చండీగఢ్, సెప్టెంబర్ 18: మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ పంజాబ్ రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకొన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో ఆధిపత్య పోరులో సీఎం అమరీందర్ ఓడిపోయారు. శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్కు సమర్పించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ‘నన్ను చాలా అవమానించారు. అందుకే రాజీనామా చేశాను. ఇక ఎవరినైనా సీఎంగా చేసుకోనీయండి’ అని అమరీందర్ తన రాజీనామా అనంతరం విలేకరులతో ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయంగా తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, అవసరమైనప్పుడు కచ్చితంగా ఉపయోగిస్తానని చెప్పారు. ‘నాకు తెలియకుండా రాష్ట్ర ఎమ్మెల్యేలను రెండుసార్లు ఢిల్లీకి పిలిచి సమావేశం పెట్టారు. ఈ రోజు చండీగఢ్లో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష (సీఎల్పీ) సమావేశం పెట్టారు. నేను ప్రభుత్వాన్ని నడపలేను అని అనుమానంగా ఉందో.. మరేంటో తెలియదు కానీ నన్ను అవమానించారు’ అని అమరీందర్ అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను మాత్రం సీఎం చేయవద్దని డిమాండ్ చేశారు.
సోనియాతో ఉదయమే చెప్పాను
అమరీందర్ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు సోనియాకు లేఖ రాశారు. దీంతో పార్టీ శనివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసింది. అమరీందర్ శనివారం ఉదయమే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడారు. ‘రాజీనామా విషయం సోనియాకు అప్పుడే చెప్పాను’ అని విలేకరులతో అన్నారు. పార్టీ మారుతారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… ‘మద్దతుదారులతో చర్చించి చెప్తాను’ అన్నారు. శనివారం సాయంత్రం పంజాబ్ సీఎల్పీ సమావేశం జరిగింది. కొత్త సీఎం ఎన్నిక ఉంటుందని అందరూ భావించారు. కానీ, సీఎం ఎంపిక నిర్ణయాన్ని సోనియా గాంధీకే వదిలేస్తూ పంజాబ్ సీఎల్పీ తీర్మానం చేసింది. అయితే, ఈ తీర్మానంలో అమరీందర్ను ప్రశంసించడం విశేషం.
సిద్ధూ-కెప్టెన్ టగ్ ఆఫ్ వార్
పంజాబ్లో చాలా కాలంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ-అమరీందర్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. అమరీందర్ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకొని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించినా విభేదాలు సద్దుమణగలేదు. కొంతకాలంగా సిద్ధూ తన వర్గం ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేస్తూనే ఉన్నారు. సిద్ధూకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని గుర్తించిన అధిష్ఠానం కావాలనే అమరీందర్ పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
పాక్తో యుద్ధంలో పాల్గొన్నారు
పటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్ డిగ్రీ తర్వాత సైన్యంలో చేరారు. 1965లో పాక్తో జరిగిన యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. రిటైర్మెంట్ తరువాత రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరారు. 1980లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు.1984లో బ్లూస్టార్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. 1995లో శిరోమణి అకాళీదళ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు. 2002-07మధ్య తొలిసారి సీఎంగా పనిచేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చారు. ప్రస్తుతం అమరీందర్ వయస్సు 79 ఏండ్లు. సిద్ధూ 2017లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు.
సిద్ధూతో దేశ భద్రతకు ముప్పు
కొత్త సీఎంగా సిద్ధూను అంగీకరించను. ఆయన పార్టీకి పట్టిన దరిద్రం. అయన్నుగనక సీఎంగా నియమిస్తే నేను కచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఒకే ఒక్క మంత్రిత్వశాఖను నియంత్రించలేని సిద్ధూ రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు? ఆయన అసమర్థుడు. సిద్ధూ దేశద్రోహి. ఆయనకు పాక్తో సంబంధాలు ఉన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్తో స్నేహం ఉంది. ఆయనను సీఎంగా నియమించడం దేశభద్రతకు ముప్పు. –రాజీనామా అనంతరం అమరీందర్