Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే అభిమానులకు ఇప్పుడు ఓటీటీ రూపంలో మరో అవకాశం దక్కింది. ఫిబ్రవరి 6 నుంచి ‘ది రాజా సాబ్’ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ ప్రారంభమవ్వడంతో ప్రభాస్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఈ ఓటీటీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కొంతమంది అభిమానులు జియో హాట్స్టార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున బిర్యానీ పార్సెల్స్ ఆర్డర్ చేయడం వైరల్ అయింది. ఈ ఫుడ్ ఆర్డర్లకు సంబంధించిన ఫోటోలను జియో హాట్స్టార్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఆ ఫోటోలతో పాటు వారు ఇచ్చిన సరదా క్యాప్షన్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంది . లవ్వే… లవ్వే… అంతా లవ్వే. థాంక్యూ డార్లింగ్. అందరూ కొట్టి చంపేస్తారు… మీరు మాత్రం పెట్టి చంపేస్తున్నారు అంటూ పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. పోస్టును చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. ప్రభాస్ ఫుడ్తో ఎలా చంపేస్తాడో, అతడి ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారు , ఇదీ అసలైన ఫ్యాన్డమ్, డార్లింగ్ స్టైల్ ఫాలో అవుతున్న అభిమానులు అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభాస్ ఫుడ్ లవర్ అనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు హీరోయిన్లు, టెక్నీషియన్లు గతంలో ఇంటర్వ్యూల్లో ఆయన పంపే భోజనాల గురించి సరదాగా చెప్పుకొచ్చారు. అదే ప్రేమను ఇప్పుడు అభిమానులు కూడా అనుసరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, థియేటర్లలో సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన సమయంలో కొంతమంది ఫ్యాన్స్ దర్శకుడు మారుతి ఇంటికి భారీగా ఫుడ్ ఆర్డర్లు పెట్టి ట్రోల్ చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ సందర్భంగా రివెంజ్ మూడ్ను పక్కనపెట్టి ప్రేమతో ఫుడ్ పంపించడం అభిమానుల తీరు మారిందనే సంకేతాలు ఇస్తోంది. మొత్తానికి ‘ది రాజా సాబ్’ ఓటీటీ రిలీజ్తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన ఈ ఫుడ్ హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది.