ఇప్పుడిప్పుడే మహిళలు వ్యాపార రంగంలోకి వస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టో, బ్యాంక్లో అప్పు తీసుకొనో ముందడుగు వేస్తున్నారు. అయితే, వ్యాపారంలో లాభాలు రావాలన్నా, వచ్చినా ఆ వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్నా ఓ మార్గదర్శి అవసరం. ‘హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ)’ అలాంటి యువ వ్యాపారులకు దిక్సూచిగా నిలుస్తున్నది. బిజినెస్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇస్తున్నది. 57 ఏండ్ల చరిత్రగల హెచ్ఎంఏకు మూడో మహిళా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు కవితా రాజేశ్. ఈ సందర్భంగా తన జీవితానుభవాలతోపాటు హెచ్ఎంఏ అందిస్తున్న సేవలను ‘జిందగీ’తో పంచుకొన్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
వ్యాపారం అంటే ఎంతోకొంత పెట్టుబడి పెట్టి లాభాలు ఆశించడం కాదు. సరైన అవగాహన లేకుండా దిగితే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బిజినెస్ కూడా ఒక కళే! సంకల్పబలం, దూరదృష్టి, సరైన నిర్ణయాలు తీసుకొనే శక్తి.. ఉన్నప్పుడే ఈ రంగంలో విజయం సాధించగలం. ముప్పయ్ ఏండ్ల వయసులో నేను వ్యాపారంలోకి వచ్చాను. ‘ఓం సాయి ఆంధ్ర పెయింట్స్’ ప్రారంభించాను.1957లో మా నాన్న ఇదే పేరుతో వ్యాపారం చేశారు. కొన్నాళ్లకు భాగస్వాములు తప్పుకోవడంతో ఆయనే నిర్వహించారు. మా స్వస్థలం మెదక్ జిల్లా జోగిపేట. కానీ, నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్లోనే. కామర్స్ గ్రాడ్యుయేషన్తోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో ‘లా’ చదివాను. వివిధ సంస్థల్లో ఫైనాన్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో పనిచేసిన అనుభవంతో 2002లో నాన్న వ్యాపారాన్ని పునఃప్రారంభించాను. కంపెనీ పేరు, ‘గోల్డ్సీల్’ అనే బ్రాండ్ మాత్రమే తీసుకొని నా ప్రస్థానం మొదలుపెట్టాను. వ్యాపారం చేస్తున్న తొలినాళ్లలో హెచ్ఎంఏతో పరిచయమైంది. ఇప్పుడు అదే అసోసియేషన్కు ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది.
ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్) రంగాలకు హెచ్ఎంఏ అన్ని విధాలా తోడ్పాటును అందిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లో ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా మా సంస్థలో సభ్యత్వం తీసుకోవచ్చు. ముఖ్యంగా మహిళా వ్యాపారులకు మరింత ప్రోత్సాహం దొరుకుతుంది. వ్యాపార అభివృద్ధికి సలహాలు అందిస్తూనే, బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నాం. బ్యాంకుల్లో రకరకాల స్కీమ్లు అందుబాటులో ఉంటాయి. ఆ సంగతి చాలామందికి తెలియదు. మమ్మల్ని సంప్రదించిన వారికి ఆ వివరాలు ఇస్తాం. అంతేకాదు, మా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుసంధానమైంది. ఫలితంగా వ్యాపార విస్తరణకు అవసరమైన రుణం సులభంగా పొందవచ్చు. సభ్యులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఇంటర్నేషనల్ ట్రేడ్ డెస్క్ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దాదాపు 16 డెస్క్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా ఏడాది పొడవునా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లోని మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం ‘ఇండస్ట్రీ రెడీనెస్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నాం. కాలేజీ రోజుల్లోనే కార్పొరేట్ ప్రపంచాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. వారిని వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. ఎంబీఏ పూర్తయిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఈ ప్రోగ్రామ్లోకి తీసుకుంటాం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తాం. వారికి బిజినెస్ స్కూల్స్ ఫ్యాకల్టీతో, ఆంత్రప్రెన్యూర్స్తో క్లాసులు చెప్పిస్తాం. మేం ఇచ్చే ట్రెయినింగ్ సర్టిఫికెట్ ఉద్యోగ ప్రయత్నంలో ఉపయోగపడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, గీతమ్, ఆదిత్య మొదలైన విద్యాసంస్థలు మాతో అనుసంధానమయ్యాయి.
హెచ్ఎంఏ బోర్డ్లో 23 మంది సలహాదారుల బృందం ఉంది. అందులో ప్రముఖ వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ అధికారులూ మాతో కలిసి పనిచేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ వేదికగా మా కార్యకలాపాలు కొనసాగించాం. చిన్న, మధ్య తరహా వ్యాపారుల అభివృద్ధి లక్ష్యంగా పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్తో సమావేశాలు నిర్వహిస్తున్నాం. స్త్రీ సాధికారత లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మా కార్యాలయంలో పని చేస్తున్నవాళ్లంతా మహిళలే కావడం మరో విశేషం. మహిళా వ్యాపారవేత్తల అభ్యున్నతికి ఈ ఏడాది చేయాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే ప్రణాళికలు అన్నీ సిద్ధం చేసుకున్నాం. వాటన్నిటినీ అమలు చేస్తామన్న నమ్మకం ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్లలోని యువ మేనేజర్లను ప్రోత్సహించేందుకు, వాళ్ల అభివృద్ధికి తోడ్పడేందుకు 1964లో కొందరు ఔత్సాహిక వ్యాపారవేత్తలు ‘హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్’ను స్థాపించారు. విజ్ఞానవంతులైన విద్యార్థులు, యువ ఎగ్జిక్యూటివ్లకు మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించడం, మేనేజర్లకు ప్రొఫెషనలిజం బోధించడం ఈ సంస్థ లక్ష్యాలు. అంతేకాదు, వ్యాపారస్తులకు మార్గదర్శిగా నిలుస్తున్నది. వివిధ కేటగిరీల్లో నిష్ణాతులైన వారికి ఏటా ప్రోత్సాహక పురస్కారాలూ అందజేస్తున్నది. కాలానుగుణంగా మారే వ్యాపార సూత్రాలు తెలియజేస్తూ, కోటి ఆశలతో ఈ రంగంలోకి వస్తున్నవారికి అండగా నిలుస్తున్నది. విద్యాసంస్థలు, విద్యార్థులు కాకుండా హెచ్ఎంఏలో రెండువేల మందికిపైగా సభ్యులు ఉన్నారు.
నేను ఎంబీఏ చివరి సెమిస్టర్ చదువుతున్నాను. లాక్డౌన్ సమయంలో హెచ్ఎంఏ ‘ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రోగ్రామ్’లో మెంబర్షిప్ తీసుకున్నాను. అందులో మేనేజ్మెంట్, అవేర్నెస్, టీమ్ వర్క్, ఇంటర్వ్యూ, పాజిటివ్ యాటిట్యూడ్ మొదలైన ఎన్నో అంశాల్లో శిక్షణ ఇచ్చారు.
వారాంతాల్లో సెషన్లు ఉండేవి. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల పాఠాలతో విలువైన విషయాలు నేర్చుకున్నా. ఈ శిక్షణ కారణంగానే చివరి సెమిస్టర్లో ఉండగానే ‘ఫ్యాక్ట్సెట్ సిస్టమ్’ కంపెనీలో
ఉద్యోగం సాధించగలిగాను.
పుప్పాల సింధు, స్టూడెంట్
–నిఖిత నెల్లుట్ల, జి.భాస్కర్