నల్లనయ్య వెన్న దొంగే కాదు కన్నె మనసుల దొంగ కూడా. గోపాలుడి బాల్య జీవితాన్ని పరికిస్తే చుట్టూ ఆడవాళ్లే కనిపిస్తారు. ఆయనెప్పుడూ గోపికాలోలుడిలానే అనిపిస్తాడు. అయితే ఆయన జీవితంలో గోపికలే కాకుండా మరో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వారు కూడా తమ తమ పాత్రలను మరచి కృష్ణభక్తులుగా మారారు. నల్లనయ్య ఆరాధనలో అమరత్వం పొందారు. వాళ్లలో ఒకరు కన్నయ్యను పెంచిన యశోదమ్మ అయితే, మరొకరు ఆయన్ను చంపడానికి వచ్చిన పూతన. వీరిద్దరి కృష్ణానుబంధం అమోఘం.
యశోద కృష్ణుడుఅల్లరి కన్నయ్య అంటే అందరికీ ప్రేమే. గోకులమంతా ఆయన ప్రేమికులే. ఇక తల్లి యశోదకు అయితే ఆయనంటే వల్లమాలిన అనురాగం. చిన్నికృష్ణుడు ఎంత అల్లరి చేసినా, ఊరూవాడా గోపయ్య మీద ఎన్ని చాడీలు చెప్పినా కొడుకును వెనకేసుకురావడమే ఆమెకు తెలుసు. ‘చూడండి… నా చిన్ని తండ్రి నా ఒళ్లోనే ఉంటే మీ ఇంటికొచ్చాడని నిందలు వేస్తారేమ్మా..?’ అంటూ ఎదురు ప్రశ్నించేది మాయా కృష్ణుడి లీలా విలాసం తెలియని బోళా యశోద. తల్లి దగ్గర ఉన్న కన్నయ్యను చూసి ముక్కున వేలేసుకునే గోపికల మీద చిలిపి నవ్వులు రువ్వేవాడు వెన్నదొంగ. అయినా సరే… ఆ అమ్మకు మాత్రమే కాదు, గోకులంలోని ఆడవాళ్లకూ, మగవాళ్లకూ, పిల్లలకూ, ఆఖరికి ఆవులకు కూడా కృష్ణుడంటే బోలెడంత ఇష్టం. కాదు కాదు ప్రేమ. ఆయన ప్రేమలో గోకులమంతా మునిగితేలేది.
ఎందుకంటే ఆయనతో కలిసి రోజంతా ఉండగలిగిన మార్గం అదొక్కటే. ప్రేమ, భక్తి మార్గంలోనే వాళ్లు కృష్ణుడి సాన్నిహిత్యాన్ని పొందగలరు. అందుకే వాళ్లంతా గోవిందుడి భక్తులు అయ్యారు. ఇక పసిబిడ్డగా ఉన్నప్పుడు యశోదమ్మ ధ్యాసంతా తన ముద్దుల కృష్ణుడి మీదే. ఏ పనిచేస్తున్నా, ఎక్కడికి వెళ్లినా ఆమె మనసంతా అచ్యుతుడి మీదే. బిడ్డ మీద ఆమె ప్రేమ అజరామరం. అంత ప్రేమమూర్తి కాబట్టే ఉన్నచోటనే ఆమెకు సమస్త విశ్వాన్నీ చూపించి జన్మ తరింపజేశాడు శ్రీకృష్ణుడు. అయితే కృష్ణుడు పెద్దయ్యేకొద్దీ మాతృప్రేమ స్థానంలో ఆమెలోనూ భక్తి భావన ప్రవేశించింది. ఏదైనా భావన మనల్ని అమితంగా ముంచెత్తితే, ఆ విషయంతో మనం గాఢమైన ప్రేమలో పడితే… అప్పుడది కొన్ని పరిమితులను అధిగమించి, భక్తిగా మారుతుంది. యశోద విషయంలోనూ ఇదే జరిగింది. అపరిమితమైన ప్రేమ ఆమెను కృష్ణ భక్తురాలిని చేసింది. అందుకే బృందావనాన్ని విడిచి వెళ్లిన తర్వాత, కృష్ణుడు తిరిగి రాకపోయినా ఆమె నిరంతరం ఆయనతో కలిసి ఉన్నట్టే భావించింది. అలాగే జీవించింది.
పూతన జన్మ పరిపూర్ణం
కృష్ణుడు పుట్టినప్పుడు, ఆ నెలలో పుట్టిన పిల్లలందరినీ చంపమని కంసుడు రాక్షసి పూతనను పంపుతాడు. ఆమె నిర్దాక్షిణ్యంగా ఎందరో పసిపిల్లలను చంపుతూ వెళ్లింది. కృష్ణుడిని కనిపెట్టిన తరువాత, తనకున్న మాయా శక్తులతో ఆకర్షణీయమైన స్త్రీగా తన రూపం మార్చుకుంది. రాచఠీవితో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. పిల్లాడిని ఎత్తుకుంటానని ఇంట్లోవాళ్లను అడిగింది. పిల్లాడిని ఎత్తుకుని బయటికి వచ్చి కూర్చుంది. కృష్ణుడికి పాలు పట్టడానికి ప్రయత్నించింది. ఆ రోజుల్లో పిల్లలకు ఏ మాతృమూర్తి అయినా పాలు పట్టవచ్చు. అది చంటిబిడ్డకు ఇస్తున్న ఒక గొప్ప అర్పణగా భావించేవాళ్లు. అందుకే పూతన తన రొమ్ములకు విషాన్ని రాసి ఉంచి, పిల్లాడికి పాలిస్తున్నట్లు నటించింది. అలా విషపు రొమ్ములతో కృష్ణుణ్ని చంపడానికి వచ్చింది. కానీ తను కృష్ణుణ్ని చూసినప్పుడు, ఆ నీలిమాయలో పడిపోతుంది. ఉన్నట్టుండి ఆమెలోని మాతృత్వం పెల్లుబుకుతుంది. తనకు తాను ఆ బిడ్డకు అంకితం చేసుకోవాలనిఅనుకుంటుంది. అందుకే ‘నేను కంసుడి ఆదేశం మేరకు నిన్ను చంపడానికి వచ్చాను. నా రొమ్ములకు విషం ఉంది. కానీ నువ్వు నా పాలను మాత్రమే కాక, నా ప్రాణాన్ని కూడా తీసుకోవాలని నా హృదయం కోరుకుంటున్నది. నీకు పాలివ్వగలగడం నా భాగ్యం’ అని మనసులో అనుకుంటుంది. కానీ, విషం పూసిన రొమ్ముతో, ఆమె పిల్లాడికి పాలిచ్చింది. కృష్ణుడు ఆమెలోంచి జీవాన్ని బయటికి లాగేశాడు.
ఆమె అక్కడికక్కడే ముఖంపై ఒక చిరు నవ్వుతో కిందపడి చనిపోయింది. ఆమె మనుసులో ఆఖరి ఆలోచన ఏంటంటే,
‘నా ప్రాణం ఆ పరమాత్మే తీశాడు. నాకు ఇంతకంటే ఏం కావాలి?’ అన్నదే.
-ప్రేమాశీస్సులతో.. సద్గురు