హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): విమాన విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ.. హైదరాబాద్లో ఓ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. దాదాపు రూ.113 కోట్ల పెట్టుబడితో ఈ ఉత్పాదక కేంద్రాన్ని ఈ హైదరాబాదీ కంపెనీ అందుబాటులోకి తెస్తున్నది. ఆదిభట్లలో ఈ యూనిట్ను రఘు వంశీ నెలకొల్పుతుండగా, అంతర్జాతీయ విమాన తయారీ దిగ్గజం బోయింగ్తో తాజాగా కుదుర్చుకున్న విడిభాగాల తయారీ-సరఫరా ఒప్పందం కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తున్నది. దేశీయ ఏరోస్పేస్-డిఫెన్స్ రంగంలో ప్రధాన ఎగుమతిదారుల్లో ఒకటైన రఘు వంశీకి ఇప్పటికే హైదరాబాద్లో 4 తయారీ కేంద్రాలున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు, ఖచ్చితమైన డెలివరీలతో గడిచిన ఐదేండ్లుగా 25 శాతానికిపైగా వృద్ధితో దూసుకుపోతున్న ఈ కంపెనీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు వచ్చాయి.
ఏవేవి తయారీ
అంతర్జాతీయ జాయింట్ వెంచర్లనూ నిర్వహిస్తున్న సంస్థ.. వాణిజ్య విమానాల్లో వినియోగించే అత్యంత కీలకమైన భాగాలను తయారు చేస్తున్నది. దేశ-విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్లకు రక్షణ, స్పేస్ సిస్టమ్స్ విడిభాగాలనూ అందిస్తున్నది. సీఎన్సీ, షీట్ మెటల్ ఫ్యాబ్రికేషన్, కంపోజిట్స్, ఫాస్టెనర్స్, గేర్లు, ఇంజినీరింగ్ సర్వీసుల్లోనూ బలపడుతున్నది.
ఏయే సంస్థలకు సరఫరా
రఘు వంశీ విడిభాగాలను సరఫరా చేస్తున్న సంస్థల్లో ప్రపంచ శ్రేణి కంపెనీలున్నాయి. రోల్స్ రాయిస్, జీఈ ఏవియేషన్, హనీవెల్, కొల్లిన్స్ ఏరోస్పేస్, ఈటన్, హల్లీబర్టన్, డీఆర్డీవో, బీడీఎల్, హెచ్ఏఎల్ తదితర సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలున్నాయి. ఇస్రోకు సైతం సరఫరా చేస్తుండగా, గత 15 ఏండ్లకుపైగా ఈ రంగంలో రఘు వంశీ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
300 ఉద్యోగావకాశాలు
వచ్చే మూడేండ్లకుపైగా కాలంలో 300 మందికి ఈ కొత్త యూనిట్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు రఘు వంశీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇక్కడున్న ప్రతిభ, నైపుణ్యం కలిగిన ఉద్యోగులతో తెలంగాణలో ఎరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నది. ఇటీవలే హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థతోనూ బోయింగ్.. సూపర్ క్రిటికల్ రొటేటింగ్ విడిభాగాల తయారీ, సరఫరా ఒప్పందాన్ని చేసుకున్నది తెలిసిందే.
‘బోయింగ్తో ఒప్పందం మా సంస్థకే కాదు.. తెలంగాణకే గొప్ప మైలురాయి. మా ఉత్పత్తుల నాణ్యత, నిబద్ధతలకు ఇదో నిదర్శనం. రాష్ట్రంలో ఏరోస్పేస్-డిఫెన్స్ ఎకో సిస్టం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. ఎయిరోస్పేస్ మార్కెట్లో దేశానికీ గుర్తింపు దక్కేలా కృషిచేస్తున్నాం’ -వంశీ వికాస్ గణేసుల, రఘు వంశీ ఎండీ
‘ఆత్మనిర్భర్ భారత్ విజన్కు బోయింగ్ కట్టుబడి ఉన్నది. రఘు వంశీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందం ఇందులో ప్రధానమైనది. దేశంలో బోయింగ్కు ఏడు దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్నది. స్థానికంగా తయారయ్యే ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తులకు మా వంతు మద్దతు మేమిస్తాం’ -అశ్వనీ భార్గవ, బోయింగ్ ఇండియా సరఫరా నిర్వహణ డైరెక్టర్