‘పితృస్వామ్య సమాజం ఓ కారడవి లాంటిది. ఆ మహారణ్యంలో ఆడపిల్ల క్రూర మృగాలనూ, మగాళ్లనూ తప్పించుకుంటూ సివంగిలా దూసుకుపోవాలి’ అంటారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షేర్నీ’ విడుదల సందర్భంగా మాట్లాడుతూ, స్త్రీ జీవితాన్ని ఆమె ఆడపులితో పోల్చారు. ‘మహిళలు కెరీర్లో పితృస్వామ్య భావజాలాన్ని బద్దలు కొడుతున్నారు. ఆకాశంలో విమానాలు నడుపుతున్నారు. అడవుల్లో ఫారెస్ట్ ఆఫీసర్లుగా వన్యమృగాలను రక్షిస్తున్నారు. స్త్రీలోని బలమైన కోణాన్ని తెరమీద చూపడానికి ఈ సినిమాద్వారా నాకో అవకాశం వచ్చింది. రచయితలు ఇలాంటి పాత్రలను నాకోసమే సృష్టించడం ఆనందంగా ఉంది. ఓటీటీ వేదికగా నా సినిమా 240 దేశాల్లో విడుదల కావడం సంతోషంగా అనిపిస్తున్నది. ‘షేర్నీ’ బలమైన మహిళకు సరికొత్త నిర్వచనం ఇవ్వబోతున్నది’ అన్నారామె ఆనందంగా.