Ganga Pushkaralu 2023 | మనం నవ్వితే.. గంగ పొంగుకొస్తుంది. ఆనంద బాష్పాలు! మనం ఏడిస్తే గంగ చెక్కిళ్లను తాకుతుంది. విషాద బాష్పాలు! గంగాజలంతోనే తొలిసారి మన నాలుక తడుస్తుంది. గంగ తీర్థం పుచ్చుకున్నాకే మన శ్వాస ఆగుతుంది. గంగలో అస్థికలు కలిశాకే.. పైలోకయాత్ర ప్రారంభం అవుతుంది. గంగమ్మ తల్లి పన్నెండేండ్లకోసారి జరుపుకొనే పెద్ద పండుగ.. పుష్కరాలు!ఏప్రిల్ 22న ఆరంభమైన గంగా పుష్కరాలు మే 3 న ముగుస్తాయి. ఆ ముల్లోక వాహినిలో మునకలేద్దాం పదండి.
గంగాజీ.. అని గౌరవిస్తారు ఉత్తరాది ప్రజలు. గంగమ్మా.. అంటూ నోరారా పిలుస్తారు తెలుగువారు. ఏ పెద్దమ్మనో పలకరించినట్టు, ఏ ముత్తయిదువనో ఇంటికి ఆహ్వానించినట్టు. మన గడ్డ మీద ప్రవహించకపోవచ్చు, కానీ మన గుండెల్లో మాత్రం గంగ పారుతూనే ఉంటుంది. నీటిబొట్టులో, కన్నీటి చుక్కలో గంగను చూసుకుంటాం. గోదావరి, తుంగభద్ర, కృష్ణ.. ప్రవాహాల్లోనే గంగా తరంగాలను ఊహించుకుంటాం. గంగాస్నానం. తుంగాపానం.. తుంగభద్ర నీళ్లు తాగితే చాలు. గంగలో మునకేసినంత పుణ్యమని మురిసిపోతాం. పెద్దలను ‘గంగా భాగీరథీ సమానులు’గా గౌరవించుకుంటాం. ‘గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ..’ అంటూ గంగతో ఆరంభించి ఏడు నదులను ప్రస్తావించుకుంటూ తొలి చెంబు కుమ్మరించుకుంటే కానీ స్నానం పూర్తయినట్టు కాదు. పురుడునాడు గంగాజలంతో పసిబిడ్డ గొంతు తడపడం సంప్రదాయం. బిడ్డను ఊయలలో వేస్తున్నప్పుడు గంగాపూజ చేస్తారు. కొన ఊపిరిలో ఉన్నవారికి గంగాజలం.. ముక్తిమార్గం. గంగలో అంత్యక్రియలు జరిగితే.. అనంతలోకాలలో రాచ వైభోగాలని పెద్దలు చెబుతారు. కాబట్టే, గంగ భారతీయుల హృదయాంతరంగ అనిపించుకుంది.
భారతీయత ఓ ముక్కాలిపీట అయితే..
గీత.. గాయత్రి.. గంగ..
ఆ పీటకు మూడు కాళ్లని చెబుతారు.
తవజల మమలం యేననిపీతమ్
పరమపదం ఖలుతేన గృహీతమ్
మాతర్గంగే త్వయియో భక్తః
కిల తం ద్రష్టుం న యమః శక్తః
‘తల్లీ! నీ నీళ్లు గుక్కెడు తాగినా చాలు. పరమ పదాన్ని చేరుకోవచ్చు. యమరాజు అంతటివాడైనా నీ భక్తులవైపు కన్నెత్తి చూడలేడు’ అంటుంది భారతీయత.
గంగానది ప్రవహిస్తున్నందుకే అక్కడ పుణ్యక్షేత్రాలు వెలిశాయో, ఆ క్షేత్ర ప్రశస్తికి పులకించిపోయి గంగమ్మే ఆ ఆలయాలను పరామర్శిస్తూ ముందుకెళ్తుందో తెలియదు కానీ.. గంగా తీరం అనేక దివ్య క్షేత్రాలకు నిలయం. దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, బదరీనాథ్, కేదారనాథ్, రుషికేశ్, హరిద్వార్, ప్రయాగ, కాశీ.. శివకేశవుల మధ్య అభేదాన్ని చాటుతూ గంగమ్మ సాగించిన సంపూర్ణ తీర్థయాత్ర భారతీయ ఆధ్యాత్మికతకు మూలస్తంభమైంది.
