మరుగున పడిన మన తెలంగాణ చరిత్రపుటల్ని వెలికితీస్తే ఎన్నో అద్భుత విషయాలు దర్శనమిస్తున్నాయి. ఇందులో చెప్పుకోదగినది బుద్ధుని కాలంలోనే తెలంగాణలో బౌద్ధం ప్రవేశించిందని. అంతేకాదు తెలంగాణ కేంద్రంగా ఆచార్య బావరి నేతృత్వంలో దక్షిణ భారతాన బౌద్ధం వ్యాపించిందని. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉత్తర భారతాన బుద్ధుడు నిరంతరం తిరుగుతూ తన బోధనలతో బౌద్ధాన్ని వ్యాపింపజేస్తే దక్షిణ భారతాన ఆచార్య బావరి, ఆయన శిష్యులు బౌద్ధాన్ని వ్యాపింపజేశారు.
ఆచార్య బావరి ఉత్తర భారతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు. జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆయన వివిధ ప్రదేశాలు సంచరిస్తూ చివరికు తెలంగాణను తన స్థిర నివాసంగా మార్చుకొన్నారు. అయితే ఒకరోజు దూరప్రాంతం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణుడు బావరిని సందర్శించి తనకు ఐదువందల నాణేలు దానమివ్వమని కోరాడట. అయితే తన వద్ద అంత ధనం లేకపోవడంతో తన నిస్సహాయతను తెలియజేశాడట. దానితో కోపోద్రిక్తుడైన బ్రాహ్మణుడు బావరి తల ముక్కలవుగాక అని శపించాడట. దీంతో కలత చెందిన బావరికి భోతి అనే దేవత కనబడి స్వార్థ పరుడైన బ్రాహ్మణుడి శాపాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదని ఓదార్చి, సంశయ నివృత్తి కోసం బుద్ధుడి బోధనలను తెలుసుకొమ్మని కోరిందట. అయితే వృద్ధాప్యంలో ఉన్నందువల్ల ఆచార్య బావరి బుద్ధుని బోధనలను తెలుసుకొని రమ్మని తన పదహారు మంది శిష్యులను పంపించాడట.
ఆచార్యుని ఆజ్ఞ మేరకు ఆ శిష్యులు బుద్ధుని కోసం, మహారాష్ట్రలోని పైఠాన్, మధ్యప్రదేశ్లోని మహిష్మతి, ఉజ్జయిని, గోనాద్ధ, విదిష, ఉత్తరప్రదేశ్లోని కోశంబి, అయోధ్య, శ్రావతి, సేతయేవ, కపిలవస్తు, కుశీనగర్, పావపురి, వైశాలి, పాట్నాలను సందర్శించి, చివరికి బుద్ధుడు రాజగృహలో (బీహార్లోని రాజ్గీర్) ఉన్నాడని తెలుసుకొని, ఆయనను కలిసి తమ సందేహాలను నివృత్తి చేసుకొన్నారు.
ఆ పదహారు మంది శిష్యులే అజిత, తిస్సమెత్తయ్య, పున్నకుడు, మెత్తగు, ధోతకుడు, ఉపాసి, నందుడు, హేమకుడు, తోదెయ్య, కప్ప, జాతుకన్ని, భద్రావుదుడు, ఉదయుడు, పోసాలుడు, మేఘరాజ, పింగయుడు. అయితే వారిలో 15 మంది బుద్ధుడితోనే ఉండిపోగా శిష్యుడు పింగయ మాత్రం బుద్ధుడి సందేశాన్ని ఆచార్య బావరికి తెలియజేయడం కోసం తెలంగాణకు తిరిగివస్తాడు.
శిష్యుడి ద్వారా బుద్ధ సందేశాన్ని తెలిసికొని బౌద్ధుడిగా మారిన బావరి ఆ సందేశాన్ని నలు చెరుగులా తన శిష్యుల ద్వారా వ్యాపింపజేస్తాడు. బావరి ఉదంతం బౌద్ధ సాహిత్యంలోని సుత్తనిపాతం పారాయణ వగ్గలో చెప్పబడింది. అంతేకాదు సుత్తనిపాతం ప్రకారం బావరి తెలంగాణలోని గోదావరి నది ప్రాంతం లోని కపిత్తవనంలో ఉండేవాడని తెలుస్తున్నది. ఈ విషయం తెలియడంతో బావరి నివాసం కోసం చరిత్రకారులు పరిశోధనలు చేశారు.
