అవాచ్య వాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతోదుఃఖతరం ను కిమ్
సమర్థత కలిగి ఉండి కూడా ఎవరైనా కర్తవ్యాన్ని విస్మరించి వెనకడుగు వేస్తే, అతని సమర్థత తెలిసినవాళ్లు కూడా అతణ్ణి హేళన చేయడానికి వెనకాడరు. ‘మహాభారత’ యుద్ధం ప్రారంభంలోనే అర్జునుడు తన నిర్వేదాన్ని సారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పి, తాను నిర్వహించవలసిన యుద్ధం పట్ల వైముఖ్యం చూపాడు. అప్పుడు స్వామి తిరిగి అతణ్ణి స్వధర్మ నిర్వహణ దిశగా ప్రేరేపించాడు. ‘అర్జునా! నువ్వంటే గిట్టనివాళ్లు అంటే శత్రుపక్షం వారు, ఇంకా నీ సామర్థ్యం తెలిసినవారు కూడా నిన్ను అనరాని మాటలతో నిందిస్తుంటారు. అంతకు మించిన బాధ మరొకటి ఉంటుందా?’ అని ప్రశ్నిస్తాడు. దీన్నిబట్టి ‘ఏ వ్యక్తి అయినా నిబద్ధతతో తన కర్తవ్య నిర్వహణను విధిగా పూర్తిచేయాలన్న’ సందేశం మనకు అందుతున్నది.
కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధులై, కౌరవపాండవ వీరులంతా రణరంగంలో నిలిచినప్పుడు అకస్మాత్తుగా అర్జునునిలో విషాదం చోటుచేసుకొంది. తీవ్ర దుఃఖంతో అస్త్ర సన్యాసం చేశాడు. అతనిలోని జాలి, మానవ హనన విముఖత, శత్రుపక్షంలో అందరూ అయినవాళ్లే ఉండటం వంటి కారణాలుగా నిర్వేదానికి లోనయ్యాడు. ఇది అతని సమర్థతకే ప్రశ్నార్థకంగా నిలిచింది. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణపరమాత్ముడు పూనుకొని పలు విధాలుగా అతనిలోని విషాదాన్ని తొలగించే ధ్యేయంతో, మరోవైపు సమస్త మానవాళికీ కర్తవ్యబోధ, మార్గదర్శనం చేశాడు. కౌరవసైన్యంలోని మహా వీరులందరికీ అర్జునుని పరాక్రమం, సమర్థత తెలిసిందే. మత్స్యయంత్ర ఛేదన, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం తదితర సందర్భాల్లో అర్జునుని సమర్థత ఎంతటిదో స్వీయానుభవంతో భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాది వీరులందరికీ తెలుసు. ఈ మహాయుద్ధానికి దుర్యోధనుడు సన్నద్ధుడు కావడానికి కూడా అర్జునుని ఎదిరించి నిలువగలిగే కర్ణుని పరాక్రమాన్ని నమ్ముకోవడం ఒక ప్రధాన కారణం. ఇటువంటి నేపథ్యంలో అర్జునుడు యుద్ధ వైముఖ్యంతో వెనుదిరిగితే అసలు కారణాన్ని పక్కకు పెట్టి, ‘అతడు అసమర్థుడు’, కనుకనే తమ వైపున్న మహావీరుల పరాక్రమానికి జడిసి అర్జునుడు వెనుదిరిగాడని అవహేళన చేస్తారు. ఈ విషయాన్నే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పుడు అర్జునుడు, ‘తన శక్తి సామర్థ్యాలు వాళ్లందరికీ తెలిసినవే కదా!’ అన్నాడు.
అప్పుడు నారాయణుడు ఇలా అన్నాడు- ‘సమర్థత గురించి సంపూర్ణంగా తెలిసినవారే తమ అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివ్యక్తి చర్యతో హేళన చేసి నవ్వుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మానవ సహజ ప్రవృత్తి. ఎందుకు యుద్ధం చెయ్యడానికి నిరాకరిస్తున్నాడో ఆ కారణాన్ని వాళ్లు పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడరు. కేవలం తమ శక్తికి వెరచి మాత్రమే యుద్ధం నుంచి వెనుదిరిగినట్లుగా భావింపజేసే ప్రయత్నం చేస్తారు. ఇది శత్రువుల దృష్టిలో నిన్ను, నీ పరాక్రమాన్ని తక్కువ చేసుకునే చర్యయే తప్ప మరొకటి కాదు’. యథార్థానికి అర్జునుని పరాక్రమ ధాటికి తట్టుకొని నిలబడగలిగే వీరులు కౌరవసైన్యంలో ఒకరిద్దరు తప్ప వేరెవరూ కనిపించరు. వారు కూడా అర్జునునితో తలపడి కొంతవరకు యుద్ధం చెయ్యగలిగిన సమర్థులే కానీ, అతనిపై విజయాన్ని సాధించలేరన్నది కాదనలేని సత్యం. ‘శ్రీమద్భగవద్గీత’ సర్వమానవాళికి గొప్ప విలువలను బోధించిన ప్రవర్తనా శాస్త్రం. నరుని లక్ష్యంగా చేసుకొని నారాయణుడు ప్రసాదించిన ఈ ప్రబోధాత్మక మహాగ్రంథం ‘సమర్థులైన వారెవ్వరూ కర్తవ్య విముఖులు కారాదని’ ఘంటాపథంగా వెల్లడించింది. ఇలా హేళన చేయబడి, అనరాని-వినరాని మాటలతో ఎదుటివాళ్లు నిందించడానికి మనమే స్వయంగా వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కనుక, సమర్థత కలిగిన వ్యక్తులకు ఇంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదన్నది అందరూ తెలుసుకోవాలి.
గన్నమరాజు
గిరిజా మనోహర బాబు