విజయవాడ: నూజివీడులో ఓ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అక్కడ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఆతగాడ్ని ప్రతిఘటించి తప్పించుకుని పారిపోయింది. నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆటో డ్రైవర్పై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిపై 363, 354, ఐపిసి 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నూజివీడుకు చెందిన ఓ బాలిక తన స్నేహితుడు ఆంజనేయులును కలిసేందుకు ఆదివారం రాత్రి విజయవాడ చేరుకున్నది. స్నేహితుడు బస చేసిన హోటల్ గురించి ఆరా తీయడం ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. హోటల్ చూపిస్తానంటూ నమ్మించిన ఆటో డ్రైవర్.. ఆ బాలికను నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. దాంతో ఆటోడ్రైవర్ను పక్కకు తోసేసి తప్పించుకున్నది. 100 నంబర్కు డయల్ చేసి పోలీసుల సాయం కోరింది. మరుకొన్ని నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలికను రక్షించారు. అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు తీవ్రంగా గాలించాయి. చివరకు ఆటో డ్రైవర్ ఖాదర్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికను విచారించి ఆమె తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు.
బాలికపై లైంగికదాడి కేసులో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా చెప్పారు. మహిళలు, యువతులు ఒంటరిగా బయటకు వచ్చేటప్పుడు కుటుంబ సభ్యుల సాయం తీసుకోవాలని, మొబైల్ ఫోన్లలో ‘దిశ’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో పోలీసులకు సమాచారం అందించి రక్షణ పొందవచ్చునని సీపీ చెప్పారు.