రెండేండ్ల పిల్లలకు ప్రపంచం పోకడ తెలియదు. ఆకలేస్తే ఏడుస్తారు, ఆనందమనిపిస్తే గెంతుతారు. అయితే, రాజస్థాన్కు చెందిన సంజుకు మాత్రం, ఆ పసితనంలోనే పెండ్లి జరిగిపోయింది. సరిగ్గా 18 ఏండ్ల తర్వాత, ఆమెకు బలవంతపు బాల్య వివాహం నుంచి విముక్తి లభించింది. ‘ఆ పసి తనపు పెండ్లి నాకొద్దు. నా ప్రమేయం లేకుండా నా జీవితాన్ని శాసించడం అన్యాయం’ అంటూ సంజు కోర్టుకెక్కింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేసింది. జోధ్పూర్కు చెందిన రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ కృతి ఈ పోరాటంలో సంజుకు ఎంతో సాయపడ్డారు. “సంజు తన మనసులోని బాధనంతా నాతో చెప్పుకొంది. ఎలాగైనా తనకు సాయం చేయాలని నిశ్చయించుకొన్నాను” అంటున్నది డాక్టర్ కృతి. న్యాయస్థానం తీర్పు వెలువడేవరకూ ఆమె సంజుకు అండగా నిలబడింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు.
“ఇన్నేండ్ల తర్వాత నేను బాల్య వివాహం నుంచి విముక్తి పొందాను. మా నాన్న చివరి కోరికను కృతి అక్క నెరవేర్చారు. ఇక నుంచి కొత్త జీవితానికి బాటలు వేసుకొంటాను. ప్రభుత్వ అధికారి కావాలన్నదే నా ధ్యేయం” అంటూ తన కలలను పంచుకొన్నది సంజు.