Tollywood | కొన్నేళ్లుగా సినిమా మొత్తం హీరోయిజం చుట్టూనే తిరుగుతున్నది. కథకోసం హీరోను వెతికేరోజులు పోయాయి. హీరో చుట్టూ కథలు అల్లే కాలం నడుస్తున్నదిప్పుడు. ఈ మధ్య అయితే.. మరీ ముఖ్యంగా ‘కేజీఎఫ్’ వచ్చినప్పట్నుంచీ ఎలివేషన్స్ ఓ ట్రెండ్గా మారిపోయాయి. హీరోని ఎంత ఎలివేట్ చేస్తే సినిమాకు అంత ప్లస్ అని దర్శకనిర్మాతలు బాగా నమ్మేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఏమీ పాలుపోక, అర్థంకాక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. సినిమా మనిషి జీవితంలో భాగమైపోయింది కనుక.. వినోదానికి సినిమాను మించిన సాధనం లేదు కనుక.. సామాన్యుడికి ఖాళీ సమయంలోసినిమానే గతి కనుక.. ఎలా ఉన్నా చూడాల్సిందే. అప్పుడప్పుడు మాత్రం ఆత్మసంతృప్తినిచ్చే సినిమాలు తగులుతుంటాయి.. భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీలా! అసలు ‘హీరోయిజం’ విషయంలో సినిమాల ధోరణి సరైనదేనా? అనే విషయాన్ని కాస్త సునిశితంగా విశ్లేషించుకుందాం.
హీరోయిజం.. ఎలివేషన్స్.. వీటికి విత్తనం ఎక్కడ పడిందో తెలుసా? ‘రామాయణం’.. అవును.. రామాయణం నుంచే హీరోయిజం అనేది మొదలైంది. హీరోయిజాన్ని ఆవిష్కరించిన తొలి రచయిత వాల్మీకి. అసలు రామాయణంలో ఉన్నంత హీరోయిజం, ఎలివేషన్స్ ఈనాటికీ ఎక్కడా మనకు కానరావు. ముఖ్యంగా రామాయణంలో ‘మారీచ ఉవాచ’ చదివినవాళ్లకు ఎలివేషన్ అంటే ఏంటో అవగతమవుతుంది. హీరోనీ, హీరో క్యారెక్టర్నీ, హీరో కెపాసిటీనీ, కేపబులిటీనీ ‘మారీచ ఉవాచ’లో వాల్మీకి చెప్పిన తీరుకు ఆకాశమే హద్దు. అందుకే, నేటికీ రాముడ్ని మించిన మాస్ హీరో లేడు. రామాయణాన్ని మించిన జనరంజక కావ్యం లేదు. చివరికి మహాభారతంలోని కొన్ని ముఖ్య పాత్రల విషయంలోనూ రామాయణ ప్రభావం ఉంటుందనేది పండితాభిప్రాయం. ఏదేమైనా, మన కావ్యాలు ప్రపంచానికే ఆదర్శం. ఇది నిజంగా దేశానికే గర్వకారణం. అయితే.. వాల్మీకి, వ్యాసభగవానుడు సమాజానికి మంచి చెప్పడానికి సృష్టించిన ఈ ప్రక్రియ నేటి క్రియేటర్లకు కమర్షియల్ ఫార్ములా అయి కూర్చుంది.
అప్పట్లో.. కథే హీరో
తెలుగు సినిమా విషయానికొస్తే.. తొలినాళ్లలో కథే హీరో. అందులో పాత్రధారులు మాత్రమే ఉండేవారు. అలాంటి సమయంలో, ‘పాతాళభైరవి’తో హీరోయిజం అనేది పుట్టుకొచ్చింది. ఎన్టీరామారావు సూపర్స్టార్గా అవతరించారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని కథలు తయారు చేయటం మొదలైంది. అంతటి ఇమేజ్ వచ్చాక కూడా రామారావు మాస్ పాత్రలకోసం వెంపర్లాడలేదు. సాంఘిక సినిమాల్లో సగటు మనిషిలాగే కనిపించేవారు. జానపద, చారిత్రక కథల్లో మాత్రం కత్తులు ఝళిపిస్తూ మాస్ మెరుపులు మెరిపించేవారు. ఆ విధంగా, అటు క్లాస్నీ, ఇటు మాస్నీ కట్టిపడేశారు ఎన్టీయార్. అక్కినేని విషయానికొస్తే.. ఆయన 250 పైచిలుకు సినిమాలు చేస్తే, వాటిలో దాదాపు 200 సినిమాల్లో సామాన్యుడిగానే కనిపించారు.. అలరించారు. ఏనాడూ నేలవిడిచి సాము చేయలేదు. డబ్బుకోసం సినిమాలు చేస్తూనే మధ్యమధ్య ఆత్మసంతృప్తికోసం కూడా కొన్ని చిత్రాలు ఎంచుకునేవారు.
