చుట్టూ జలం. గుండెల్లో భయం. క్రమంగా నీళ్లలో కూరుకుపోతున్న భావన. ఆ క్షణంలో.. కేరింతలు కొడుతున్న చేపలు కనిపించాయి. ‘చిన్న చేపవల్ల అవుతున్నది, నాతో ఎందుకు కాదు?’ అనితనను తాను ప్రశ్నించుకొంది. విధిని ఎదిరించిన మనిషికి నీళ్లొక లెక్కా!అప్పటి నుంచీ ప్రతిగుడుపు మాధవీలత తాను పాల్గొన్న ప్రతి ఈతపోటీలోనూ తలరాతను ఓడించి, పతకాలు గెలిచింది. జీవితానుభవసారాన్ని ‘స్విమ్మింగ్ ఎగైనెస్ట్ ది టైడ్’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చింది.
దివ్యాంగురాలినని దిగులు చెందలేదు. ఆత్మవిశ్వాసం ఊతకర్రగా అడుగు ముందుకేసింది. వైకల్యం కంటే సంకల్పమే గొప్పదని నిరూపించింది మాధవీలత. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆమె సొంతూరు. జాతీయ స్థాయిలో మూడుసార్లు బంగారు పతకాలు సాధించింది, అంతర్జాతీయ వీల్చైర్ బాస్కెట్బాల్ క్రీడాకారిణిగా సత్తా చాటుకున్నది. తండ్రి పార్థసారథి రాజు ఉపాధ్యాయుడు, తల్లి వరలక్ష్మీదేవి గృహిణి. పోలియో మహమ్మారి ఆమె కదలికలను కట్టడి చేసింది. బాల్యమంతా సత్తుపల్లిలోనే గడిచిపోయింది. ఇంటర్ వరకూ అక్కడే చదివింది. డిగ్రీ ప్రైవేటుగా పాసైంది. ప్రతిభతో బ్యాంకు మేనేజర్ ఉద్యోగం సంపాదించుకుంది. ఉద్యోగ రీత్యా ఆమె కుటుంబం చెన్నైలో స్థిరపడింది.
రెండే దారులు
పోలియోతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో వైద్యులు మాధవి ముందు రెండు మార్గాలను ఉంచారు. ఒకటి, వెన్నెముకకు శస్త్రచికిత్స చేయడం. రెండు, హైడ్రోథెరపీ. మొదటిది ఖరీదైన వ్యవహారం. ఏమాత్రం తేడా వచ్చినా దుష్ఫలితాలు ఉండవచ్చు. అందుకే, మాధవి రెండో మార్గాన్ని ఎంచుకున్నది. కానీ, నీటిని గెలవడం అంత సులభం కాదు. కాళ్లూ చేతులూ చురుగ్గా కదిలితేనే ఈత కొట్టగలరు. వైకల్యాన్ని అధిగమిస్తూ ఈదడం మొదట్లో అసాధ్యంగా తోచింది. సాధన పెరిగేకొద్దీ పట్టు పెరిగింది. నైపుణ్యం అబ్బింది. ఆ ప్రతిభ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేవరకూ వెళ్లింది. అప్పటి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహకారంతో మాధవి పారాలింపిక్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ను ఏర్పాటుచేసింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దివ్యాంగులు పాల్గొనేలా ప్రోత్సహించింది. వీల్చైర్ బాస్కెట్బాల్ బృందాన్ని అంతర్జాతీయ పారాలింపిక్స్ వరకూ తీసుకెళ్లింది. 2011లో పారాలింపిక్స్ అసోసియేషన్నూ ప్రారంభించింది. ఈ సంఘాలు ఎంతోమంది దివ్యాంగులను క్రీడలవైపు నడిపించాయి. విశ్వ వేదికల మీద పతకాల పంట పండించాయి. వీల్చైర్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షురాలిగానూ మాధవీలత సేవలు మరువలేనివి.
అనుభవాలే అక్షరాలుగా..
తన జీవితానుభవాలను ‘స్విమ్మింగ్ ఎగైనెస్ట్ ది టైడ్’ పేరుతో అక్షరబద్ధం చేసింది మాధవీలత. ఈ పుస్తకం చదివి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అపారంగా ప్రభావితులు అయ్యారు. ‘ఉదయాన్నే బాస్కెట్బాల్ ఆడటం నాకు అలవాటు. నేను చెన్నై రాజ్భవన్లో ఉన్నప్పుడు మీరూ రండి. ఇద్దరం ఆడుకుందాం. మీ స్ఫూర్తిదాయక జీవితం గురించీ వినాలని ఉంది’ అంటూ మాధవీలతకు ఆహ్వానం పంపారు. ఆ పిలుపు మేరకు చెన్నై రాజ్భవన్లో ఉపరాష్ట్రపతిని కలిసిందామె. ఎంతోమంది ప్రముఖులు ఉపరాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ, మాధవీలత మాత్రం నేరుగా వెళ్లి ఆయనతో భేటీ అయ్యింది. ఆయన చేతుల మీదుగా సత్కారమూ అందుకొన్నది. పోటీల కోసమో, సాధన కోసమో మాధవి నీటిలోకి దిగిన ప్రతిసారీ చేపలు ఆమెవైపు అబ్బురంగా చూస్తాయి. ఆ మెరుపువేగం నుంచి పాఠాలు నేర్చుకుంటాయి.
పతకాలే పతకాలు
2011లో మహారాష్ట్ర కొల్హాపూర్లో జరిగిన 11వ నేషనల్ పారాలింపిక్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్నది. 2012 పారాలింపిక్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించింది. తదుపరి ఏడాది ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నది. మూడో ఏడాది నాలుగు బంగారు పతకాలు సాధించింది, నాలుగో ఏడాదీ మూడు బంగారు పతకాలు అందుకున్నది. ఇవి కాకుండా, రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో పన్నెండు స్వర్ణ పతకాల వరకూ మాధవీలత ఖాతాలో పడ్డాయి.
… దమ్మాలపాటి సత్యనారాయణ