శుకమహర్షి పరీక్షిత్తుతో.. రాజా! ఉపనయనం పిమ్మట కపట వటువు వామనుడు, దాతలలో బలికి సాటి రాగల మేటి దానవీరుడు నేటి కాలంలో మరొకడు లేడని తేట పరచిన బ్రాహ్మణుల మాట విన్నాడు. మిక్కిలి క్షీణించిన మహేంద్రుని కాపాడాలని సంకల్పించాడు.
కం॥ ‘హరి హరి! సిరి యురమునఁ గల
హరి హరిహయు కొరకు దనుజు నడుగం జనియెం
బరహిత రతమతి యుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.’
‘హరిహరీ! ఆహా! ఏమి చిత్రం! ఔరా! ఎంత ఆశ్చర్యం! లక్ష్మీదేవిని వక్షఃస్థలంలో ధరించిన పుండరీకాక్షుడు శ్రీధరుడు సహస్రాక్షు- ఇంద్రుని రక్షించడం కోసం రాక్షసేశ్వరుడు బలిని భిక్షమడగడానికి తత్క్షణమే అతని యజ్ఞశాలకు బయల్దేరాడు. సతతం ఇతరులకు హితం- మేలు చేయడం కోసం యాచించడం గొప్పవారికి సహితం ఈ భూమండలంలో అయాచితమైన మండనమే- అలంకారమే!’ అని చమత్కరించాడు నమస్కార్యుడైన అమాత్యుడు. మరి అదే- ఆ యాచనే, తన ఉదర భరణానికైతే మాత్రం మరణ సమానమే. ‘యాచనాంతం హి గౌరవం’- ఎంత పెద్దవారికైనా చేయి చాచనంత వరకే పరువు, ప్రతిష్ఠ! యాచనకై వెడలిన జగత్ ప్రభువు విష్ణువు కూడా వామనత్వం- లఘుత్వం పొందాడు కదా! అని సూచన. ఈ సందర్భంలో సహజ పండితుడు పోతన ‘సర్వలఘు’ కందాన్ని అందుకోవడం సాభిప్రాయం, కావ్య ప్రయోజన సాధకం. కంద పద్యంలోని రెండు సగాల చివర గురువులు ఉండి తీరాలి. అవితప్ప ఇక్కడ మిగిలినవన్నీ లఘువులే. అందుకే ‘సర్వలఘు’ కందమని పేరు. లక్ష్మీపతి విష్ణువెక్కడ? భిక్షపతి వామనుడెక్కడ? ప్రాంశువు- విశ్వరూపుడైన విష్ణువు పొందిన వామనత్వం- లఘుత్వాన్ని మహాకవి ఒక శబ్దశిల్పంగా చెక్కి చూపించాడు.
రాజా! వామనుడు సర్వలోకాలనూ తన బొజ్జలో భరించే ‘దామోదర’ భగవానుడు కదా! అందుకే ఒయ్యారాలు ఒలికించే భంగిమలో నడుస్తుంటే అతని భారాన్ని భరించలేక భూమి కుంగిపోతోంది. ఆ పెద్దపెద్ద అంగలకు తాళలేక భుజంగపతి శేషుడు వంగిపోతున్నాడు. పుండరీకాక్షుని (విష్ణుని) వామనావతార ప్రాభవం- మహిమ అంతా ఆయన పాద విక్షేపం (అడుగు తీసి అడుగెయ్యడం)లోనే నిక్షిప్తమై ఉన్నట్టు మనకు ప్రత్యక్షమవుతుంది. వామనుడు దారిలో దర్శనమిచ్చిన ‘శర్మద’ను- సర్వశుభాలు కలిగించే నర్మదా నదిని దాటాడు..
కం॥‘శర్మద, యమదండ క్షత
వర్మద, నతి కఠిన ముక్తి వనితా చేతో
మర్మద, నంబు నివారిత
దుర్మద, నర్మదఁ దరించె ద్రోవన్ వటుడున్.’
ఆ పవిత్ర నది జీవులను యమబాధల నుంచి ‘వర్మద’- కవచం వలె కాపాడేది. గడుసైన ముక్తికాంత గుండెలోని ‘మర్మద’- గుట్టును రట్టు చేసేది అనగా మోక్షమిచ్చేది. తన పావన జలాలతో ప్రజల పాపాలను ప్రక్షాళన కావించేది కనుక ‘దుర్మద’. అట్టి నర్మదను దాటి వటువు విశాలమైన బలి యాగశాలలో ప్రవేశించాడు. అనుప్రాసల సరిగమల మధురిమతో వీనుల విందు చేసే పై రెండు కందాలు అమూలకాలే!
