సిద్దిపేట కలెక్టరేట్/ సంగారెడ్డి /మెదక్, మే 21 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాక్డౌన్ మరింత కఠినంగా అమలుచేయడంతో పాటు కొవిడ్ కట్టడికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని దవాఖానల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ అర్బన్ జిల్లా నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్ధేశం చేశారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరుగాలని, శుభ్రంగా కనిపించాలని స్పష్టం చేశారు. మందులు ఏవైనా అవసరం ఉంటే ముందుగా తెలియజేసి స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. ఉదయం 10 తర్వాత బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లాక్డౌన్ కఠినంగా అమలు అయినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇంటిం టి జ్వర సర్వే రెండో విడుత ప్రారంభించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మెదక్జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో లాక్డౌన్ నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడుత జిల్లా మొత్తం ఇంటింటి జ్వర సర్వే పూర్తయిందని, గుర్తించిన వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందజేశామన్నారు. ఆక్సిజన్, మందులు స్టాక్ ఉన్నాయని సీఎంకు తెలిపారు. మెదక్జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశమున్నందున, వచ్చే 10 రోజులలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయుటకు 2,3 ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లను అదనంగా నియమించి 200 లారీలకు పైగా సమకూర్చాల్సిందిగా కలెక్టర్ హరీశ్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, డీఎంహెచ్వో గాయత్రీదేవి పాల్గొన్నారు.
రాష్ట్రంలో బెడ్లకు కొరుత లేదు
దవాఖానల్లో బెడ్ల కొరుత లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 28 వేలకు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు గ్రామపంచాయతీలు ముందస్తుగా స్వీయనియంత్రణకు లాక్డౌన్ ప్రకటించుకొని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశాయని, ఆయా గ్రామాలను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో లాక్డౌన్ అమలు, కరోనా కేసుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్డెవిస్ సీఎం కేసీఆర్కు వివరించారు. క్షేత్రస్థాయిలో అన్ని చర్యలపై జిల్లా యంత్రాం గం అప్రమత్తంగా ఉందని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. వీడియో కన్ఫరెన్స్లో సిద్దిపేట కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవిస్తోపాటుగా డీఆర్వో చెన్నయ్య, డీఎంహెచ్వో మనోహర్, తదితరులు పాల్గొన్నారు.