హైదరాబాద్ (నమస్తే తెలంగాణ ) : దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి శుభవార్త. ఇక నుంచి ప్రవేశపరీక్ష.. మార్కులతో నిమిత్తం లేకండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కల్పిస్తున్నది.
గతంలో ఇగ్నో ఎంబీఏలో ప్రవేశాల కోసం ‘ఓపెన్ మ్యాట్’ ప్రవేశ పరీక్షను నిర్వహించేవారు. ఇప్పుడు ప్రవేశపరీక్షలో నిమిత్తం లేకుండా డిగ్రీ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. ఏఐసీటీఈచే గుర్తింపు పొందిన ఈ కోర్సును కనిష్ఠంగా రెండేండ్లు, గరిష్ఠంగా నాలుగేండ్లల్లో పూర్తిచేయవచ్చు. జనరల్ విద్యార్థులు డిగ్రీలో కనీసంగా 50శాతం మార్కులు, రిజర్వ్డ్ కోటా 45 శాతం మార్కులు పొంది ఉండాలి.
విద్యార్థులు ఈ నెల 30లోగా ignouadmission.samarth.edu.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 94924 51812, 040 -23117550 నెంబర్లను సంప్రదించాలని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ ఫయాజ్ అహ్మద్ తెలిపారు.
హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుంచి ప్రతి ఏటా 200 -300 వరకు విద్యార్థులు అర్హత సాధించి, చేరుతుండగా, తాజాగా ప్రవేశపరీక్షతో నిమిత్తం లేకుండా ప్రవేశాలు కల్పిస్తుండటంతో వీరి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.