పాత పాలమూరులోని చిన్న పల్లె. ఆ పల్లెలో పాటల కోయిలై పుట్టింది లావణ్య. అమ్మతో కలిసి కల్లు మండువకు వెళ్లినా, నాన్నకు సద్ది తీసుకొని పొలానికి పోయినా.. ‘ఒడ్డెడు గడ్డిగోసి ఒడ్డుమీద వెట్టీ’ అంటూ సైకిలెక్కి సడాక్ పొంటి పరవళ్లు తొక్కింది ఆమె పాట. అక్కడితో ఆగలేదు. అమెరికా వీధుల్లోనూ ‘బాయిలో బచ్చెలికూరా అంజన్నా’ అంటూ మార్మోగింది. ప్రపంచ వేదికలపై తన ప్రత్యేకతను చాటుతున్న వనపర్తి వజ్రం సురగోని లావణ్య పాట ముచ్చట..
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమెల్ల మా ఊరు. నాయిన లక్ష్మణ్ గౌడ్ తాళ్లెక్కి కల్లు ఒడిస్తే.. అమ్మ సువర్ణమ్మ కల్లు మండువ కాడ అమ్ముతుండేది. అటెన్క నాయిన పొలం కాడికి పోయేటోడు. కల్లు మాములే మా జీవనాధారం. నాయిన బాగోతాలు ఆడేటోడు. తాళ్లెక్కేటప్పుడు, పొలంలో అరకగట్టినప్పుడు కష్టాన్ని మర్చిపోనీకె బాగోతం పాటలు పాడేటోడు. అట్లా చిన్నప్పటి నుంచీ పల్లె పాటలకు దగ్గరైన. అమ్మ బతుకమ్మ పాటలు.. కోలాటం పాటలు పాడుతుండె. ఇంట్లో ఇద్దరూ పాటలతో పరిచయం ఉన్నవాళ్లే కావడంతో నేనూ పాటకు సోపతయిన.
నేను బాగా పాడుతానని తెలిసి, అమ్మ నాకు కొన్ని పాటలు నేర్పింది. అప్పుడు నేను అమ్మమ్మోళ్ల ఊళ్లో చదువుకుంటున్నా. ఒకరోజు స్కూల్లో పాటల పోటీలు జరుగుతున్నయి. అమ్మ నేర్పించిన ‘ఒడ్డెడు గడ్డిగోసి ఒడ్డు మీదావెట్టి.. ఒడ్డూ నీడలు తిరిగె వొసుదేవుడేడే’ పాట పాడిన. లెక్కల సారు సత్యం మాష్టర్ ‘మస్తు పాడినవమ్మా’ అని మెచ్చుకున్నరు. ఆ సారుకు సంగీతం వచ్చేది. ఖాళీ టైంలో నాతోటి దేశభక్తి పాటలు, జానపదాలు పాడిస్తుండె. కల్పలత మేడమైతే ‘నాతో వచ్చెయ్యవే, మంచిగా సంగీతం నేర్పించి సింగర్ని జేస్తా’ అంటుండె. చక్రవర్తి సారు నాకోసమే పాటలు రాస్తుండె. వీళ్ల ముగ్గురితోటే నాకు పాటమీద ఖాయిష్ ఏర్పడింది.
పుట్టినప్పటి నుంచీ పల్లెతోటే సోపతి కాబట్టి, నాకు ఊరంటే ఇష్టం. పచ్చటి పంట పొలాలంటే ఇంకా ఇష్టం. కొంచెం సమయం దొరికినా పొలం కాడికి పోతుండేదాన్ని. సైకిల్కు డబ్బగిన్నె తగిలేసుకొని పాటలు పాడుకుంటూ పొలంకాడికి పొయ్యి, నాయినకు అన్నమిచ్చొస్తుండెదాన్ని. ‘పొలం పనిగూడా నేర్సుకోవాలె బిడ్డా’ అని నాయిన చెప్తుండె. అవకాశం దొరికితే నాట్లేయనీకె ప్రయత్నం చేస్తుండేదాన్ని. ఇగ మా సేన్ల నాట్లేస్తందుకు వచ్చినోళ్లయితే ‘ఓ సువర్ణమ్మా నీ బిడ్డె పాటలు పాడుతది కదా? ఒకట్రెండు పాడుమనరాదురా’ అని నాతోటి పాడిస్తుండె. వాళ్లు పాడినవి నేను నేర్చుకునేదాన్ని. అట్లా పాటకు దగ్గరవుతూ వచ్చిన.
