“కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది.. కుటుంబంలో ఒక్కరికి వచ్చినా.. వారిని గుర్తించేలోపే కుటుంబ సభ్యులందరికీ దాదాపుగా వస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలి.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ కూడా రోడ్డు మీదకు రావద్దు”.. ఇటీవల రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పిన మాటలివి. నగర ప్రజలు మాత్రం ఇంతటి అమూల్యమైన మాటలను విస్మరిస్తున్నారనేందుకు పీసీబీ తాజాగా విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక స్పష్టం చేస్తుంది. నగరంలో ఈ నెల 16 వరకు పీసీబీ వాయుకాలుష్య తీవ్రతను, ఏఏ కారణాలతో ఎక్కువగా వాయుకాలుష్యం వస్తుందనే అంశాలపై సుమారు ఆరు స్టేషన్ల ద్వారా నమోదు చేసింది. ఇందులో ఒక్క పాశమైలారం, బొల్లారం మినహా మిగిలిన నాలుగు స్టేషన్లలో వాహన రద్దీ/వాహనాల నుంచే అత్యధిక కాలుష్యం వెలువడినట్లు పీసీబీ తన నివేదికలో పేర్కొంది. కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తుండటంతోనే ఈ వాయు కాలుష్యం పెరుగుతున్నదని.. దీని ద్వారా కరోనా వైరస్ మనుషుల ముక్కు రంధ్రాల ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని.. ఇది చాలా ప్రమాదకరమని అధికారులు పేర్కొన్నారు.
నగరంలో కాలుష్యం నమోదు కేంద్రాలు సుమారు ఆరు ఉన్నాయి. వీటిని హెచ్సీయూ, సనత్నగర్, జూపార్కు, పాశమైలారం, బొల్లారం, ఇక్రిశాట్ ప్రాంతాల్లో పీసీబీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే పీసీబీ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఒక్క పాశమైలారం ప్రాంతంలో మాత్రం పరిశ్రమల నుంచి ఎక్కువగా కాలుష్యం వెలువడుతున్నట్లు నివేదికలో పేర్కొనగా, బొల్లారంలో మాత్రం ఘాటు వాసనలతో కూడిన దుర్వాసనలు వెలువడుతున్నట్లు పీసీబీ జాబితాలో పేర్కొన్నారు. మిగిలిన నాలుగు (హెచ్సీయూ, సనత్నగర్, జూపార్కు, ఇక్రిశాట్) ప్రాంతాల్లోని కేంద్రాల పరిధిలో ఎక్కువగా వాహనాలు/వాహనాల రద్దీతోనే వాయుకాలుష్యం పెరుగుతున్నట్లు పీసీబీ జారీ చేసిన నివేదికలో పేర్కొన్నారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు ఐటీ, ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు ఇప్పటికే వర్క్ఫ్రం హోం ఇచ్చారు. సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలతో పాటు ఎంఎన్సీ కంపెనీలు కూ డా కార్మికులకు షిఫ్ట్ల ప్రకారం విధులు అప్పగించారు. ఈ క్రమంలో నగరంలో ప్రస్తుతం వాహనాల రద్దీతో పాటు వాహన కాలుష్యం తగ్గాలి. అయితే.. వాహన రద్దీతో పాటు వాహన కాలుష్యం క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ మధ్య కళాశాలలు లేని కారణం గా అవసరం ఉన్నా.. లేకున్నా.. యువత స్నేహితులతో కలిసి సరదాగా రోడ్లపై తిరిగేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని, ఈ క్రమంలోనే నగరంలో ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగా యువ త వాహనాలే రోడ్లపై చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ వాహనాలతో వాయు కాలుష్యం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.