గంగ సువిశాలమైన నది. రెండున్నర వేల కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణంలో.. పరమేశ్వరుడిని అభిషేకిస్తుంది. విష్ణుమూర్తి పాదాలను తడుపుతుంది. నెర్రెలుబారిన నేలను సస్యశ్యామలం చేస్తుంది. అన్నార్తుల కడుపు నింపుతుంది. పశుపక్ష్యాదుల గొంతు తడుపుతుంది. వన్యమృగాల దప్పిక తీరుస్తుంది. హిమాలయాల్లోని గంగోత్రి హిమనదం నుంచి భాగీరథి నది ఉద్భవిస్తుంది. దేవప్రయాగ వద్ద అలకనంద దీనిలో కలుస్తుంది. అక్కడినుంచి గంగానది.. గలగలల ప్రస్థానం ఆరంభం అవుతుంది. కోసి, గోమతి, సోన్ మొదలైన ఉపనదులను కలుపుకొంటూ.. గంగమ్మ మునుముందుకు సాగుతుంది. యోగబలం కొద్దీ ప్రయాగ వద్ద.. యమున తననుతాను గంగకు అర్పించుకుంటుంది. యమున పేరుకు ఉపనదే కానీ, గంగ తర్వాత గంగ లాంటిది. అక్కకు తగిన చెల్లి. అనేకానేక నదులను అంతర్భాగం చేసుకుంటూ.. తనను తాను విస్తరించుకుంటూ.. మహానగరాలను పరామర్శించుకుంటూ, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటూ.. వనమూలికలను కరిగించుకుంటూ.. ఒకచోట పసిబిడ్డలా బుడిబుడి అడుగులేస్తూ.. ఒకచోట కౌమారిలా వయ్యారంగా కదులుతూ, ఒకచోట నిండు చూలాలిగా భారంగా అడుగులేస్తూ, ఒకచోట ప్రౌఢలా పరిపూర్ణతను చాటుతూ, ఒకచోట జీవితానుభవసారాన్ని ఎరిగిన వృద్ధకాంతలా గంభీరంగా పారుతూ.. గంగ మునుముందుకు సాగుతుంది. సంగమక్షేత్రం అలహాబాద్, ముక్తిక్షేత్రం వారణాసిని పరామర్శించిన తర్వాత.. పశ్చిమ బెంగాల్లోని మాల్దా వద్ద చీలిపోయి.. ఓ పాయ హుగ్లీగా కొత్త ప్రయాణం ప్రారంభిస్తుంది. కోల్కతా నగరం హుగ్లీ తీరాన ఉంది. మాల్దా తర్వాత గంగానది.. కొత్తపేరుతో కొత్తదారిలో ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి పద్మానదిగా పేరు తెచ్చుకుంటుంది. బంగ్లాదేశ్లో కాలుపెట్టాక.. జమునానదిని (భారతదేశంలో బ్రహ్మపుత్ర అంటారు) మనఃపూర్వకంగా ఇముడ్చుకుంటుంది. మేఘనా నదిని మమేకం చేసుకుంటుంది. సుందరవనాలకు కొత్త సౌందర్యం తెచ్చి.. చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. నదీనాం సాగరో గతిః-ఎంత గొప్ప నది అయినా సముద్రంలో కలవాల్సిందే. ఇది ప్రకృతి సూత్రం. జీవాత్మ పరమాత్మలో సంయోగం చెందడం లాంటిదే.. నదీ సముద్ర సంగమం కూడా.]
బలి చక్రవర్తి.. మహాదాతగా భళీ అనిపించుకున్నా.. స్వభావరీత్యా రక్కసుడు. దేవతలను చూస్తే అక్కసు. ధర్మ సంస్థాపనార్థం.. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి.. ఇంతింతై వటుడింతయై.. బలి నెత్తిన కాలుపెట్టి దేవతల మొక్కులు స్వీకరిస్తున్న సమయాన.. స్వామి ఎడమపాదం నుంచి గంగ ఉద్భవించిందని పురాణ వచనం. కానీ, ఆ సురగంగ ప్రవాహం స్వర్గసీమకే పరిమితమైంది. త్రేతాయుగంలో భగీరథ ప్రయత్నంతో గంగమ్మ నేలకు దిగింది. గంగావతరణ ఘట్టం రామాయణంలో ఓ మనోహర దృశ్యకావ్యం.
