నారద ఉవాచ- ధర్మరాజా! పరమాత్మ పట్ల పగ పూనిన వారికి- రజస్తమో గుణాలచే దూషితమైన అంతఃకరణం కలిగిన అసురులకు- దైత్య, దానవులకు త్వరితగతిన తగిలే శగ- తన్మయత్వం, తాదాత్మ్యం భక్తి వలన అంత వేగంగా చేకూరదన్నది జగమెరిగిన సత్యం. అయినా మత్తేభం (మదించిన ఏనుగు)తో తలపడాలంటే మరో మత్త గజేంద్రమే కావాలి లేదా మృగేంద్ర (సింహం)మైనా రావాలి. అంతేకాని, మశకాలు (దోమలు) వచ్చి ఏం చేస్తాయి? మాధవుని ఎదిరించిన మహాబలశాలురు, మహామాయావులు అయిన అసురులే మట్టి కరిచారు. వారిలో ఎందరో కారణజన్ములు. పాపమూలంగా శాపాలు పొందినవారు. అచ్యుతునితో వారు పెట్టుకొన్న వైరం అకారణం కాదు. పైపెచ్చు అనివార్యం కూడా. కాన, వైరభక్తి లోకానికి ఎన్నటికీ ఆదర్శం కాదు. మాధవుని చేతిలో మరణం పొందినవారు ముక్తిని అందుకున్నారే కాని, అమృత స్వరూపమైన అనన్య భక్తి వలని ఆనందానుభూతి మాత్రం వందల వేల సంఖ్యలో ఉన్న ఒక్క అసురునికి కూడా చెందకుండా పోయింది.
‘యుధిష్ఠిరా! తుమ్మెద ఒక పురుగును తెచ్చి నిర్బంధించి, ఝుంకారం చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ దానిని భయభ్రాంతం చేస్తూ ఉంటుంది. ఆ పురుగు తన ఎద (మది)లో ఆ తుమ్మెదనే తలచి-తలచి భ్రాంతితో తుమ్మెద స్వరూపాన్ని-స్వభావాన్ని సంతరించుకొంటుంది. అలాగే, భూనాథా! భయయోగం వల్ల ఎవ్వరైనా అభయ స్వరూపుడైన శ్రీహరి సారూప్యం (ముక్తి) సాధించుకోవచ్చు. ‘మనుజుడు అన్యభావం- విజాతీయమైన అనాత్మ చింతన లేనివాడై తీవ్ర సంవేగంతో మనస్సుచే దేనిని భావిస్తాడో, అతడు అద్దానియందు తన్మయుడవుతాడు- దానిలాగానే రూపొందుతాడు’ అని ముక్తికోపనిషత్తులో రాజశ్రేష్ఠుడు రామచంద్రుడు కపికుంజరుడైన ఆంజనేయునికి బోధించాడు. మనస్సు లౌకిక విషయాలయందు మగ్నం కాక విష్ణువునందు లగ్నమైతే, వాని జన్మ సంసార బంధనాలు భగ్నం కాకుండా ఉంటాయా? కాన, సర్వకాల సర్వావస్థలలో స్వామి స్మరణమే శరణం!
‘పాండవాగ్రజా! పెచ్చరిల్లిన హృచ్ఛయం- కామ భావం లేక మధుర భక్తి (మీరాబాయి వలె)తో గోపకాంతలు, ప్రాణ భయ యోగంతో కంసుడు, వెనుదీయని విర్రవీగే వైరభావంతో శిశుపాల, దంతవక్త్ర, జరాసంధ, కాలయవన, రుక్మి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపాదులు, బంధుత్వ బంధంతో యదు, వృష్ణి, భోజ, కుకురు, అంధక- అనే ఐదు శాఖలకు చెందిన యాదవులు, ప్రేమ భావంతో పాండుపుత్రులు- పాండవులైన మీరు, అనన్యభక్తి భావంతో మహర్షులు, మునులమైన మేము పద్మనాభుని ప్రేమానురాగాలకు పాత్రులమయ్యాం. కాన, ఏ భావంతో భజించినా ప్రగాఢ-నిష్ఠాపూర్వకమైన ధ్యానమనే సుగుణం ఉంటే చాలు, అట్టి గరిష్ఠుడైన జనుడు జనార్దనుడవుతాడు. అంతటి వరిష్ఠుడైన నరుడు నారాయణుడు అవుతాడు.
భక్తకవి సార్వభౌముడు బమ్మెర వారి భర్మ్య (సువర్ణమయ) గంటం నుంచి జాలువారిన అర్థగాంభీర్యం కలిగిన అపరంజి-బంగారం లాంటిది పైపద్యం. ‘తదర్పితాఖిలా చారః సన్ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయమ్’- (సర్వ వ్యవహారాలను సర్వేశ్వరునికే సమర్పించి కామ, క్రోధ, అభిమానాదులను కూడా ఆ అచ్యుత భగవానుని పట్లనే చూపించాలి) అనే నారద భక్తి సూత్రానికి ఈ శార్దూల వృత్తం భాష్యం వంటిది. మూల శ్లోకాన్ని అనుసరిస్తూనే మెరుగులతో మెరిసిపోతున్న సరసమైన పద్యమిది. గోవిందుని మీది పరమప్రేమకు మారుపేరే గోపికలు. ‘ప్రేమైవ గోపరామాణాం కామ ఇత్యగమత్ ప్రథాం’- గోప భామినుల ఆ దివ్య ప్రేమ భావాన్నే ‘కామం’ అనే నామంతో పిలుచుకోవడం లోకంలో పరిపాటిగా మారింది. ఆ కామం మాత్రం భౌతికం కాదు. కామ-ప్రేమలకు ఆమడ దూరం.
నిజేంద్రియ (తన శరీర) సుఖాభిలాష కామం. అది భోగాసక్తి, త్రిగుణాత్మకం. ‘తత్ సుఖ సుఖిత్వం’- కృష్ణుని సుఖమే మా సుఖం, ఇదీ గోపీభావం! ఇక్కడ దేహ భావం లేదు. ఇది త్రిగుణాతీతం. భోగాసక్తుడు సాధకుడు కాడు, కాలేడు. వాడు బాధకుడే- తన్ను తాను బాధించుకునేవాడు. తోటివారిని వేధించుకు తినేవాడు. భోగవిరక్తుడే సాధకుడు. గోపికలు సర్వభోగ త్యాగం చేసి భగవంతునికి ‘సుఖదానం’ చేసినవారు. ఇదే గోపీ స్వభావం. గోపికలు ప్రేమ పారిజాతాలు. ఆ ఇందు వదనల (సౌందర్యవతుల) ప్రేమ సింధువులో ఒక్క బిందువు లభించినా తమ జన్మ సఫలమవుతుందని మహాజ్ఞానులు పరితపించారు. రాసలీలా శ్రవణానికి మహత్తర ఫలం ‘కామ నివృత్తి’ అని వ్యాస వచనం. గోపికలలోనే కామం ఉంటే శ్రోతలైన భౌతిక జీవులలో ఉన్న కామం ఎలా తొలగుతుంది? కామంతో కృష్ణుని వద్దకు కాలు కదిపితే ఆ కామం ప్రేమగా పరివర్తనం చెందుతుంది. ఇంతటి పరమార్థాన్ని పరిశీలించే పోతనామాత్యుడు మూలంలో కేవలం ‘కామత్’ అని ఉన్నదాన్ని ‘కామోత్కంఠత గోపికల్’ అంటూ ‘ఉత్కంఠత’ అన్న విశిష్ట పదాన్ని చేర్చి అనువదించాడు.
( సశేషం )
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ,98668 36006