చదువు అయిపోయిన తర్వాత బ్యాంక్లో కొలువొచ్చింది. ఒకసారి బంధం రాజన్న ‘చెల్లె! నువ్వు బాగ పాడుతవంటగారా? ఏది పాడు..’ అని నాతోటి పాడించిండు. నాకో అవకాశం ఇస్తా అన్నడు. నేనేమో బ్యాంక్ల జాబ్ చేస్తున్ననాయె? బాగా ఆలోచించిన. ఏదైతేంది, ఒక మంచి అవకాశమొచ్చింది కదా అనుకున్న. బ్యాంక్ కొలువు వదిలేసి అన్న టీమ్లో చేరిన. రాజన్న బృందంతో కలిసి హైదరాబాద్ వచ్చేసిన. ఊళ్లో పాడినదానికి.. హైదరా
బాద్లో వేదికలపై పాడిన దానికి తేడా అనిపించింది. అందుకే స్టార్టింగ్లో కోరస్, సపోర్టింగ్ సింగర్గా చేసిన. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకూ పాటలు పాడినం. ఒకసారి రవీంద్ర భారతి కళా సంబురంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అది నా ఫస్ట్ షో. ‘కొనగొమ్మలొంగినాయి గోవులేవూసినాయి.. ఆడస్త జానకీ కోడిపందెమూ.. వెళ్లొస్తా జానకీ కోడిపందెమూ’ పాట వినిపించిన. కార్యక్రమానికి ముఖ్య అతిథి సినారెగారు. నేను పాడటం అయినంక వేదికపైకి వచ్చి ‘అద్భుతంగా పాడినవమ్మా. నీకు మంచి ఫ్యూచర్ ఉంది’ అన్నరు.
‘రేలారే రేలా’ ఐదో దరువుకు సెలక్షన్స్ జరుగుతున్నయని తెలిసింది. కొన్ని పాటలు సిద్ధం చేసుకొని ఆడిషన్స్కు వెళ్లిన. సెలక్ట్ కూడా అయిన. ‘అంగులొట్టీ పొంగులొట్టీ సేతీలోనా’ పాటతో పోటీ మొదలువెట్టిన. తర్వాత ‘మోటిమీద దాని ఇల్లూ బీమదారి’, ‘నల్లంచు బొట్ల సీర నేను కట్టనా.. నా నల్లని జడలో పూలవెట్టనా’ వంటి పాటలు పాడిన. రేలారే అనుభవం చాలా ఉపయోగపడింది. గోరెటి సార్, సుద్దాల సార్ నాకు ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. నాకు ఏ సమస్య వచ్చినా.. కష్టమొచ్చినా ఉదయభానక్కనే ఓదార్పునిచ్చింది. ధైర్యాన్నిచ్చింది. ఎట్లా బతకాల్నో తెలియజెప్పింది. ఇప్పటికీ అక్కతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆ కాంపిటీషన్ తర్వాత ‘టీవీ 9 మా పల్లె పాట’, ‘రసమయి దరువు’ లాంటి ప్రోగ్రామ్స్ చేశిన.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో నేను జై ప్రకాశన్న టీమ్లో పనిచేసిన. రసమయన్న, సాయిచందన్న, వరంగల్ శీనన్న టీమ్స్లో కూడా చేసిన. ప్రకాశన్న మమ్ముల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నడు. ఉద్యమ ఫలితంగా రాష్ట్రమొచ్చింది. వస్తూ వస్తూనే మాకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు తీసుకొచ్చింది. 2016లో అమెరికాకు వెళ్లే అవకాశమొచ్చింది. 40 రోజుల పర్యటన అది. 16 రాష్ర్టాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చినం. ఏనుగు లక్ష్మారెడ్డన్న 25 రోజులు వాళ్లింట్లనే మాకు ఆతిథ్యమిచ్చిండ్రు. అమెరికా గడ్డపై తెలంగాణ తీన్మార్ డప్పులు మోగిస్తుంటే నాకు మస్తు అనిపించింది. నా భర్త ఈశ్వర్ నన్ను చానా ప్రోత్సహిస్తడు. పాలమూరు జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన నేను విదేశాలకు వెళ్తననీ.. పాట పాడుతననీ అనుకోలేదు. అమెరికా గడ్డపై కాలుపెట్టంగనే అమ్మకు, నాయినకు ఫోన్ చేసిన. గర్వంగా ఫీలయిండ్రు.
రాజన్నతో కలిసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఈవెంట్స్ చేసేదాన్ని. రవీంద్రభారతి, కడప కళాక్షేత్రం వంటి వేదికల మీద మంచి ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. నా వాయిస్ నచ్చి ‘బాగా పాడుతున్నవ్’ అని ఎంకరేజ్ చేశారు. విజయవాడలో ఒకసారి ప్రోగ్రామ్కు వెళ్లినం. గజ్జెలు కనిపించేట్లు ఎర్రచీర కట్టుకొని పాడిన. ఆ కార్యక్రమానికి దాసరిగారు వచ్చిండ్రు. ‘నువ్వు మరో రాములమ్మలా ఉన్నవమ్మా!’ అన్నరు.
యూట్యూబ్లో ఇప్పటివరకు 30 పాటలు పాడిన. ‘మూతిమీద దాని ఇల్లు.. బొంగురాల బోటి తలుపు.. తమలపాకుల తోరణాలు..’ పాట నాకు పేరు తీసుకొచ్చింది. ‘మర్చిపోయినావో’ కూడా గుర్తింపు తెచ్చింది. ‘వాని ఎదమీద ఉండేటి గమగమా గంధాలు సందామావయ్యలో’, ‘ఒడ్డుమీదా రేడియవెట్టి గడ్డిగోస్తే గమ్మతిరెడ్డి’ పాటలు నన్ను అమెరికాకు తీసుకెళ్లినయి. నాకంటూ ఓ సిగ్నేచర్ ఉండాలని ‘జోర్దార్ లావణ్య మ్యూజిక్ చానెల్’ పెడుతున్నా.
–దాయి శ్రీశైలం