నా వయసు ఇరవై మూడు. అమ్మానాన్న నాకు పెండ్లి చేయాలనుకొంటున్నారు. ఇంత త్వరగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం, ఏ వయసులో చేసుకొంటే వివాహ బంధం బలంగా ఉంటుంది?
ప్రేరణ, హైదరాబాద్
భారతదేశంలో చట్టబద్ధమైన వివాహానికి అబ్బాయికైతే 21 ఏండ్లు, అమ్మాయికైతే 18 ఏండ్లు నిండితే చాలు. అయితే, ఆ వయసే ప్రామాణికమని చెప్పలేం. ఏ వయసులో వివాహం చేసుకోవాలన్నది పూర్తి వ్యక్తిగతం. మన సంస్కృతిలో పెండ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మనం కుటుంబ వ్యవస్థకు విలువనిస్తాం. కాబట్టి, వివాహం అనేది జీవితంలో మైలురాయి లాంటిది. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా మొదట పెండ్లి తర్వాత వచ్చే బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. చదువు, జీవితానుభవం, ఆర్థిక స్థిరత్వం మొదలైనవి బలమైన వివాహానికి పునాదులు. ఆలస్యంగా జరిగే పెండ్లిళ్లే ఎక్కువకాలం నిలుస్తాయని, 25-29 ఏండ్ల మధ్యలో పెండ్లి చేసుకోవడం ఉత్తమమని ఓ అభిప్రాయం. నిజానికి, యుక్త వయసులో భావోద్వేగాలు ఒకేతీరుగా ఉండవు. ఒకటేమిటి, ఎన్ని రకాలుగా చూసుకున్నా పెండ్లి అనేది పాతిక తర్వాత అయితేనే, దాంపత్య బంధాన్ని అర్థం చేసుకోగలరు.
రాధిక నల్లన్ ఆచార్య
క్లినికల్ సైకాలజిస్ట్