రాష్ర్టానికి ఒక్క సంస్థనూ ఇవ్వని కేంద్రం
విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
వివిధ వర్గాల వారికి 672 గురుకులాలు
1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం
పట్టభద్రులతో మంత్రి కేటీఆర్
వాణీదేవిని గెలిపించాలని పిలుపు
కంటోన్మెంట్, మార్చి 8: జాతీయ స్థాయిలో ఐఐఎం, ఐసర్, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలను స్థాపించిన కేంద్రం తెలంగాణకు ఒక్క సంస్థను కూడా కేటాయించలేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కేంద్రం పదే పదే చెప్తున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రధాని చెప్పే టీమిండియా స్ఫూర్తి ఇదేనా అని నిలదీశారు. వివిధ రంగాల్లో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన సంస్థలను తెచ్చామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకోసం 672 గురుకులాలను ఏర్పాటుచేశామని చెప్పారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ సెయింట్ మేరీ ఫార్మసీ కాలేజీలో విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నదని చెప్పారు. రూ.350 కోట్లతో 240 గురుకులాలకు శాశ్వత భవన నిర్మాణ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 15 లక్షల మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందిస్తున్నామని వివరించారు. హాస్టళ్లలో మెస్లకు సంబంధించిన పాత బకాయిలు చెల్లించడమే కాకుండా.. మెస్చార్జీలను పెంచామని గుర్తుచేశారు. రూ.12,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థులకోసం చెల్లించినట్టు వెల్లడించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గురుకులాల స్థాపనతోపాటు 53 డిగ్రీ కాలేజీలు, 11 పాలిటెక్నిక్ కాలేజీలు, 5 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటుచేశామని మం త్రి కేటీఆర్ తెలిపారు. విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, విదేశాల్లో చదువుకొనేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నామని, ఈ స్కీం కింద ఇప్పటివరకు 3,850 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకొంటున్నారన్నారు. రూ. 250 కోట్లతో పోటీ పరీక్షలకోసం జిల్లాస్థాయిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. స్టడీ సర్కిళ్లద్వారా దాదాపు ఐదువేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.
అరవై ఏండ్లలో సాధ్యం కాని ప్రగతిని ఆరేండ్లలో చేసి చూపించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో లక్ష కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేయగలిగే స్థితికి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సమస్యలను పరిష్కరించామని, వైద్య సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టామని, ఒక్క హైదరాబాద్లోనే 350 బస్తీ దవాఖానలను ఏర్పాటుచేశామని వివరించారు. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సురభి వాణీదేవి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు మాత్రమే కాదని.. ఆమెకు ఉన్నత విద్యావంతురాలుగా మండలిలో కూర్చొనే అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ఆమెకు అందరి ఆశీస్సులు కావాలని మంత్రి కేటీఆర్ కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తే, అందులో 19,200 టీచర్ పోస్టులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అయినా, బీజేపీ, కాంగ్రెస్ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రైవేట్రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి టీఎస్ఐపాస్ వంటి కార్యక్రమాన్ని తేవడం ద్వారా దాదాపు 15 వేల కంపెనీలకు అనుమతులిచ్చి, 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించగలిగామని చెప్పారు. గత ఆరేండ్లుగా తెలంగాణ ఇంతగా అభివృద్ధి చెందుతుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించడంలేదని చెప్పారు. ఐటీఐఆర్, కోచ్ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ప్లాంట్ వంటి వాటి విషయంలో అన్యాయం చేస్తున్న కేంద్రం విభజన చట్టంలోని హామీలనూ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యాధికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.