మహిళ జీవితంలో ఓ భాగం.. రుతుక్రమం. కానీ, సమయానికి శానిటరీ ప్యాడ్స్ మాత్రం అందుబాటులోఉండవు. ఉన్నా కృత్రిమమైనవే, అనారోగ్యాన్ని, రక్తహీనతను పెంచేవే. ఆ పరిమితిని అధిగమిస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకునేందుకు అనువైన శానిటరీ ప్యాడ్స్ను తయారు చేస్తున్నది సాత్విక్కి అనే ఎన్జీవో. ఐదుగురు మహిళలతో మొదలైన ఆ రుతు చైతన్య ఉద్యమం గురించి..
ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు..నలుగురు.. ఐదుగురు. పది చేతులు కలిశాయి. పట్టుదలతో పనిచేశాయి. ఒకానొక తీవ్ర సమస్యకు పరిష్కారం కొనుగొన్నాయి. మూడేండ్ల క్రితం మొదలైన ఓ మహాద్భుతానికి ఇది పరిచయ వాక్యం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లిలో ఐదుగురు మహిళలు కలిసి.. సాత్విక్కి అనే ఎన్జీవోను ప్రారంభించారు. మొదట్లో పెటికోట్లు, చిన్నచిన్న బ్యాగులు కుట్టేవారు. మహిళలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే సంకల్పంతో.. శానిటరీ ప్యాడ్స్ తయారీకి పూనుకొన్నారు. రుతుస్రావ సమయంలో చాలామందికి శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉండవు. మరోదారి తెలియక ఏ పాత గుడ్డలనో ఉపయోగిస్తారు. ఇలాంటి పద్ధతులు అనారోగ్యకరం. ప్రాణాంతకమూ కావచ్చు. ఈ సమస్యను ఎలాగైనా అధిగమించాలని భావించింది సాత్విక్కి సంస్థ. ఐదుగురు సభ్యులూ ఓ చోట కూర్చుని వాషబుల్ శానిటరీ ప్యాడ్ డిజైన్ చేశారు. ఆ నమూనాలో కొన్ని ప్యాడ్స్ తయారు చేశారు. మొదట ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉచితంగా పంచారు. వాటి నాణ్యత పట్ల ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేయడంతో.. పూర్తిస్థాయి ఉత్పత్తికి పూనుకొన్నారు. మార్కెట్లో దొరికే ప్యాడ్స్లా కాకుండా ఇవి రంగురంగుల్లో ఉంటాయి. ముడి వస్ర్తాన్ని పుణె, జైపూర్ నుంచి తెప్పిస్తారు. లోపల మాత్రం తెల్లగుడ్డ అమర్చుతారు. వీటికి ఆరు నుంచి తొమ్మిది పొరలు ఉంటాయి. సౌకర్యం కోసం మధ్యలో బటన్ పెట్టారు. వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి.
వాడకం సులభం..
సాత్విక్కి శానిటరీ ప్యాడ్స్ను ఉపయోగించడం సులభం. వాడే ముందు ఒకసారి ఉతకాల్సి ఉంటుంది. రెండు మూడు ఉతుకుల తర్వాత ఇవి మరింత సమర్థంగా పనిచేస్తాయి. చల్లని నీటిలో నానబెట్టి తేలికగా ఉతుక్కోవచ్చు. మామూలు సబ్బుతోనూ శుభ్రం చేసుకోవచ్చు. బ్రష్ వాడకపోతే సరిపోతుంది. బాగా ఎండాక మడతపెట్టుకోవచ్చు. విద్యార్థినులు, ఉద్యోగినులు బయటికి వెళ్లినప్పుడు వాడేసిన ప్యాడ్లను చిన్న బ్యాగ్లో పెట్టుకోవచ్చు. శానిటరీ ప్యాడ్స్కు ప్రత్యేకంగా ఓ కిట్ కూడా ఇస్తున్నారు. కిట్లో మూడు నుంచి ఐదు వరకు ప్యాడ్స్తోపాటు ఒక మాస్క్, రెండు డ్రై ఫ్రూట్ లడ్డూలు, ఒక సబ్బు ఉంటాయి. మూడు నుంచి ఐదు ప్యాడ్స్ ఒక ప్యాక్గా లభిస్తున్నాయి. ప్యాడ్స్ సంఖ్యను బట్టి ధర రూ.310 నుంచి రూ.580 వరకూ ఉంటుంది. ప్రస్తుతం వివిధ జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ‘నేను సాత్విక్కి ఎన్జీవోలో పనిచేస్తున్నా. ఇక్కడే కుట్టుమిషన్ నేర్చుకొని.. ఇక్కడే ఉపాధి పొందుతున్నా. మూడేండ్లుగా మేమంతా ఇవే ప్యాడ్స్ వాడుతున్నాం. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. కలెక్టర్ మేడం కూడా మా ప్రయత్నాన్ని అభినందించారు’ అని
సంతోషంగా చెబుతారు అనిత అనే వర్కర్.
ఆరోగ్యానికి రక్ష..
మార్కెట్లో దొరికే ప్యాడ్స్తో పోలిస్తే వాషబుల్ ప్యాడ్స్ ఎంతో సురక్షితమైనవి. బయటి ప్యాడ్లో పలురకాల రసాయనాలు ఉపయోగిస్తారు. దీనివల్ల బ్లీడింగ్ సమయంలో అవసరానికి మించి రక్తాన్ని గుంజుతాయి. ఫలితంగా, మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. ఒంటి మీద దద్దుర్లు వచ్చే ఆస్కారం ఉంది. నల్లమచ్చలు ఏర్పడవచ్చు. అన్నిటికీ మించి, ఒకసారి ఉపయోగించాక చెత్తబుట్టలో పడేయాల్సిందే. ధరలు కూడా ఎక్కువే. వాషబుల్ ప్యాడ్స్తో ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. ఒక్కో ప్యాడ్ను సుమారు మూడేండ్లు వాడుకోవచ్చు. వందసార్లు ఉతుక్కోవచ్చు. ఈ ప్యాడ్స్ పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి. సులభంగా మట్టిలో కలిసిపోతాయి. సాత్విక్కి ఆశయానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన కుట్టుమిషన్లు అందించింది. తమ ఉత్పత్తులను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు. చిన్న పిల్లల కోసం త్వరలోనే వాషబుల్ డైపర్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది సాత్విక్కి.
మూడేండ్లు గ్యారెంటీ
మహిళలు ఇప్పటికీ ప్యాడ్స్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆ కష్టాన్ని అధిగమించాలనే వాషబుల్ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్నాం. దీనివల్ల మనిషికైనా, ప్రకృతికైనా ఎలాంటి చెడూ జరగదు. ధర కూడా తక్కువే. కిట్లో ప్యాడ్స్తోపాటు రెండు లడ్డూలు, మాస్క్, సబ్బు అందిస్తున్నాం. ఒక్కసారి కొంటే మూడేండ్లు వాడుకోవచ్చు.
-కె.జ్యోతి, సాత్విక్కి ప్రతినిధి
-పున్న శ్రీకాంత్
-గుజ్జ నరేశ్