ఆ మహత్కార్యం అయోధ్య పాలకుడు సగరుడి కథతో మొదలవుతుంది. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్దభార్య కేశిని. చిన్నభార్య సుమతి. ఇద్దరికీ సంతానభాగ్యం లేదు. దీంతో సగరుడు ఏండ్ల తరబడి తపస్సు చేశాడు. ఆ సాధనకు మెచ్చి భృగుమహర్షి ‘ఒక భార్యకు వంశాన్ని నిలబెట్టే కొడుకు పుడతాడు. మరో భార్యకు అరవైవేలమంది కుమారులు జన్మిస్తారు’ అంటూ వరమిచ్చాడు. కేశిని, సుమతి.. తమకు నచ్చిన వరాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు మహర్షి. కేశిని సత్సంతానాన్ని ఎంచుకున్నది. అంశుమంతుడికి జన్మనిచ్చింది. సుమతి మహా ఉత్సాహవంతులైన అరవైవేలమంది బిడ్డలను కోరుకున్నది. అదొక అల్లరి మూక. పిడుగుల దండు. వాళ్ల అరాచకాలకు హద్దులు లేకుండాపోయాయి. అంతలోనే సగరుడు అశ్వమేథ యాగం ప్రారంభించాడు. అంశుమంతుడు యాగాశ్వాన్నిఅనుసరించాడు.
ఇంతలో, దేవేంద్రుడు కపటబుద్ధితో యాగాశ్వాన్ని అపహరించి పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. అశ్వమేథం విజయవంతమైతే తన పదవికి ఎసరు వస్తుందనే భయం. ఆ పరిస్థితుల్లో సగరపుత్రులకు ఏం చేయాలో తోచలేదు. తండ్రికి వర్తమానం పంపారు. ‘యాగాశ్వం ఆనవాలు దొరికిన తర్వాతే.. నగరంలో ప్రవేశించండి’ అంటూ కండ్లెర్రజేశాడు పితృదేవుడు. అరవైవేల మొహాలూ తెల్లబోయాయి. అణువణువూ గాలించాలని నిర్ణయించారు. అశ్వం కనిపించేవరకూ భూమిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎదురైన ప్రతి వ్యక్తిని.. గుర్రం ఆనవాలు చెప్పమంటూ హింసకు దిగారు. ప్రాణాలు తీశారు. పాతాళం వరకూ వెళ్లారు. కపిల మహర్షి ఆశ్రమం ఆవరణలో యాగాశ్వం కనిపించింది. దీంతో మహర్షిని అవమానించారు. ఆ తపోధనుడి ఆగ్రహజ్వాలకు అరవైవేల మందీ బూడిదైపోయారు. అంశుమంతుని మనుమడు, దిలీపుని కొడుకు భగీరథుడు యాగాన్ని పరిసమాప్తి చేసే ఉద్దేశంతో.. కపిలుడి ఆశ్రమానికెళ్లి, మహర్షికి నమస్కరించి.. తన కర్తవ్యాన్ని వివరించాడు. సురగంగను నేలకు దింపి.. ఆ బూడిద కుప్పలపై ప్రవహింపజేస్తే.. ఆ అరవైవేల మందికీ ముక్తి లభిస్తుందని సలహా ఇచ్చాడు. దీంతో భగీరథ ప్రయత్నం మొదలైంది.
పరమేశ్వరుడి కటాక్షమూ లభించింది. ఆ సురగంగను శివుడు తన జటలలో బంధించాడు. అటునుంచి నేలకు పారుతున్న సమయంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. జహ్ను.. ఆగ్రహంలో జమదగ్ని అయ్యాడు. గంగను గుప్పిట తీసుకుని గుటుక్కున మింగేశాడు. భగీరథుడి ప్రార్థనతో శాంతించి.. తన చెవినుంచి వదిలాడు. అక్కడినుంచి జాహ్నవి.. పరుగుపరుగున వెళ్లి సగరుడి కుమారుల భస్మంపై పారింది. అరవైవేల ఆత్మలకు ముకినిచ్చింది. అనంతకోటి జీవరాశికి జీవ జలమైంది.
