Tokenisation for Credit Cards | వివిధ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డు హోల్డర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. జూలై ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ మర్చంట్లు తమ కస్టమర్ల క్రెడిట్/ డెబిట్ కార్డు డేటాను స్టోర్ చేయడానికి వీల్లేదు. బ్యాంకుల ఖాతాదారుల సొమ్ము పట్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ గతేడాది ఆర్బీఐ టోకెనైజేషన్ రూల్స్ రూపొందించింది. ఈ రూల్స్ ప్రకారం మర్చంట్లు తమ సర్వర్లలో కస్టమర్ల కార్డు డేటా స్టోర్ చేయడం నిషేధం. దీని ప్రకారం దేశీయంగా ఆన్లైన్లో జరిపే కొనుగోళ్లకు సంబంధిత క్రెడిట్/ డెబిట్ కార్డు దారులు కార్డ్ ఆన్ ఫైల్ టోకెన్స్ పొందడం తప్పనిసరి. వాస్తవంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచే టోకెనైజేషన్ విధానం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ, వివిధ వాటాదారుల అభ్యర్థన మేరకు దేశవ్యాప్తంగా టోకెనైజేషన్ ప్రక్రియ అమలును జూలై ఒకటో తేదీకి వాయిదా వేసింది.
క్రెడిట్ లేదా డెబిట్ కార్డు దారులు ఆన్లైన్లో సురక్షిత లావాదేవీలు జరుపడానికి ఎన్క్రిప్టెడ్ టోకెన్ సాయ పడుతుంది. కార్డు దారుల మర్చంట్ల వద్ద గల డేటా స్టోర్లో ఈ ఎన్క్రిప్టెడ్ టోకెన్ నిల్వ చేసుకోవచ్చు. ఈ టోకెన్ల సాయంతో కస్టమర్ తన పూర్తి వివరాలు వెల్లడించకుండానే చెల్లింపులు చేయొచ్చు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఒరిజినల్ డెబిట్/ క్రెడిట్ కార్డు దారుల డేటాకు బదులు సంబంధిత మర్చంట్ల వద్ద ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్ మాత్రమే ఉంటుంది.
కనుక ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి తమ రికార్డుల నుంచి కస్టమర్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల డేటా తొలగించాల్సి ఉంటుంది. అయితే టోకెనైజేషన్ వ్యవస్థ తప్పనిసరి కాదు. కస్టమర్ టోకెనైజేషన్కు ఆమోదం తెలుపకపోతే.. ఆన్లైన్ లావాదేవీలు జరిపిన ప్రతిసారీ పేరు, కార్డు నంబర్, కార్డు వాలిడిటీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
టోకెనైజేషన్కు అంగీకరించిన కస్టమర్లు ఆన్లైన్లో కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (సీవీవీ) లేదా వన్టైం పాస్వర్డ్ (ఓటీపీ) నమోదు చేయాలి. టోకెనైజేషన్ వ్యవస్థ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తాయి బ్యాంకులు. సజావుగా చెల్లింపులు జరుపడానికి టోకెనైజేషన్ వ్యవస్థ ఉపకరిస్తుంది. టోకెనైజేషన్ వ్యవస్థ కేవలం దేశీయంగా జరిగే ఆన్లైన్ చెల్లింపులకు మాత్రమే వర్తింపజేస్తారు.
అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) ద్వారా సంబంధిత ఖాతాదారు తన బ్యాంకుకు టోకెనైజేషన్ కోసం రిజిరిస్ట్రేషన్ చేసుకోవాలి.