సెక్స్ గురించి పిల్లలకు ఎలా చెప్పాలి? తల్లిపాలు ఏ వయసు వరకు ఇవ్వాలి? లైంగిక వేధింపులను బయటికి చెప్పుకోవాలా? లోలోపలే కుమిలిపోవాలా?.. ఇలా అనేకానేక అంశాలపై అవగాహన కల్పిస్తూ లక్షలాదిమంది అభిమానాన్ని చూరగొన్నది స్వాతి జగదీశ్. దేశంలోని అతికొద్దిమంది సెక్స్ ఎడ్యుకేటర్లలో స్వాతి ఒకరు.
కోయంబత్తూరుకు చెందిన స్వాతి జగదీశ్కు సెక్స్ ఎడ్యుకేటర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎన్నో పురస్కారాలు వరించాయి. స్వాతి దీన్నో కెరీర్గా ఎంచుకోవడం వెనుక ఒక కారణం ఉంది. చిన్నప్పటి నుంచీ తనకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంట్లో నిత్యం ప్రాక్టీస్ చేసేది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. వాళ్లముందు నృత్య ప్రదర్శన ఇవ్వమంటూ కన్నవాళ్లు ఒత్తిడి చేసేవారు. కాదనలేని మొహమాటం. తన కూతురు మాయ తరానికి వచ్చేసరికి భావవ్యక్తీకరణలో చాలా మార్పు వచ్చింది. కాదని చెప్పడం అలవాటైంది. ఆ బోళాతనం స్వాతికి నచ్చింది. అందుకే, కూతురి పేరును కూడా జోడిస్తూ.. ‘మాయాస్ అమ్మ’ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించింది. మూడు లక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ పేజీకి.
సెక్స్ ఎడ్యుకేషన్, పేరెంటింగ్పై అధ్యయనంమొదలుపెట్టింది. లాక్టేషన్లో ఆన్లైన్ కోర్సు చేసి, ఓ హాస్పిటల్లో తల్లిపాల కౌన్సెలర్గా చేరింది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సెమినార్లు నిర్వహించింది. రొమ్ము క్యాన్సర్పై అవగాహన సదస్సులు జరిపింది. సెక్స్ ఎడ్యుకేషన్లో కూడా సర్టిఫికెట్ కోర్స్ పూర్తిచేసింది. ‘మాయాస్ అమ్మ’ ద్వారా మహిళలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని చర్చిస్తున్నది. పిల్లలకు కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమని అంటున్నది స్వాతి. సెక్స్ అంటే చెడుపదం కాదనీ, పిల్లలకు 12 ఏండ్ల వయసు నుంచే లింగభేదం గురించి, శరీరంలో వచ్చే మార్పుల గురించి అవగాహన అవసరమని వివరిస్తున్నది.