న్యూఢిల్లీ : ఎఫ్ఎంసీజీ సెక్టార్ దిగ్గజం హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,100 కోట్లు. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,897 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 13.21 శాతం పెరిగి రూ.11,966 కోట్లకు చేరుకున్నాయని హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.10,570 కోట్లు.
2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హెచ్యూఎల్ మొత్తం వ్యయం రూ.9,546 కోట్లుగా ఉన్నది. ఇది 14.68 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం వ్యయం రూ.8,324 కోట్లు. ‘సవాలుగా ఉన్న వాతావరణంలో కూడా ఆదాయాలు, లాభాల పరంగా బలమైన పనితీరును అందించాం. త్రైమాసికంలో మా పనితీరు స్థితిస్థాపకంగా ఉన్నది. మా సామర్థ్యాలు, కార్యకలాపాల సామర్థ్యం, మా పోర్ట్ఫోలియో అంతర్గత బలాన్ని ప్రతిబింబిస్తుంది. రానున్న రెండేండ్లలో డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని హెచ్యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా చెప్పారు. బీఎస్ఈలో హెచ్యూఎల్ షేర్లు గురువారం 0.50 శాతం లాభంతో రూ.2,446.15 వద్ద ట్రేడవుతున్నాయి.
హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ భారతదేశంలో ప్రముఖ వినియోగదారుల వస్తువుల సంస్థ. ఇది బ్రిటిష్ ఎఫ్ఎంసీజీ కంపెనీ యూనిలీవర్కు అనుబంధ సంస్థ. ఆహార పదార్థాలు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, వాటర్ ప్యూరిఫైయర్లను తయారు చేస్తుంది. 1931లో హిందుస్తాన్ కూరగాయల ఉత్పత్తి సంస్థగా స్థాపించారు. ఈ సంస్థకు 2007 జూన్ లో హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్గా పేరు వచ్చింది.