వామనుని చూచి సభికులు- ‘అబ్బ! ఈ చారు (సుందర)మూర్తి మారురూపంలో వచ్చిన మార (మన్మథ)హరుడు ముక్కంటియో! మార జనకుడు మాధవుడో! సురజ్యేష్ఠుడు హిరణ్యగర్భుడో! ద్వాదశాత్మ దివాకరుడో! లేక హవ్యవాహనుడు హుతాశనుడో- అగ్నియో! అయి ఉండవచ్చు. కాకపోతే, లోకంలో ఇంతటి కమనీయమైన కాంతికల రమణీయ రూపుడు ఎవడుంటాడు?’ అని విస్మయంతో భ్రాంతిచెంది గజిబిజి పడ్డారు. గుసగుసలాడారు. తికమకపడి కలకలం రేపారు. పుట్టుకే ఎరుగని జగజ్జెట్టి పురుషోత్తముడు దేవమాత అదితికి పట్టి (బిడ్డ)గా పొట్టి వడుగై పుట్టాడు. బలి సభా మంటపంలో భాసమానుడైన అసమాన బాల బ్రహ్మచారి భవ్యలీలలను బమ్మెర పోతన అమూలకమైన అనేక పద్యాలతో ధారాశుద్ధి శోభితంగా హేరాళంగా- కమ్మగా వర్ణించాడు…
కం॥‘ వెడవెడ నడకలు నడుచుచు
నెడనెడ నడుగిడగ నడరి యిల దిటఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచు
జిడిముడి తడఁబడగ వడుగు సేరెన్ రాజున్.’
శుక ఉవాచ.. రాజా! వడుగు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. అక్కడక్కడ అవని అడుగంటి పోతుంటే సరిగా అడుగులు వెయ్యలేక అవస్థ పడుతున్నాడు. దర్భలు, అక్షతలతో పవిత్రమైన దక్షిణ హస్తం చాచి వామనుడు బలితో ధ్వని గర్భితంగా, అంత్యానుప్రాస కలితంగా, లలితంగా, హితంగా ఇలా పలికాడు..
ఉ॥‘స్వస్తి! జగత్త్రయీ భువన శాసన కర్తకు, హాసమాత్ర వి
ధ్వస్త నిలింప భర్తకు, నుదారపద వ్యవహర్తకున్ మునీం
ద్ర స్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీ గళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్’
‘ఓ విశ్వవిజేతా! ఇక నీకు అవశ్యం స్వస్తి! (అనర్గళమైన నీ ఉద్రేకానికి, ఔద్ధత్యానికి (ఏపు) అర్గళం- గడియ వేస్తా! గొళ్లెం పెడతా! కళ్లెం బిగిస్తా!’ అని ధ్వని) అమరేంద్రుని అవలీలగా వెలవెల పోయేటట్లు చేసిన బలాఢ్యా! మహోన్నత పదవిలో మెలిగేవాడా! మునీంద్రులు మెచ్చుకొనే శుభదాయకాలైన యజ్ఞయాగాల విధానం- నిర్వహణలో విహరించేవాడా! దేవకాంతల మెడలలోని బంగారు మంగళ తంతువులను (సూత్రాలను) తెంపగలిగిన తెంపరీ! రాక్షసలోక సార్వభౌమా! నీకు అత్యంత శుభమగుగాక!- ఇలా దీవించిన వనమాలి- వామనుడు రూపుదాల్చిన వేదరాశి వలె బలిముందు నిలిచాడు. బలి అతనికి ప్రణమిల్లి, ఆసనంపై విరాజిల్ల చేసి తన ఇల్లాలు వింధ్యావళి కలశంతో నీళ్లు పోయగా వడుగు అడుగులను కడిగి తుడిచాడు. ఆ నీటిని తలపై చల్లుకొన్నాడు.
వామనుడు ఒయ్యారాలు ఒలికించే భంగిమలో నడుస్తుంటే అతని భారాన్ని భరించలేక భూమి కుంగిపోతోంది. ఆ పెద్దపెద్ద అంగలకు తాళలేక భుజంగపతి శేషుడు వంగిపోతున్నాడు.
అటు పిమ్మట బలి హలి (బలరామ) సోదరునితో (వామనుడితో) ఇలా పలికాడు. ‘ఓ వడుగా! నీవు ఎవ్వరి వాడవు? ఎవ్వడవు? నీ వాడ- నివాసమేది? నీ రాక వల్ల నా వంశం, జన్మ, జన్నం (యజ్ఞం) సఫలమయ్యాయి. ఓ బాల బ్రహ్మచారీ! నీకు ఏం కావాలి? మేలైన వస్ర్తాలా? మధుర ఫలాలా? రూకలా? ఆవులా? అశ్వాలా? కరులా- ఏనుగులా? కాంచనమా- బంగారమా? వన్యాలా- అడవి సంపదలా? కన్యకామణులా? రత్నాలా? వనాలా? భవనాలా? రుచికరమైన భోజనాలా? గ్రామాలా? పొలాలా? భూభాగాలా? ఇవికాక ఇతరాలేమైనా కావాలా?’ బలి పలుకులకు పులకించిన వామనుడు ఇలా పలికాడు…
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ98668 36006