Xiaomi EV Cars | షియోమీ.. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, హోం అప్లియెన్సెస్ తయారీ సంస్థ.. ఇప్పుడు కార్లు అందునా ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగు పెడుతున్నది. ఇందుకోసం రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీస్) డిజైన్ చేసిన షియోమీ.. వాటి తయారీ కోసం చైనాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ ‘బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ అండ్ కో (బీఏఐసీ)`తో జత కట్టింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల తయారీకి అనుమతించాలని చైనా రెగ్యులేటరీ సంస్థలకు బీఏఐసీ దరఖాస్తు చేసుకున్నది. రోజురోజుకు కార్ల మార్కెట్లో పోటీ పెరిగిపోతున్న నేపథ్యంలో షియోమీ బ్రాండ్ కార్ల తయారీలో అడుగు పెట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. కార్లు తయారు చేస్తామని 2021లోనే షియోమీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బీవైడీ లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీతో ‘ఎస్యూ7’, సీఏటీఎల్ నికెల్-కోబాల్ట్ బేస్డ్ లిథియం బ్యాటరీతో ఎస్యూ 7 మ్యాక్స్ కార్లను తయారు చేయడానికి అనుమతి కోరుతూ రెగ్యులేటరీ సంస్థలను బీఏఐసీ ఆశ్రయించింది. ఎస్యూ7 కారు గంటకు 210 కిలోమీటర్ల వేగం, ఎస్యూ7 మ్యాక్స్ గంటకు 265 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఎస్యూ7, ఎస్యూ7 మ్యాక్స్ కార్లు రెండింటిపైనా రేర్లో `షియోమీ`, ఫ్రంట్లో ‘ఎంఐ’ లోగోతో వస్తున్నాయి.
ఈ రెండు షియోమీ ఎలక్ట్రిక్ కార్లు ఏటా రెండు లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయనున్నది బీఏఐసీ. రెగ్యులేటరీ సంస్థల అనుమతి కోసం పెట్టిన దరఖాస్తులపై బీఏఐసీ గానీ, షియోమీ గానీ స్పందించలేదు. గత ఆగస్టులోనే ఎలక్ట్రిక్ కార్ల నిర్మాణానికి షియోమీకి చైనా స్టేట్ ప్లానర్ అనుమతి ఇచ్చినా ఇప్పుడు ఎంఐఐటీ నుంచి టెక్నికల్, సేఫ్టీ అనుమతులు రావాల్సి ఉంది.