దేవదాసు, బాటసారి, అర్ధాంగి, తోడికోడళ్లు, మాంగల్య బలం, చదువుకున్న అమ్మాయిలు, కులగోత్రాలు.. ఆ తరహా సినిమాలే. వీటిల్లో హీరో ఏం వీరుడూ శూరుడూ కాదు, సామాన్యుడు.. ఆ విధంగా ఇద్దరు మహానటులూ వ్యక్తిగత హీరోయిజాన్ని పక్కనపెట్టి కథలను నమ్ముకునే ముందుకెళ్లారు. వీళ్లటైమ్లో అసలు ఎలివేషన్లే లేవు.. ఓన్లీ ఎమోషన్లే. వాటిలోనే అద్భుతమైన హీరోయిజం ఉండేది. తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజులాంటి హీరోలు కూడా ఆ ఇద్దరినే అనుసరించారు. ఈ కారణంగా అప్పట్లో మంచి కథలొచ్చాయి. వెండితెర వెలిగిపోయింది. అందుకే ఆ కాలం స్వర్ణయుగంగా పేరుగాంచింది. కొంతకాలానికి ఎన్టీఆర్ ఆ పరిధులు దాటి ముందుకెళ్లారు. ‘అడవి రాముడు’తో తెలుగు సినిమాలో ఎలివేషన్ల శకం మొదలైంది. సోషల్ సినిమాల్లో కూడా హీరోను అసామాన్యుడిగా, దైవాంశ సంభూతుడిగా చూపించడం మొదలైంది. ఏనుగులొచ్చి హీరో మెళ్లో దండలేయడం, సింహాలతో హీరో ఫైటింగులు చేయడం, అదిరిపోయే లెవల్లో హీరో ఇంట్రడక్షన్, పిచ్చెక్కించే లెవల్లో హీరో ఫస్ట్ఫైట్, హీరోయిన్లతో స్టెప్పులు, పవర్ఫుల్ పంచ్ డైలాగులు… ఇవన్నీ అడవి రాముడు చలవే. అక్కణ్నుంచి తెలుగు సినిమా నడకే మారిపోయింది.
ఆ తర్వాత తరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, సుమన్, రాజశేఖర్ కూడా ‘అడవి రాముడు’ ఫార్ములాలోనే వెళ్లారు. మధ్యమధ్యలో ఆత్మసంతృప్తి కోసం ఇతర సినిమాలూ చేసేవారు. ఇప్పుడైతే హీరోయిజానికి, ఎలివేషన్లకూ పట్టపగ్గాలు లేకుండా పోయింది. హీరో అనేవాడు ఎంతమందిని నరికితే సినిమా అంత హిట్. హీరోపై ఎన్ని ఎలివేషన్లుంటే సినిమాకు అంత ప్లస్సు. కానీ, ఎలివేషన్సే సర్వస్వం అనుకుని.. కథను నిర్లక్ష్యం చేస్తే మాత్రం చేదు అనుభవం తప్పదనే కఠిన వాస్తవం ఇప్పటికే తారలకు బోధపడింది. దారి మార్చుకుని కొత్తగా ప్రయత్నిస్తున్నవారూ ఉన్నారు. ఎలివేషన్ బిర్యానీలో మసాలా లాంటిది. ఆ ఘాటు బిర్యానీ రుచిని మింగేయకూడదు.
ఎమోషన్స్ వర్సెస్ ఎలివేషన్స్
పదిమందిని కొట్టేవాడు.. పంచ్ డైలాగులు పేల్చేవాడు మాత్రమే హీరో కాదు. సగటు మనిషి కూడా హీరోనే. ప్రేక్షకుడు తనకు తాను ఐడెంటిఫై చేసుకునేలా తెరపై హీరో పాత్ర ఉండాలి. జనాలకు కావాల్సింది ఎలివేషన్స్ కాదు. పక్కా ఎమోషన్స్. బాలీవుడ్లో మాస్ ఇమేజ్ ఉన్న ఆమిర్ఖాన్ ‘దంగల్’ ఎందుకు చేశాడు? సల్మాన్ ‘భజరంగీ భాయిజాన్’గా ఎందుకు నటించాడు? ఆ సినిమాలు వందలకోట్ల వసూళ్లు రాబట్టాయి. హీరోయిజం కథలో ఉండాలి. పాత్రలో ఉండాలి. ఎలివేషన్లలో కాదు. మన యువహీరోలు నేల విడిచి సాము చేయకుండా నేలపై నడిచే కథలు చేస్తే తెలుగు సినిమాకు మంచి కథలొస్తాయి.
…? నరసింహా బుర్రా