హైదరాబాద్, ఏప్రిల్ 18: ఎలక్ట్రిక్ చార్జర్లు, అందుకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీ సంస్థ ర్యాపిడ్ఈవీచార్జ్ఈ..హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహన చార్జర్ల తయారీ యూనిట్ను నెలకొల్పేయోచనలో ఉన్నది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూనిట్ను నెలకొల్పాలనుకుంటున్నట్లు కంపెనీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీ శివసుబ్రమణియం తెలిపారు. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్న ప్లాంట్లో చార్జర్లు తయారవుతున్నాయని, వీటికి డిమాండ్ అధికంగా ఉండటంతో ఫ్రాంచైజ్ పద్దతిన ఉత్పత్తి చేయడం అంత సులువుకాదని ఆయన చెప్పారు. చార్జింగ్ స్టేషన్ల కొరత తీర్చడానికి సంస్థ..తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో వచ్చే ఏడాదిన్నర లోగా వెయ్యి చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.40 వేల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. వీటి ఇన్స్టాలేషన్ ఖర్చులు ఆపరేటర్ భరించాల్సి ఉంటుందని చెప్పారు. 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు చార్జింగ్ పాయింట్లు ఉండనున్నాయి. చార్జింగ్ టారిఫ్ను రూ.8 నుంచి రూ.25 మధ్యలో నిర్ణయించింది. ఎలక్ట్రిక్ పోల్ చార్జింగ్ స్టేషన్లు లాగా ఉండే ఈ చార్జింగ్ స్టేషన్లలో పవర్ సాకెట్, మినీ స్క్రీన్ లేదా క్యూఆర్ కోడ్తో కూడా చార్జింగ్ చేసుకునే వీలుంటుంది. యాప్తో స్లాట్ బుకింగ్తోపాటు చెల్లింపులు జరుపవచ్చును కూడా. ఇలాంటి సదుపాయాలను ఇప్పటికే కోయంబత్తూరులో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, త్వరలో ఇక్కడ కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.