లక్ష్యంపైనే గురిపెట్టి అస్ర్తాన్ని సంధించేవారే గమ్యాన్ని చేరుకుంటారు. చరిత్ర సగర్వంగా చెప్పుకొనేలా స్ఫూర్తిని రగిలిస్తారు. అచ్చంగా అలాంటి యువతి ఇంద్రాణి దహాల్. ఈమె ఒంటరిగా బైక్పై దేశాన్ని చుట్టేస్తున్నది.
ఒకరోజో, వారం రోజులో కాదు, 28 రోజులుగా ఈ 27 యేండ్ల యువతి ఒంటరిగా దేశాన్ని చుట్టేస్తూ.. స్వేచ్ఛా వాయువులు పీలుస్తూనే ఉంది. ‘ధైర్యే సాహసే ఇంద్రాణి’ అన్నట్లుగా సెల్ఫోన్ నెట్వర్క్ లేని దట్టమైన అడవుల్లోనూ దూసుకెళ్తూ తనను తాను కొత్తగా కనుగొంటున్నది. దారిలో ఎంతోమందితో పరిచయం, ఎన్నో స్నేహాలు, మరెన్నో తీపిగుర్తులను భద్రంగా మూట గట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుతున్నది. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్కు చెందిన ఇంద్రాణి ఓ క్రూజ్ షిప్ ఆపరేటర్. 15 ఏండ్ల వయసులో తన తమ్ముడి సాయంతో బైక్ నేర్చుకున్నది. గత నవంబర్లో దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. ‘నా ప్రయాణంలో ఎందరో అపరిచితులు ఎదురైనా ఎప్పుడూ భయడింది లేదు. తమిళనాడులో ధనుష్కోటి బీచ్ నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. అదో భూతల స్వర్గం’ అని ఆమె వివరించారు. ఇంద్రాణిది ఒంటరి ప్రయాణమే అయినా ఆమెకు ఆయా రాష్ర్టాల బైక్ రైడర్స్ సహకారం ఉంటున్నది. అవసరమైతే స్థానిక పోలీసుల సాయం తీసుకుంటుంది. దారిలో సైన్యం ఎదురైనా, నక్సల్స్ తారస పడినా నింపాదిగా సమాధానం చెప్పి ముందుకు సాగుతున్నది ఇంద్రాణి. రాన్ ఆఫ్ కచ్ సమీప గ్రామంలోని ఆరుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆమెను మహారాణిలా చూసుకున్నదట. ‘ఆ రాత్రి నా వినోదం కోసం గ్రామస్తులంతా కలిసి సంప్రదాయ గీతాలను ఆలపించారు’ అని ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నది.