భారతం.. భారతీయుల కథ. మనందరి పురాణం. దేవకాంత అయిన గంగాదేవి శాపవశాన భూమి మీద జన్మించడంతో కథ తొలి మలుపు తిరుగుతుంది. శంతనుడిని మనువాడటం.. భీష్ముడికి జన్మనివ్వడం.. శాప విమోచన పొంది పూర్వస్థానానికి వెళ్లిపోవడం తెలిసిన కథే. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవుల విజయానికి గంగామాత తనవంతు సహకరిస్తుంది. ఒకానొక సందర్భంలో కర్ణుడికి శాపమిచ్చి.. దివ్యాస్ర్తాలు పనిచేయకుండా చేస్తుంది. భగవద్గీతలో పరమాత్మ గంగకూ, తనకూ అభేద్యాన్ని ప్రకటిస్తాడు. ఆదికావ్యంలో.. అరణ్యవాస సమయంలో గంగానదిని దాటాల్సి వచ్చినప్పుడు సీతమ్మ గంగమ్మను భక్తితో పూజిస్తుంది. ‘మాతా! ఈ దశరథ పుత్రులు పద్నాలుగేండ్ల వనవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన బలాన్ని ఇవ్వు. తిరిగి వస్తున్నప్పుడు మళ్లీ నిన్ను దర్శించుకుంటాం. పూజలు చేస్తాం. వేదపండితులకు గోవులు, వస్ర్తాలు, భోజనాలు సమర్పించుకుంటాం’ అని ప్రార్థిస్తుంది. రుగ్వేదంలో కూడా గంగ ప్రస్తావన ఉంది. ‘వీరులారా! మీ వంశ గృహాలు, సర్వసంపదలు జాహ్నవి ఒడ్డున ఉన్నాయి’ అంటూ నాగరికత మూలాలను వివరిస్తుంది ఓ రుక్కు. వేదమూర్తులు ఆ చల్లని తల్లిని వేనోళ్ల కొనియాడారు. శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం.. గంగానదికి ప్రణతులర్పించాయి. పద్మ, అగ్ని, మత్స్య, నారదాది
పురాణాల్లో గంగాజల ప్రశస్తి ఉంది.
అసలు నదులకు పుష్కరాలు ఎందుకొస్తాయి? పన్నెండేండ్లకు ఒకసారి జరిగే ఆ సుజలోత్సవాలకు పుష్కరాలు అనే పేరే ఎందుకొచ్చింది? అదో కథ. గంగా ప్రవాహమంత పెద్ద కథ. తుందిలుడు పరమభక్తుడు. ఆ జపతపాలు చూసి పరమశివుడు పొంగిపోయాడు. కైలాసం దిగొచ్చాడు. తుందిలుని ముందు నిలబడ్డాడు. వరం కోరుకోమన్నాడు. ‘శివానందాన్ని మించిన పరమానందం ఏం ఉంటుంది? నీ సన్నిధి చాలు. అదే పదివేలు’ అన్నాడు. ఆ విధేయత నచ్చి జలాధిపత్యాన్ని ప్రసాదించాడు గంగాధరుడు. పుష్కరం అంటేనే పవిత్ర తీర్థం. పుష్కరాధిపత్యాన్ని పొంది.. పుష్కరుడు అనిపించుకున్నాడు తుందిలుడు. అలా సమస్త జలరాశులూ అతని అధీనంలోకి వచ్చాయి. దీంతో బ్రహ్మలోకంలో జపతపాలకు జల వనరులు లేకుండాపోయాయి. సాయం కోసం కైలాసానికి పరుగెత్తాడు బ్రహ్మ. పుష్కరుడు తన కమండలంలో కొలువుదీరాలని ఆనతివ్వమని శివుడిని వేడుకున్నాడు. ముక్కంటి కాదంటాడా? మరికొంత కాలానికి బృహస్పతి కూడా పుష్కరుడి మీద పెత్తనం అడిగాడు. ఆ కోరికనూ కాదనలేకపోయాడు శివుడు. కానీ పుష్కరుడికే ఇదంతా ఇబ్బందిగా అనిపించింది. ‘నేను ఎక్కడికీ వెళ్లను. మీ దగ్గరే ఉంటాను’ అంటూ పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు. దీంతో బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి ఓ సలహా ఇచ్చాడు. ‘బృహస్పతి మేషాది రాశులలో ఉన్నప్పుడు, మొదటి పన్నెండు రోజులూ పుష్కరుడు ఆయా నదుల్లో ఉండాలనీ.. ఆ సమయంలో తనతో పాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలూ బృహస్పతి ఉన్న రాశికి అధిష్ఠానమైన నదీ
జలాల్లో ఉంటారు’ అని సూచించాడు. అలా భూలోకంలో పుష్కర సంప్రదాయం ఆరంభమైందని చెబుతారు. నవగ్రహాల్లో ఒకటైన గురువు ఏడాదికో రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. గురువు ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు.. ఒక్కో నదికి పుష్కరం. మనకు గంగతో మొదలుపెట్టి మొత్తం పన్నెండు పుష్కర నదులున్నాయి. ఇప్పుడు, గురువు మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కారాలు వచ్చేస్తున్నాయి. మానవమాత్రులే కాదు, ముక్కోటి దేవతలూ పుష్కరాల్లో పాల్గొని గంగలో మూడు మునకలేయాలని తహతహలాడతారట. ఆ పన్నెండు రోజులూ సూక్ష్మ రూపాలలో నదీతీరాన కాపురం పెడతారట.
