క్యాన్సర్ కనికరం లేనిది. మనుషులను విడదీస్తుంది. ఆందోళనలను పెంచుతుంది. కుటుంబ సభ్యులకూ నరకమే. అతి కఠినమైన క్యాన్సర్ను తరిమేయడంలో.. సుతిమెత్తని సంగీతం సూదిమందు కంటే సమర్థంగా పనిచేయగలదని నిరూపిస్తున్నది కేరళకు చెందిన డాక్టర్ తారా రాజేంద్రన్. డాక్టర్ తారా రాజేంద్రన్ ఆంకాలజిస్ట్. వీణా వాదనలో స్పెషలిస్ట్. క్యాన్సర్ బారిన పడిన ఎంతోమంది ఆమె దగ్గరకు వస్తుంటారు. వ్యాధికన్నా ఆలోచనా విధానమే పెద్ద సమస్య అని అర్థమైంది తారకు. క్యాన్సర్ రోగులను సమాజం చిన్నచూపు చూస్తుంది. కుటుంబ బంధాలు దెబ్బతింటాయి. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. బాధితుల ఆలోచనా విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సంక్షోభ సమయంలో వీణా వాదనతో ఊరటనిస్తుంది తారా రాజేంద్రన్. అందుకే, అంతా ఆమెను ‘ఫిజీషియన్-మ్యుజీషియన్’ అంటారు.
ఆమెకు అప్పుడు ఐదేండ్లు. అమ్మమ్మ క్యాన్సర్ బారినపడింది. తారా రాజేంద్రన్ తల్లిదండ్రులు కూడా సంగీతంపై పట్టు ఉన్నవారే. ఆ వయోధికురాలికి ఒత్తిడి నుంచి విముక్తి కలిగించేందుకు తార తల్లిదండ్రులు కర్ణాటక సంగీతాన్ని వినిపించేవారు. మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు సిద్ధార్థ ముఖర్జీ రాసిన ‘ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలోడీస్- ఎ స్టోరీ ఆఫ్ క్యాన్సర్’ పుస్తకం సంగీత వైద్యం పట్ల ఆమెలో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. తన అనుభవాలను జోడిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీలో తొమ్మిది నెలలు పరిశోధనలు చేసింది తార. ఆందోళనలను ఎదుర్కోవడంలో సంగీతం ఎలా సాయపడుతుందో శాస్త్రీయంగా నిరూపించింది. అమెరికన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఏఎంటీఏ) ద్వారా కూడా క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తున్నది డాక్టర్ తార.