్ మహమ్మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా నేర్పిన గుణపాఠం ప్రజల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను వాడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సేంద్రియ విధానంలో సాగైన పూలతో సహజసిద్ధంగా తయారయ్యే సుగంధ పరిమళాలకు కూడా గిరాకీ పెరగడంతో ‘ది ఫెర్ఫ్యూమ్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కనౌజ్ వెలుగొందుతున్నది.
గతంలో కళ తప్పిన మన దేశంలోని అత్తరు పరిశ్రమ ప్రస్తుతం కళకళలాడుతున్నది. కొవిడ్ తర్వాత మారిన ప్రజల అలవాట్ల కారణంగా ఇప్పుడిప్పుడే ఆ పరిశ్రమ పుంజుకుంటున్నది. మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన యువత ఈ పరిశ్రమకు ఊపిరులూదారు. తద్వారా శతాబ్దాల నాటి కళను బతికించడమే కాకుండా అనేకమంది ఉపాధికి మార్గం సుగమం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ల సంస్కృతి అత్తరు పరిశ్రమకు పాకింది. తద్వారా బూండ్ ఫ్రాగ్రెన్సెస్, కస్తూర్, నాసో ప్రొఫ్యూ మి తదితర స్టార్టప్లు పురుడుపోసుకున్నాయి. ఈ స్టార్టప్లలో అత్యధికం మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో నడుస్తున్నవే.
మన దేశంలో సుగంధ పరిమళాలు, రుచికి సంబంధించిన పరిశ్రమల ద్వారా ఏటా జరుగుతున్న వ్యాపారం సుమారు రూ.10 వేల కోట్లపైనే. అత్తరు, సువాసనలు, సుగంధ పరిమళాలల్లో వినియోగించే నూనెల వాటా ఇందులో సగంపైనే ఉంటుంది. ఈ రంగంలో ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా సుమారు 10 శాతం. రానున్న ఐదేండ్లలో అత్తరు పరిశ్రమ మరింత వృద్ధిని సాధిస్తుందని మార్కెట్ రిసెర్చ్ సంస్థ టెక్నావియో అంచనా వేసింది. టెక్నావియో ప్రకారం.. ఏటా 15 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉన్నది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కనౌజ్ నగరం సహజ సిద్ధమైన సుగంధ పరిమళాల పరిశ్రమకు ప్రసిద్ధి. శతాబ్దాల కిందటే కనౌజ్లోని వేల కుటుంబాలు అత్తరు తయారీలో నైపుణ్యం సాధించారు. డెగ్-భక్పా అనే ప్రాచీన పద్ధతిలో తయారుచేసే అత్తరుకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్నది. మొఘలుల కాలంలో అత్తరు తయారీ ప్రారంభమైందని, అప్పటినుంచే కనౌ జ్ అత్తరు పరిశ్రమకు ప్రసిద్ధి గాంచిందని పలువురు నిపుణులు చెప్తుంటారు. అయితే కొంతమంది చరిత్రకారులు ఈ వాదనను ఖండిస్తున్నారు. మొఘలులు మన దేశానికి రాకముందు నుంచే అత్తరు పరిశ్రమ మన దేశంలో ఉన్నదని చరిత్రకారులు అంటున్నారు. సింధూ లోయలో జరిపిన తవ్వకాల్లో సుగంధ పరిమళాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం వారి వాదనకు బలం చేకూరుస్తున్నది.
1980ల్లో తీసుకొచ్చిన సంస్కరణల ధాటికి దేశంలోని అత్తరు పరిశ్రమ కుదేలైంది. పశ్చిమ దేశాల నుంచి చౌకైన అత్తరు రాకతో చాలా పరిశ్రమలు మూతపడ్డా యి. 1990ల్లో కనౌజ్ పరిసర ప్రాంతాల్లో సుమారు 700 పరిశ్రమలుండేవి. 2000ల నాటికి ఆ సంఖ్య 150-200కు పడిపోయింది. చౌకైన సింథటిక్, ఆల్కహాల్ ఆధారిత సుగంధ పరిమళాల కారణంగా అక్కడి పరిశ్రమలు పోటీలో వెనుకబడ్డాయి. అతి ఖరీదైన శాండల్వుడ్ (చందనం) నూనెలను వినియోగించడం వల్ల స్వదేశీ అత్తరు ధరలు భారీగా ఉండేవి. అదే సమయం లో పశ్చిమదేశాల సుగంధ పరిమళాలు అతిచౌకగా లభించేవి. పోటీని తట్టుకునేందుకు స్వదేశీ పరిశ్రమలు కూడా ఆల్కహాల్ను వాడటం ప్రారంభించడంతో ఈ కళ అంతరించే దశకు చేరుకున్నది.
కొవిడ్ కారణంగా కొత్తకొత్త రంగాల్లో అడుగుపెడుతున్న యువత.. దీనిపై కూడా దృష్టిసారించింది. దేశంలోని చేతివృత్తిదారులు, మారుతున్న వినియోగదారుల సంస్కృతికి మధ్య ఉన్న అంతరాన్ని కొత్త తరం పసిగట్టింది. వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా అంతరించిపోయే దశలో ఉన్న ఆనాటి కళను నేటి యువత తెరపైకి తీసుకొచ్చింది. పలువురు పారిశ్రామికవేత్తలు స్టార్టప్ల ద్వారా అత్తరు పరిశ్రమ కు మళ్లీ పురుడుపోశారు. సేంద్రియ పద్ధతుల్లో పం డించిన పూలను వాడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మట్టి, వాన కురిసేటప్పుడు వచ్చే వాసన తదితర ప్రత్యేక వెరైటీలతో విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగారు. ఐరోపా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో వీటికి గిరాకీ ఎక్కువ. ఆల్కహాల్ లేకపోవడంతో అరబ్ దేశా ల్లో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల ప్రాంతాల్లో పూలు సాగు చేసే రైతులు లాభాల బాటపట్టారు. శీతాకాలం, పెండ్లిళ్ల సీజన్, క్రిస్మస్, రంజాన్ తదితర పర్వదినాల సమయంలో వీటికి డిమాండ్ ఉంటున్నది. 6 ఎంఎల్ అత్తరును 20 డాలర్లకు విక్రయిస్తున్నారంటేనే వీటికున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సుగంధ పరిమళాల పరిశ్రమకు కేంద్ర ప్రభు త్వం ప్రోత్సాహం అందించి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉన్నది.
– ఎడిటోరియల్ డెస్క్