బెంగళూరు : బెంగళూరులో ఘోరం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై స్కూల్ అమ్మాయిలు కొట్టుకున్నారు. బెంగళూరులోని బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు, మరో పాఠశాలకు చెందిన అమ్మాయిలు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు.
Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022
బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ అమ్మాయిలు యూనిఫాం ధరించగా, మరో స్కూల్కు చెందిన విద్యార్థినులు సివిల్ డ్రస్సుల్లోనే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం విఠల్ మాల్యా రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. బేస్ బాల్ బ్యాట్ను ఒకరికొకరు మార్చుకుంటూ దాడులు చేశారు. ఓ అమ్మాయి వెంట్రుకలు పట్టుకుని లాగారు. రోడ్డుపై పడేసి ఈడ్చుకెళ్లారు. ఈ దాడుల్లో పలువురు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది.
అమ్మాయిల మధ్య చోటు చేసుకున్న గొడవను విడిపించేందుకు ఏ ఒక్కరూ కూడా సాహసం చేయలేదు. ఈ ఘటనపై ఇప్పటి వరకు అటు పోలీసులు కానీ, ఇటు స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇద్దరమ్మాయిలకు సంబంధించిన ఓ బాయ్ ఫ్రెండ్ విషయంలోనే గొడవ తలెత్తినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్ర్కీన్ షాట్ల ద్వారా తెలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ బెంగుళూర్ అన్న రీతిలో ఈ స్ట్రీట్ ఫైట్ సాగింది. స్కూల్ డ్రెస్సులో అమ్మాయిలు కొట్టుకున్న తీరు ఓ కొత్త ట్రెండ్కు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఇలాంటి ఘటనలే కొన్ని జరిగాయి. మే ఒకటో తేదీన తమిళనాడులోని మధురై బస్ స్టాప్లో రెండు గ్రూపులుగా అమ్మాయిలు కొట్టుకున్నారు. ఇక ఏప్రిల్ 26వ తేదీన కూడా చెన్నైలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థినుల మధ్య గొడవ జరిగింది. అప్పుడు కూడా వాళ్లు పంచ్లు విసురుకున్నారు.