పుష్కర జలాన్ని సాధారణ జలంగా చూడలేం. ప్రతి చుక్కా పరమాత్మకు అభిషేకించిన తీర్థంతో సమానం. పుష్కర స్నానం క్రీడా వినోదం కానేకాదు. పరమ పవిత్రంగా చేయాలి. బట్టలు ఉతకడం, మలమూత్రాలు విసర్జించడం, ఉమ్మివేయడం, సబ్బులూ షాంపూలూ ఉపయోగించడం గంగను అవమానించడమే. ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. ‘అమ్మా నా పేరు ఫలానా. నా తండ్రి పేరు ఫలానా. ఫలానా గోత్రం నాది. ఫలానా నదుల మధ్య ప్రదేశంలో నివసిస్తాను. జగత్ కల్యాణం కోసం, కుటుంబ ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం పరమాత్మను ప్రార్థిస్తూ పుష్కర స్నానం చేస్తున్నాను’ అంటూ మంత్రపూర్వకంగా ఆ చల్లని తల్లిని వేడుకోవాలి. ఆ తర్వాత నదీ జలాల్ని ప్రోక్షణ చేసుకోవాలి.. భక్తి పూర్వకంగా తలపై చల్లుకోవాలి. నదీగర్భం నుంచి తీసిన మట్టితో.. మృత్తికా లేపనంతో శరీరాన్ని రుద్దుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. శుభ్రమైన వస్ర్తాలను ధరించి.. పురోహితుల సహాయంతో మూడుతరాల పెద్దల్ని తలుచుకుంటూ తర్పణాలు వదలాలి. పరమాత్మకు అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత, సమీపంలోని ఆలయాన్ని సందర్శించాలి. అనారోగ్యం కారణంగానో, ఇంకేవైనా అత్యవసర పరిస్థితుల వల్లనో.. ఇంతదూరం రాలేకపోయిన ఆత్మీయుల ప్రతినిధిగా మనమూ ఈ కర్మలన్నీ నిర్వర్తించవచ్చని శాస్ర్తాలు చెబుతున్నాయి. నది నగరాలను, క్షేత్రాలనే కాదు.. మనసులనూ కలుపుతుంది.
శిల్పశాస్త్రం ప్రకారం.. గంగ శ్వేత వర్ణ. పాలనురగ వన్నె. రెండు చేతుల్లోనూ పూర్ణకుంభాలు, కమలం ఉంటాయి. చతుర్భుజ రూపిణిగానూ పురాణాలు కొనియాడాయి. ఆ రూపంలో గంగమ్మ పాశం, అంకుశం ధరించి రౌద్రమూర్తిగానూ దర్శనమిస్తుంది. గంగలోనే లక్ష్మిని, పార్వతిని, సరస్వతిని, ముగురమ్మల మూలపుటమ్మనూ దర్శించు కనే మహా సాధకులూ ఉన్నారు.
