ఏ అమ్మకైనా బిడ్డకు జన్మనివ్వడం, పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకోవడం ఓ మధుర జ్ఞాపకం. కానీ, చాలామంది తల్లులు కొవిడ్ భయం వల్ల ఆ అనుభూతులకు దూరమతున్నారు. నవజాత శిశువులకు కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు తక్కువే. అయినాసరే, ఏడాదిలోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఇంకా పెంపొందుతూ ఉండటంవల్ల, వైరస్ కారణంగా శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం అధికం. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. తల్లితోపాటు కుటుంబ సభ్యులంతా తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి లేదా శానిటైజర్ రాసుకోవాలి.అత్యవసరం అయితే తప్ప, దవాఖానకు వెళ్లొద్దు. చిన్నచిన్న సమస్యలు అయితే, డాక్టర్లను ఆన్లైన్లో సంప్రదించవచ్చు.కుటుంబ సభ్యులు బయటికి వెళ్లొస్తే, స్నానం చేశాకే వారిని పిల్లల దగ్గరకు రానివ్వాలి. కుదిరితే, వాళ్లంతా పిల్లలకు దూరంగా వేరే గదుల్లో ఉండటమే మంచిది.పసిబిడ్డలున్న ఇంట్లో తుమ్మినా, దగ్గినా మూతికి అడ్డంగా టిష్యూ లేదా చేతి రుమాలు పెట్టుకోవాలి. లేదంటే ముఖాన్ని భుజాల్లో పెట్టుకోవాలి.