మనీషా రామసామి పేదింటి బిడ్డ. నాన్న నడిపే మటన్ దుకాణమే కుటుంబానికి ఆదరువు. కానీ, మనీష లక్ష్యమేమో పెద్దది. దేశ భద్రతలో భాగంగా సోల్జరైనా కావాలి, ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టరైనా కావాలని తీర్మానించుకొన్నది.
తమిళనాడులోని ఎరోడ్కు చెందిన 24 ఏండ్ల మనీషా రామసామి తన కల నెరవేరనందుకు ఏనాడూ కుంగిపోలేదు. పేదరికాన్నీ నిందించలేదు. ధైర్యంతో ముందడుగు వేసింది. ప్రజలకు సేవచేస్తే దేశానికి చేసినట్లే అని భావించింది. సేవారంగాన్ని తన లక్ష్యంగా మార్చుకున్నది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసింది. చదువు పూర్తయిన తర్వాత లెక్చరర్ ఉద్యోగంలో చేరింది. వచ్చిన జీతంలో సగం మాత్రమే ఇంట్లో ఇచ్చేది. మిగిలిన మొత్తాన్ని సేవ కోసం ఖర్చుపెడుతూ వచ్చింది. ఒకరోజు ఫేస్బుక్లో ‘ఫుట్పాత్పై పండుటాకులు’ అనే పోస్ట్ చూసింది. ఓ గుర్తుతెలియని వృద్ధుడు రోడ్డుపై పడున్నాడనేది సారాంశం. మనీష మనసు చలించిపోయింది. వెంటనే తంజావూరు చేరుకున్నది. ఆ వ్యక్తి అప్పటికే కొన ఊపిరితో ఉన్నాడు. చికిత్స చేయించి వృద్ధాశ్రమంలో చేర్పించింది. ఇలాంటివారు ఎంతోమంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? దీంతో, తానే స్వయంగా ‘జీవితం ఫౌండేషన్’ను స్థాపించింది. ఫుట్పాత్లపై, కూడళ్ల దగ్గర ఉన్న అనాథలు, వృద్ధుల ఆకలిని తీరుస్తూ హెల్త్ క్యాంప్లు, రిహాబిలిటేషన్ క్యాంప్లు నిర్వహిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నది. మానసిక వికలాంగులకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది. 2018లో ప్రారంభమైన ‘జీవితం ఫౌండేషన్’ ద్వారా ఇప్పటివరకు సుమారు 340 మందికి పైగా వృద్ధులు, మానసిక రోగులకు కొత్త జీవితాన్ని అందించింది మనీష.