మొట్టమొదట 1990లో ఠాకూర్ రాజా రాంసింగ్ పరిశోధన ప్రారంభించి నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తిని ఆచార్య బావరి నివాసంగా గుర్తించారు. డాక్టర్ మలయశ్రీ 2001లో ఈ ప్రదేశాన్ని సందర్శించి బాదనకుర్తియే బావరి నివాస స్థలమని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పురావస్తు శాఖాధికారులు బాదనకుర్తిలో ప్రాథమిక సర్వే జరిపినా సరైన ఆధారాలు లభించలేదని తెలుస్తున్నది. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఎం.ఏ.శ్రీనివాసన్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశోధించాడు. అయితే ఆయనకు కూడా చెప్పుకోదగిన ఆధారాలేవీ లభించలేదని తెలుస్తున్నది. దీంతో ఆచార్య బావరి నివాసం కోసం మళ్ళీ పరిశోధన ప్రారంభమయింది. ఈసారి చరిత్రకారుల దృష్టి బాదనకుర్తికి సమీపంలోని బావాపూర్ కుర్రుపై పడింది.
ఆచార్య బావరి నివాసం కోసం బావాపూర్ కుర్రు ప్రాంతంలో జరిగిన పరిశోధనల్లో చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, డి.సంతోష్, కుర్రా జితేంద్ర బాబు, జైకిషన్, ప్రొఫెసర్ శ్రీకాంత్ మన్వీర్, మొదలయిన వారు విశేష కృషి చేశారు. అయితే బావాపూర్ కుర్రు బావరి నివాసమని నిర్ధారించేందుకు ఈ ప్రాంతంలో మరింత పరిశోధన జరుపాల్సిన అవసరమున్నది.
వీటితోపాటే బావరి నివాసం గురించి మరొక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బౌద్ధసాహిత్య సుత్తనిపాతంలో బావరి గోదావరి ప్రాంతంలోని కపిత్తవనంలో ఉండేవాడని తెలుస్తున్నది.
సంస్కృత భాషలో కపిత్త వనమంటే తెలుగుభాషలో వెలగచెట్ల వనమని అర్థం. దీనివల్ల బావరి నివాసం వెలగచెట్ల వనంగా తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాలోని గోదావరి, పెద్దవాగు (వెల్గావతి నది) మధ్యనున్న మండల కేంద్రమైన వెల్గటూరు బావరి నివాసం కావచ్చని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వారు ప్రచురించిన kotilingala (A report on excavations 1979-83) పేజీ 9లో చెప్పబడింది.
ఊహాజనితమైనప్పటికీ ఇది కూడా ఆలోచించాల్సిన కోణమే.ఏదేమైనా దక్షిణ భారతాన, బౌద్ధం, బుద్ధుని కాలంలోనే వ్యాప్తి చెం దిందని, అందుకు కారణం ఆచార్య బావరి, ఆయన శిష్యులేనని, అంతేకాదు బావరి నివా సం తెలంగాణ ప్రాంతమన్నది తిరుగులేని చారిత్రక సత్యం.
ఉత్సాహంతో పరిశోధన లు సాగిస్తున్న మన తెలంగా ణ చరిత్ర పరిశోధకులకు, ప్రభుత్వం మరింత సహకా రం అందిస్తే మన నేల చరిత్ర పొరల్లోని మరెన్నో అద్భుత విషయాలు ఆవిష్కరించబడతాయి. మన తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించేందుకు ఈ ఆవిష్కరణల అవసరం ఎంతైనా ఉన్నది.
ఆచార్య బావరి నివాసం కోసం బావాపూర్ కుర్రు ప్రాంతంలో జరిగిన పరిశోధనల్లో చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, డి.సంతోష్, కుర్రా జితేంద్ర బాబు, జైకిషన్, ప్రొఫెసర్ శ్రీకాంత్ మన్వీర్, మొదలైన వారు విశేష కృషిచేశారు. అయితే బావాపూర్ కుర్రు బావరి నివాసమని నిర్ధారించేందుకు ఈ ప్రాంతంలో మరింత పరిశోధన జరపాల్సిన అవసరం ఉన్నది.