శాసనంలో కాకతీయ చక్రవర్తులైన ప్రోలరాజు, మహాదేవుడు, గణపతిదేవుల ప్రశంస ఉన్నది. ఆ తర్వాత కాయస్థరాజుల వంశానుక్రమం పేర్కొనబడింది. అందులో బ్రహ్మరాక్షస గంగయ గణపతిదేవ చక్రవర్తికి దక్షిణ భుజదండ (కుడిభుజం)గా ఉన్నట్లు పేర్కొనబడినాడు. గంగయ తాత ధన్వ, తండ్రి ధసువ. ఈ ధసువ బౌద్ధ ధర్మాన్ని అవలంబించేవాడని, అతడు జీవులను కాపాడటంలో సంతోషాన్ని పొందేవాడని (ప్రాణి త్రాణ పరాయణ సుఖతనుర్ బౌద్ధే సదా బద్ధా ధీ:) అని శాసనంలో చెప్పబడింది.
శాసనంలో కృష్ణుడు విశేషంగా వర్ణించబడినాడు. గోమతి నదీ తీరంలో ఉన్న ద్వారకలో ఉండే శ్రీకృష్ణుడిని ఎంత వర్ణించినా తక్కువే. గంగ సేనాపతి ‘చిత్తాలు’ (చిట్యాల) అనే గ్రామాన్ని ద్వారకలో ఉన్నటువంటి కృష్ణునికి తన రాజ్యాభివృద్ధిని కాంక్షిస్తూ సమర్పించాడు.
తెలుగుభాషలో ఉన్న అంశాన్ని గమనించినట్లయితే దానంగా సమర్పించిన చిట్యాల గ్రామానికి సరిహద్దులు పేర్కొనబడినాయి. ఈశాన్యంలో వనం మీదనుండి ఇవలిద్దడియమ, ఉత్తర దక్షిణమున అంతనుండి పడుమర తమ్మనకురువ (కాలి త్రోవ), అంతనుండి దాలకురువ, అంతనుండి పురిసుబల్లి, అంతనుండి ప్రక్కరావప్ప, అంతనుండి వడ్లబండ అని సరిహద్దులు పేర్కొనబడినాయి. (శాసనంలో సరిహద్దులు ఈ విధంగానే ఇవ్వడినాయి) ఇందులో ‘కురువ’ అంటే కాలితోవ (బాట) అనే అర్థం చెప్పబడింది.
ఈ శాసనంలో కృష్ణునిపై ఉండే అమితమైన భక్తి విశ్వాసాలను తెలపడానికి, ఆ స్వామి తనను కాపాడుతాడనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే చిట్యాల వాసి ఉత్తర భారతంలో ఉండే శ్రీకృష్ణునికి చిట్యాల గ్రామాన్ని సమర్పించడం చాలా విశేషంగా చెప్పవచ్చు. కాయస్థ వంశీయులకు సంబంధించిన మొదటి తెలుగు శాసనంగా కూడా ఇది ప్రత్యేకతను సంతరించుకున్నది.
కాకతి గణపతిదేవుని కాలంలో అనేక ప్రజోపయోగ నిర్మాణాలు జరిగాయి. అందులో చెరువులు ముఖ్యమైనవి. కాకతీయ సామ్రాజ్యం ఆర్థిక, వ్యాపార రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. అన్ని రంగాల్లో అన్ని వర్గాలు, వర్ణాలవారికి ప్రాతినిధ్యం కల్పించబడింది. కాకతీయులు ప్రాథమికంగా శైవమతాన్ని అవలంబించినా, ఇతర మతాలను కూడా ఆదరించారు. వీరి కాలంలో జైనం, బౌద్ధం, శాక్తేయం, వైష్ణవం తమ తమ అస్తిత్వాన్ని నిలుపుకొన్నాయి.
గణపతిదేవుని కాలంలో వేయించిన చిట్యాల శాసనం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. శ.సం.1175 = క్రీ.శ.1253 ప్రమాది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి (హరదివస అని పేర్కొనబడింది) శౌరిదిన = శనివారం నాడు వేయించబడిన ఈ శాసనం నల్లగొండ జిల్లా మండల కేంద్రమైన చిట్యాల గ్రామం వెలుపల ఒక శిథిల మండప స్తంభంపై ఉంది. సంస్కృతం, తెలుగు భాషల్లో ఉన్న ఈ శాసనం తెలుగు కన్నడ లిపిలో చెక్కబడింది.
– భిన్నూరి మనోహరి