పోషయతీతి పుష్కరం.. పుష్కరం అంటే పోషించేది అని అర్థం. నది సమస్త జీవరాశినీ పోషిస్తుంది. మనిషి తోటి ప్రాణులను పోషించాలి. ఇది ప్రకృతి ధర్మం, పుష్కర ధర్మం కూడా. పుష్కరాల్లో మొదటి రోజు భూమి, ధాన్యం, బంగారం, వెండి, భోజనం.. స్తోమతను బట్టి ఏదో ఓ దానం చేయాలంటారు. రెండో రోజు వస్త్రదానం ఉత్తమ ఫలితాల్ని ఇస్తుంది. మూడో రోజు.. పుష్ప, ఫలదానం, నాలుగో రోజు.. తేనె, నెయ్యి, నూనె మొదలైనవి దానంగా ఇవ్వాలని సూచిస్తారు. ఐదో రోజు.. వ్యవసాయ పనిముట్లు దానంగా ఇవ్వాలన్నది నియమం. ఆరో రోజు.. ఔషధ దానం చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దల మాట. ఏడో రోజు.. లేనివారికి గృహోపకరణాలు ఇవ్వాలని చెబుతారు. ఎనిమిదో రోజు.. దుంపలు, కాయగూరలు దానంగా ఇస్తే పుణ్యలోకాల్లోని పెద్దలకు పొట్ట నిండుతుందట. తొమ్మిదో రోజు.. నిలువ నీడలేనివారికి దుప్పట్లు పంచాలని చెబుతారు. పదో రోజు.. పుస్తక దానం ఫలప్రదం. పదకొండో రోజు.. తలా పిడికెడు తిలదానం చేయాలని పెద్దల మాట. పన్నెండో రోజు యోగ్యులైనవారికి సాలగ్రామాలు దానం చేస్తే.. మరుజన్మ ఉండదని విశ్వాసం.
శంకరాచార్య విరచిత గంగాస్తోత్రం..
దేవి సురేశ్వరి భగవతి గంగే
త్రిభువనతారిణి తరళ తరంగే
శంకర మౌళివిహారిణి విమలే
మమ మతిరాస్తాం తవ పదకమలే॥
గంగామాతా! నువ్వు దేవగణాలకు ఈశ్వరివి. నీ తరంగాలతో ముల్లోకాలను తరింప
జేస్తావు. స్వచ్ఛమైన జలాలతో శంకరుడి జటాజూటంలో విహరిస్తావు. నీ పాదకమలాల మీద నా మనసు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి.
భాగీరథి సుఖదాయిని మాతః
తవ జలమహిమా నిగమే ఖ్యాతః
నాహం జానే తవ మహిమానం
పాహి కృపామయి మామజ్ఞానం॥
ఓ గంగామాతా! నువ్వు మాకు సుఖాలను ఇస్తావు. వేదాలలో నీ మాహాత్మ్యాన్ని కొనియాడారు. నీ మహిమలు తెలియని అజ్ఞానిని నేను. నన్ను కృపతో రక్షించు తల్లీ.
హరిపదపాద్య తరంగిణి గంగే
హిమవిధుముక్తా ధవళతరంగే
దూరీకురు మమ దుష్కృతిభారం
కురుకృపయా భవసాగరపారమ్
ఓ గంగామాతా! నువ్వు శ్రీహరి పాదాల నుంచి జన్మించిన నదివి. నీ తరంగాలు చంద్రుడు, మంచు, ముత్యాల్లా తళతళలాడుతున్నాయి. నా సకల పాపాల భారాన్ని దూరంచేసి, నన్ను దయతో సంసార సాగరాన్ని దాటించు తల్లీ.
* * *
మనిషి జీవితమూ ఓ ప్రవాహమే. ఎక్కడో పుడుతాడు. నీరు పల్లమెరిగినట్టు.. ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ ప్రయాణంలో ఉపనదుల్లా ఆత్మీయులు వచ్చిచేరతారు. నదికి ఆనకట్ట కట్టినట్టు.. ఉద్యోగ వ్యాపారాల కారణంగా.. ఇంకెక్కడో స్థిరపడతాడు. గంగమ్మ తల్లి బీడు భూములను సస్యశ్యామలం చేసినట్టు, వన్యమృగాల దప్పిక తీర్చినట్టు, మేఘాలకు రుతుపవనాల్లో సాయం చేసినట్టు, మన వంతుగా సమాజానికి, తోటి మనుషులకు చేతనైన సేవ చేయాలి. నలుగురి కోసం బతకాలి. అప్పుడే నాలుగు కాలాలూ గుర్తుంచుకుంటారు. నాలుగు తరాలూ తలుచుకుంటారు. గంగలా మన బతుకూ సార్థకం అవుతుంది. జై గంగా జీ!