చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే కానీ, వయసు అడ్డుకాదని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. తమిళనాడుకు చెందిన ధనాబకియం అమ్మళ్ ఆ జాబితాలో కొత్తగా చేరారు. ఆమె వయసు అరవై అయిదు. కరోనా కష్టకాలంలోనూ అక్షరాలు దిద్దేందుకు బయలుదేరింది. అంగన్వాడీ కార్యకర్తగా ఈమధ్యే ఉద్యోగ విరమణ చేసింది అమ్మళ్. కొలువులో ఉండగా, జీతం తీసుకున్న ప్రతిసారీ వేలిముద్ర వేయాల్సి వచ్చేది. చదువుకుందామంటే సమయం దొరికేది కాదు. పింఛను తీసుకుంటున్నప్పుడైనా, సంతకం చేయాలని తీర్మానించుకొంది. ఆ ప్రయత్నంలో భాగంగా.. కొత్తమంగళం ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు చిత్రారాణిని కలిసింది. తనకు పాఠాలు చెప్పాల్సిందిగా కోరింది. చిత్రారాణికి ఇదంతా చిత్రంగా అనిపించింది. అక్షరాలు దిద్దించడానికి సంతోషంగా ముందుకొచ్చింది. ‘నేనిప్పుడు అక్షరమాల రాయగలుగుతున్నాను. అలాగే, పత్రికల హెడ్లైన్స్ చదువుతున్నాను. ప్రస్తుతం మూడో తరగతి పుస్తకాల్లోని పాఠాలు చెబుతున్నారు నాకు” అంటున్నది అమ్మళ్.