El Nino Effect | ఉపరితల ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization) ప్రకటించగా.. దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా (Latin America) దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఎల్ నినో ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎల్నినో అంటే
ఎల్నినో అంటే పెరూ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. ఎల్నినో అనేది ఒక స్పానిష్ (లాటిన్) పదం. లాటిన్ భాషలో ఎల్నినో అంటే క్రీస్తు శిశువు జననం. దీని కారణంగా భారత, ఆగ్నేయ ఆసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది.
ఎల్నినోతో భారత్లో కరువు
గత మూడేండ్లుగా పసిఫిక్పై వరుసగా లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లానినో గత ఏడాది సెప్టెంబర్తో పూర్తయిపోయింది. ఇప్పుడు ఎల్నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో భారత్లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు సాధారణంకంటే తక్కువ వర్షపాతాన్నిచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ ఎల్నినో 2027 వరకు కొనసాగుతుందని ఐరాస వాతావరణ విభాగం హెచ్చరించింది. దీనివల్ల భారత్సహా చాలా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది.
ఎల్నినో ఎఫెక్ట్
ఎల్నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్నినో విభిన్నమైందే. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్నినోతో వరదలు, కరువులు సంభవించడమే కాదు వాతావరణం వేడెక్కడం మరో సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎల్నినో సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమిదే. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే.
ఎల్ నినో ఏర్పడినప్పుడు పగడపు దీవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 1998లో ఏర్పడిన ఎల్ నినో కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 16 శాతం పగడపు దీవులు నశించాయని అంచనా. 2015-16లో వచ్చిన ఎల్నినో సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 75-99 శాతం పగడాలు నశించాయి. ఎల్నినోతో కార్చిచ్చులు చెలరేగడం ఎక్కువవుతాయి.
మహాసముద్రాలు వేడెక్కడం వల్ల నైరుతి రుతుపవనాల కదలికలు మందగించవచ్చు. ఫలితంగా వర్షాలు పడటం తగ్గుతుంది. గతంలో ఎల్నినో సంభించినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో పంటలకు నష్టం కలిగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. దేశంలో 2001-20 మధ్యకాలంలో ఎల్నినో సంవత్సరాలను ఎదుర్కొంది. వీటిలో నాలుగు ఎల్నినో సంవత్సరాల్లో కరువు ఏర్పడింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఈ సంత్సరాల్లో ఖరీఫ్లో పంట దిగుబడి 16 శాతం, 8 శాతం, 10 శాతం, 3 శాతం చొప్పున తగ్గాయి. ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దేశ వార్షిక ఆహార సరఫరాలో సుమారు సగం వాటా ఖరీఫ్ కాలంలో పండిన పంటలదే.